Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్నించే గొంతుక ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ధర్మం దారి తప్పకుండా, న్యాయం నాలుగు పాదాల నడవాలంటే పాలకులు చేసే తప్పులను ఎత్తిచూపే బలమైన ప్రతిపక్షం ఉండాల్సిందే... కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతులు మూగబోయినయి. అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. రక్షించండీ మహాప్రభో అంటూ అధికార పక్షానికీ వంత పాడుతున్నాయి. ఈనెల 16 నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల దృశ్యాలు ప్రజాస్వామ్యవాదులను కలిచి వేస్తున్నాయి. సొంత డబ్బా పర డబ్బా తప్ప పద్దులపై నిర్మాణాత్మకమైన చర్చలు శూన్యం. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై పెద్దగా ప్రస్తావించిన దాఖలాలు కనిపించడం లేదు. బడ్జెట్ పద్దులను ఆమోదించేందుకు అధికార పక్షం శాసనసభ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నట్టుందే తప్ప ప్రజాసమస్యలకు దిశా.. దశను సూచించే సభల్లా లేవు. గెలిచిన సగానికిపైగా సభ్యులను గంపగుత్తన ఎత్తుకెల్లడంతో ఉన్న కాస్త ప్రతిపక్ష హౌదా కోల్పోయిన కాంగెస్కు భయం పట్టుకుందో ఏమోగాని సభలో బలమైన వాణి వినిపించడం లేదు. గత వారం రోజులుగా ఏకపక్షంగా సాగుతున్న శాసనసభ సమావేశాల్లో వామపక్షాలు లేని లోటు కనిపిస్తున్నది.
-ఊరగొండ మల్లేషం