Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాటి మనుషుల కష్టాలను చూసి కన్నీరై కరిగినవాడు.. ఆ కష్టాలకు కారకులపై కన్నెర్ర జేసినవాడు..ఉపాధ్యాయ ఉద్యోగమొదిలి ఉద్యమాలను హత్తుకున్నవాడు..
అరుణపతాకనెత్తుకున్నవాడు...ఎండిన డొక్కల్ని ఎర్రని జెండాలుగా మార్చి దిక్కులన్నిటినీ వెలిగించినవాడు...మట్టి గొంతులకు నెత్తుటి గీతాలు నేర్పి తెలంగాణ వైతాళికుడై వెలుగొందినవాడు...అడుగు దూరంలో మరణం ఎదురవుతుందన్నా భయమెరుగని వీరత్వం.. తనువంతా గాయాలవుతున్నా తలవంచని ధీరత్వం...
ఆతని పేరు విన్నంతనే చల్లని గాలేదో ఓదార్చిన జ్ఞాపకం... వెచ్చని వొడి ఏదో సేద దీర్చిన జ్ఞాపకం..
శాంతీ కాంతీ స్వరూప స్వభావాలుగా కలిగిన ఆ జ్ఞాపకం పేరే అరిబండి లక్ష్మీనారాయణ.
కమ్యూనిస్టు ఉద్యమానికి అనేకమంది వీరులనందిం చిన పోరాటకేంద్రం పెంచికల్దిన్నె. సాయుధపోరాట కాలంలో తెలంగాణ 'మాస్కో'గా పేరొందిన ఊరు. నాటి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ తాలూకా నేరేడుచర్ల మండలంలో నేటికీ కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ పోరుగడ్డలో పొడిచిన సూర్యుడే కామ్రేడ్ అరిబండి లక్ష్మీనారాయణ. జీవితమంటే చీకటి నుంచి వెలుతురులోకి ప్రయాణమన్నది అరిబండికి అరుణపతాకమిచ్చిన సందేశం. ప్రయాణమంటే తను నడవడమే కాదు, నలుగురినీ నడిపించడం అన్నది అతనికి కమ్యూనిజమిచ్చిన చైతన్యం. అందుకే నిజాం జమానాలో చీకటి అగాధాల్లో మగ్గుతున్న తెలంగాణ జన జీవితాలను వెలుగులోకి నడిపించడమే తన జీవిత లక్ష్యమనుకున్నాక.. బతుకు బండికి అటు సిద్ధాంతాన్ని, ఇటు ఆచరణను చక్రాలుగా చేసి ఊరూరూ తిరిగిన bర్రజెండాల బండి అరిబండి. చెట్టునూ పుట్టనూ చెరబట్టిన దొరస్వామ్యం పచ్చని బతుకుల మీద నిప్పుల వర్షం కురిపిస్తున్నప్పుడు.. ఉప్పెనలా ఎగసిన ఉద్యమ కెరటం అరిబండి.
తను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రాంతంలో దాచారం దొరల దాష్టీకం ఆయన్ని కదిలించింది. ఆ దొరల కారణంగా ఆ ఊరికి పిల్లనివ్వడానికి కూడా ఎవరూ ముందుకురాని పరిస్థితి. ఎవరింట్లో పెండ్లయినా పన్ను కట్టి దొర ఇంటి నుంచి పటం తెచ్చుకోవాలి. పెండ్లయిన కొత్త కోడండ్లు మరో కొత్త కోడలు ఆ ఊరికి వచ్చేదాకా దొర ఇంట్లో క్రమం తప్పక పనిచేయాలి. ఆ క్రమంలో వారి అన్నిరకాల అఘాయి త్యాలకూ విధిగా తలవంచాలి. ఇంతకంటే దుర్మార్గమే ముంటుంది. అందుకే కమ్యూనిస్టుపార్టీ ఇందుకు వ్యతిరేకంగా బహిరంగసభకు పిలుపునిచ్చింది. ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా తండోపతండా లుగా తరలివచ్చారు. సంఘం నేతృత్వంలో దొరల దౌర్జన్యాలను ముక్త కంఠంతో ఖండించారు. ఇది సహించలేని దాచారం, పత్తేపురం దొరలంతా ఏకమై ఈ సభకు నాయకత్వం వహించిన సంఘ నాయకులు అన్నపురెడ్డి గోపయ్య, గుడంపాటి గోపయ్యలను చెట్లకు కట్టేసి ఘోరంగా హింసించి, తుపాకులతో కాల్చి చంపారు. అడ్డొచ్చిన ఏడుగురు రైతులను కూడా పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేసారు. ఈ ఘటనతో రగిలిపోయాడు అరిబండి. ఊర్లకు ఊర్లే దొరల చెరలో ఉసురొదు లు తుంటే తను ఉద్యోగం లో కొనసాగలేక పోయా డు. ఏరికోరి ఎంచుకున్న ఉపాధ్యాయ వృత్తినొదిలి ఉద్యమ జెండానందు కున్నాడు. తెలంగాణ విముక్తిపాఠమై ప్రజలను వీరులుగా తీర్చిదిద్దాడు. దాచారం, పత్తేపురం దొరలపై సమరశంఖం పూరించా డు. బెంబేలెత్తిన దొరలు పోలీసులను సహాయానికి తెచ్చుకున్నా ప్రజాగ్రహం ముందు నిలువలేకపోయారు. రాత్రికి రాత్రే ఊర్లు ఖాళీ చేసి పారిపోయారు. పారి పోయిన దొరల సొంతానికి 90ఎకరాలు వదిలి, మిగిలిన వందల ఎకరాల భూమిని ప్రజలకు పంచిన అరిబండి... పోరాటవిరమణ వరకూ ఆ పరంపరను కొనసాగించాడు.
స్వతహాగా మంచి ఉపాధ్యాయుడైన అరిబండి అడవుల్లో సాయుధ దళాలకు, గ్రామాల్లో ప్రజలకు ఏం చెప్పినా అది ఓ హృద్యమైన పాఠమే! ఎందుకంటే ఆయన తన మాటల్లో నిజాయితీనే కాదు, తన హృదయాన్నీ జోడించేవాడు! మృదుస్పర్శ కలిగినవాడూ గుండెతడి ఎరిగినవాడూ గనుక ఆయన మాటలు సూటిగా వారి మనస్సుకు హత్తుకునేవి. ఇంతకీ ఏమున్నది ఆ మాటల్లో..? నిజమున్నది. నిండు జీవితమున్నది. ఈ నేలనంటిపెట్టుకున్న సామాజికత ఉన్నది. అది నిరక్షరాస్యులైన ప్రజలకు పాలక, పాలిత సంబంధాలను ఎరుకపరిచే సామాజికత. పీడిత, పీడక వర్గాల మధ్య వైరుధ్యాలను తెలిపే సామాజికత. ఆయన కాల్పనిక గాథల గురించో, ఆకాశ నక్షత్రాల గురించో చెప్పలేదు. తామెక్కడ నివసిస్తున్నారో, ఎక్కడ శ్వాసిస్తున్నారో ఆ నేల గురించీ, గాలి గురించీ, ఆ నేల మీద వారి జీవన వ్యాపకాల గురించీ, ఆ నేలను తడిపే చెమట గురించీ, ఆ చెమటను దోచే దోపిడీ గురించీ చెప్పాడు. ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించే రాజకీయ అవగాహనను నేర్పించాడు. వర్తమానం మీద నిలబడి చరిత్రనూ, భవిష్యత్తునూ చూడగలిగిన దార్శనికతను అందించాడు. అందుకే ఆయన ఉద్యమంలో కూడా ఉపాధ్యాయుడై నిలిచాడు.. సామాన్యులను సాహసికు లుగా మలిచాడు. వీరులుగా ధీరులుగా తీర్చిదిద్దాడు.
అందుకే అతన్ని, అతని దళాన్ని మట్టుబెట్టాలని భూస్వాములు పన్నాగం వేశారు. కొందరు ద్రోహులను లొంగదీసుకుని.. కృష్ణపట్టి అడవుల్లో గెరిల్లా సైన్యాల రహస్య స్థావరాన్ని తెలుసుకున్నారు. మూడువందల మంది పోలీసులతో ముట్టడికి బయలుదేరాడు.. వారిని దూరం నుంచే పసిగట్టిన సెంట్రీ దళాన్ని అప్రమత్తం చేసాడు.. కానీ అప్పటికే సమయం మించిపోయింది. శత్రువు మూడు వైపుల నుండీ ముట్టడిస్తున్నాడు. తప్పించుకోవడానికి ఒకే ఒక దారి... అది కృష్ణా నదిని దాటడం. వర్షాకాలం కావడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ సమయంలో నదిని దాటడం సాహసమే కాదు, ప్రమాదం కూడా..! కానీ మరో మార్గం లేదు. ఆలోచించడానికి తగిన వ్యవధీ లేదు! అప్పుడు వచ్చింది అరిబండి నుండి ఆజ్ఞ... ''గెరిల్లా యోధులారా! శత్రువులు పెద్ద సంఖ్యలో ముంచుకొస్తున్నారు. వారి చేతికి చిక్కటం, ఆయుధాలను అప్పగించడం ఆత్మహత్యా సదృశ్యం. కనుక నదిని దాటడమొక్కటే మార్గం. అధైర్యపడకండి.. ఇప్పుడు మన సంకల్పమే మనల్ని రక్షిస్తుంది. ఈ కొండ చాటునుండి నదిలోకి దూకుదాం. ఆవలితీరంలో రక్షణ తీసుకుందాం. ఈ ప్రయత్నంలో మరణమే అనివార్యమైతే ఆనందంగా ఆహ్వానిద్దాం. అంతే తప్ప శత్రువు ముందు తలొంచేది లేదు. ఆయుధాలు జాగ్రత్త.. పదండి'' అని చెప్పి ముందుకు కదిలాడు. గెరిల్లాలంతా కొదమ సింహాల్లా కదిలారు. సమీపించిన పోలీసులను నిశ్చేష్టులను చేస్తూ 'అరుణపతాకకు జై' అంటూ నదిలో దూకారు. ఆయుధాలతో సహా అజేయులై ఆవలి తీరం చేరారు. ఇది అరిబండి అద్భుత ప్రేరణ శక్తికి ఓ మచ్చుతునక! ఆ బడి పంతులు జీవితంలో ఇలాంటి సాహసఘట్టాలెన్నో.....!
ఈ సంఘటన తరువాత పరాభవభారంతో వెనుదిరిగిన భూస్వాములకు కంటికి కునుకులేదు! ఎందుకంటే తొక్కినకొద్దీ మొలకెత్తే విత్తన వారసత్వమా పోరాటమని వారికి తెలుసు! అందుకే దళం ప్రతీకారదాడికి పాల్పడుతుందన్న భయమూ, ఒత్తిడీ తట్టుకోలేక, రాజీకి దిగివచ్చారు. రాయబారాలు మొదలు పెట్టారు. తమకు తరతరాలుగా వెట్టి చేస్తున్న దళితులకు రెండువందల ఎకరాలకు పైగా ఉచితంగా అప్పగించడానికి సిద్ధపడ్డారు. మిగిలిన భూములను రూ.60కి ఎకరం చొప్పున రైతులకు ఇవ్వడానికి అంగీకరించి ప్రాణాలు దక్కితే చాలని పట్నాలకు వలసపోయారు. అదీ అరిబండి పోరాట పటిమ.
ఆయన ఆలోచనలను ఆచరణను విడదీసి చూడలేం. చెప్పింది చేయడం, చేసేదే చెప్పడం ఆయన లక్షణం. ఆయన మాటంటే గెరిల్లా దళాలకే కాదు, స్థానిక ప్రజలకూ గురి. ఎందుకంటే.. తగిలిన గాయాలను తుడి చి ఆ గాయాల గుండెలనిండా మనిషితనమై చిగురించి నవాడుగనుక.. త్యాగాల పునాదుల మీద పోరాటమై మొ లకెత్తినవాడుగనుక.. అందుకే ప్రజలు వందలు వేలాదిగా ఆయన పిలుపునకు స్పందించారు. కనుకనే ఆయన దాచారం, ఫత్తేపురం, లింగగిరి, పొనుగోడు దొరలూ జాగీ ర్దార్లను గడగడలాడించి వందలాది ఎకరాలను ప్రజా పరం చేయగలిగాడు. ఆయన స్వభావంలో శాంతి కపో తమే..! కానీ ప్రజాకంటకుల పాలిట అగ్ని పతాకం..!!
పోరాట విరమణ తరువాత అజ్ఞాతం వీడి.. మధ్యతరగతి రైతుగా వ్యవసాయం చేసుకుంటూనే కమ్యూనిస్టుగా జీవితం కొనసాగించాడు. నిత్యం ప్రజలతోనే మమేకమయ్యాడు. తలవంచుకు బతుకలేక, తలపడే శక్తిలేక తల్లడిల్లుతున్నవారిని అల్లుకుని ఆలంబనయ్యాడు. ఎంతగా అంటే... ''నా అంత్యక్రియలు అరిబండి లక్ష్మీనారాయణ చేతులమీదుగానే జరగాలి'' అని ఓ నిరుపేద దళితుడు తన చివరి కోరిక కోరేంతగా..! అతనేమీ అనాధ కాదు. కన్న కొడుకులూ, బిడ్డలూ, అయినవాళ్లందరూ ఉండి కూడా మరణించే ముందు అతడీ కోరిక కోరాడు. ఆ సమయంలో శాసనసభ్యుడిగా ఇతర రాష్ట్రాలలో అధికార పర్యటనలో ఉన్న అరిబండి.. అన్నీ రద్దు చేసుకునివచ్చి అతడి ఆఖరి కోరిక నెరవేర్చాడు. ఆయన ప్రజలతో ఎంతగా మమేకమ య్యేవాడో తెలుసుకునేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే! అందుకే ఆయన అందరికీ తండ్రిలాంటివాడే కాదు, ఎందరికో కొడుకులాంటివాడు కూడా.
అణువణువునా నిజాయితీ నిరాడంబరతలు మూర్తీ భవించిన ఆ త్యాగశీలి తన జీవితమంతా ప్రజాసేవకే ధారపోసాడు. సాయుధపోరాట విరమణానంతరం మిర్యాలగూడ, హుజూర్నగర్ తాలూకాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కీలకమై నిలిచాడు. ముఖ్యంగా రైతుల కోసం ఇల్లూ ఒళ్లూ మరిచాడు. పిడికెడు మట్టిని గుండెలకద్దుకుని, మొద్దుబారిన నాగండ్లను నిద్దుర లేపాడు.. నేల పొరల్లోకి దిగి, తడిలేక మొలకెత్తని విత్తనం తలనిమిరి భరోసానిచ్చి భవిష్యత్తును వాగ్దానం చేసాడు.. అలా రైతాంగ ఉద్యమంలో అతడిది అవిశ్రాంత కృషి. సీపీఐ(ఎం) నల్లగొండజిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా, రాష్ట్రకమిటీ సభ్యుడిగా, రైతుసంఘం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర నేతగా ఉద్యమ నిర్వాహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. సీపీఐ(ఎం) తరఫున నాలుగు పర్యాయాలు మిర్యాలగూడ నుంచి శాసనసభకు పోటీ చేసి రెండుసార్లు (1978, 1985) విజయం సాధించాడు. పదేండ్ల కాలం ప్రజాప్రతినిధిగానూ ప్రజల మనసులను గెలుచు కున్నాడు. కార్యకర్తలను కన్నబిడ్డల్లా భావించే ఆయన పలకరింపులోని అప్యాయత, అనురాగాలే కాదు, కర్తవ్యబోధనలోని కచ్చితత్వమూ ప్రేమామృతమే..! అవే ఆయనను అందరికీ, అందరినీ ఆయనకూ చేరువ చేస్తాయి. చేరదీస్తాయి. ఎందుకంటే.. అతడు మట్టిమీద మమకారాన్ని చంపుకోలేని మనుషుల కన్నీటిధారల్లో ఎరుపెక్కినవాడు. బతుకంతా కరిగిపోతూ పోరాటమై చిగురించినవాడు. ఎప్పుడూ తెల్లని బట్టల్లో కళకళలాడే ఆ తేజోమూర్తి సుందర రూపమే కాదు.. అతని హృ దయమూ సౌందర్యభరితం.. 1923నుంచి 98వరకు సాగిన జీవితంలో కమ్యూనిస్టుగా అతనిది ఐదున్నర దశాబ్దాల ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రతి అడుగూ పరిమళభరితం.. ఆ జీవితం అరుణారుణ చరితం..
- రాంపల్లి రమేష్
సెల్ : 9666011107