Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను తమ ప్రభుత్వం దారి మళ్లించడం లేదని అందుకు సంబంధించిన అన్ని లెక్కలూ ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీలో పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. సంతోషం. కానీ ఇది వాస్తవమా? కాదా? అనేది తెలుసుకోవాల్సి ఉంది. నిజంగా నిధులను పక్కదారి పట్టించకుండా దళితుల సంక్షేమానికే కేటాయిస్తే మంచిదే. కేటాయించిన లక్ష్యం కూడా అదే కాబట్టి. కానీ వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితులు చాలా తేడాగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులకు, నిధుల విడుదలకు, ఖర్చులకు పొంతన లేకుండా ఉంది. మరి నిధులు దారి మళ్లలేదనడం ఏ రకంగా సరైనదో పాలకులకే తెలియాలి. ఒక్కసారి టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కాలంలో ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధుల కేటాయింపులు, నిధుల మంజూరు, ఖర్చుల లెక్కలను పరిశీలిస్తే ఈ ప్రభుత్వం దళితుల పట్ల ఏ రకంగా వివక్ష చూపుతుందో తెలుస్తోంది. మొదట బడ్జెట్లో కేటాయించిన మొత్తం నిధులను ఈ ప్రభుత్వం ఏనాడూ పూర్తిగా విడుదల చేయలేదని గుర్తించాలి. కనీసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు ఎస్సీలకు 2014-15లో బడ్జెట్లో రూ.7,579 కోట్లు కేటాయించగా, కేవలం రూ.3,235కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అందులోనూ కేవలం రూ.2,936 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ విడుదల చేసిన బడ్జెట్లో రూ.4,643 కోట్లు ఏమయ్యాయి?. దారిమళ్లాయని ఈ లెక్కలే చెబుతున్నాయి. అలాగే 2015-16లోనూ రూ.8,089 కోట్లు కేటాయించగా, రూ. 4,380 మంజూరు చేశారు. అందులోనూ కేవలం రూ.4,682 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో రూ.3,407కోట్లు దారి మళ్లాయి. 2016-17లో రూ.10,484 కోట్లు కేటాయించగా, రూ.7,173కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇందులోనూ రూ.4,545కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే రూ.5,939 కోట్లు దారి మళ్లాయి. 2017-18లో రూ.14,375కోట్లు కేటా యించగా, రూ.10,820కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇం దులోనూ కేవలం రూ.10,178 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే రూ.4,197 కోట్లు దారి మళ్లాయి. 2018-19లో రూ. 16,452కోట్లు కేటాయించగా, రూ.11,077 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇందులో రూ.11,020కోట్లు ఖర్చు చేశారు. అంటే రూ. 5,432కోట్లు దారిమళ్లాయి.
ఎస్టీలకు కేటాయించిన నిధుల విషయంలోనూ ఇదే పరిస్థి తి. 2014-15లో రూ.4,559కోట్లు కేటాయించగా, రూ. 1,727 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ.2,832కోట్లు దారి మళ్లాయి. 2015-16లో రూ.5,035కోట్లు కేటాయించగా, రూ. 3,221కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే రూ.1,814 కోట్లు దారిమళ్లాయి. 2016-17లో రూ.6,171కోట్లు కేటాయించగా, రూ.3,385కోట్లు ఖర్చు చేశారు. అంటే రూ.2,786కోట్లు దారి మళ్లాయి. 2017-18లో రూ.8,165 కేటాయించగా, రూ. 4,579 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.3,586 కోట్లు దారి మళ్లాయి. 2018-19లో రూ.9,693కోట్లు కేటాయించగా, రూ. 6,509కోట్లు ఖర్చు చేశారు. అంటే రూ.3,184 కోట్లు దారి మళ్లా యి. మొత్తంగా ఎస్సీ సబ్ప్లాన్కు ఈఐదేండ్లలో రూ.56,979 కో ట్లు కేటాయించగా అందులో రూ.14,202 కోట్లు దారిమళ్లించా రు. అలాగే ఎస్టీ సబ్ప్లాన్కు ఈ ఐదేండ్లలో రూ. 33,623 కోట్లు కేటాయించగా రూ.14,202కోట్లు దారిమళ్లించారు.
ఈ దారిమళ్లించిన నిధులను యథేచ్చగా మూసినది ఆధునీ కరణకు, ఇరిగేషన్, ట్రాన్స్పోర్టు తదితర రంగాలకు ఖర్చు చేశా రు. వాస్తవంగా ఒక ఏడాది ఖర్చు కాకుండా మిగిలిపోయిన ఎ స్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను క్యారీ ఫార్వర్డింగ్ పద్ధతిన మరుసటి సంవత్సరానికి కేటాయించే బడ్జెట్ నిధులతో కలిపి చూపించాలి. కానీ ఈ ప్రభుత్వం అలా చేయకుండా ఆ నిధులను ఇతర అవస రాలకు వాడుకుంటుంది. నిజంగా కేసీఆర్ చెప్పినట్టు నిధులు దారిమళ్లకుండా ఉండి ఉంటే అందుకు సంబంధించిన ఈ నిధు ల ఖర్చుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని దళిత సంఘాలు, అభ్యుదయవాదులు, మేధావులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు.
దళితులపై అడుగడుగునా వివక్ష
రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం అడుగ డుగునా వివక్ష చూపిస్తుందనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శ నం. దీంతోపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ కాలం చేపట్ట డానికి ముందు దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చ లే దు. డబ్బా ఇండ్లు కట్టం. దళితులకు డబుల్బెడ్రూం ఇండ్లు కట్టి స్తామన్నారు. అది నేటికీ అమలు కాలే దు. భూమి లేని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది దళితులు భూ పంపిణీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ దీని ఊసే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా అధికారికంగా ప్రభుత్వం అమలు చేసి తీరుతామని చెప్పిన హామీలకే గతి లేదు. ఈ రాష్ట్రంలో ఇక దళితుల సంక్షేమం, వారికి భద్రత గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా ఉంటాయో ఆశించడం పెద్ద కష్టమేమీ కాదు. రా ష్ట్రంలో అనేక చోట్ల దళితులపై ఆధిపత్య కులాలు విచక్షణా రహి తంగా దాడులు చేస్తున్నా వాటిని అరికట్టడంలో గానీ, నిందితు లకు కఠిన శిక్షలు విధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కా కుండా తీసుకునే చర్యల గురించి ఆశించడం ఓ కల. మరోపక్క రాష్ట్రంలో మహిళల పరిస్థితి, కులాంతర వివాహాలు చేసుకున్న వారి పరిస్థితి అతి భయంకరంగా ఉంది. మహిళలకు రక్షణ లేకుడా పోయింది. కులాంతర వివాహాలు చేసుకున్న వారు కలకాలం కలిసి జీవిస్తారన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఇలా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం అణగారిన తరగతుల పట్ల వివక్ష ప్రద ర్శిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కండ్లు తెరిచి సామాజిక న్యాయం పాటించి వెనుకబడిన వర్గాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకునే వరకు అణగారిన వర్గాలు చైతన్యంతో ఐక్యంగా ప్రభు త్వ తీరుకు వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
- ఓగోటి కిరణ్ కుమార్
సెల్ : 9666011107