Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లమల అడవులను ఎట్టిపరిస్థితుల్లో నాశనం కానీయబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆహ్వానించదగినదే. కానీ అదే సమయంలో వివిధ రూపాల్లో కొనసాగు తున్న ఆందోళనలను ఇంకా కొనసాగించాల్సి ఉన్నదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవస రముంది. నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీర్మానం చేసినందున ఆందోళనలు అవసరం లేదని కొంతమంది ఉమ్మడి పాలమూరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రకటనలిస్తున్నారు. మూకుమ్మడిగా సేవ్ నల్లమలకు పెరుగుతున్న మద్దతు, ఈ క్రమంలో ఉద్యమకారుల ఐక్యత ప్రభుత్వాన్ని డేంజర్ జోన్లోకి నెట్టేసే అవకాశముందని భావించి కేసీఆర్ ఈ ప్రకటన చేసినట్టు కనబడుతున్నది. తాజాగా అసెంబ్లీలో యురేనియం తవ్వకాలు చేపడితే కేంద్రంతో కొట్లాడుతామని వ్యాఖ్యానించిన కేసీఆర్ ఆ మాట మీద ఆచరణలో నిలబడాలి. కేంద్రం మీద వత్తిడి తేవాలి. నల్లమల ప్రాంత ప్రజలు, సేవ్ నల్లమల ఉద్యమకారులు కేసీఆర్ తాజా ప్రకటనతో సంబరపడిపోకుండా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది.
ఈ ఊరు మాదిరో, ఈ వాడ మాదిరో, ఈ నేల మాదిరో అని తెలంగాణ లో దొరల ఆధిపత్యాన్ని నిరసిస్తూ పాడిన ఈ పాట మళ్లీ గుర్తొచ్చింది. యురే నియం తవ్వకాల నేపథ్యంలో నల్లమల ప్రాంత వాసులు మళ్లీ మోడీ పాలన తీరును నిరసిస్తూ పాడుకుంటున్న పాట ఈ నేల మాది అని. తన కాలి కింద నేలను కూడా ప్రభుత్వాలు లాగేసుకొని నయా అభివృద్ధి నమూనాను తెరపై కి తీసుకొస్తున్నాయి. ప్రజల నివాసిత ప్రాంతాలను అక్రమంగా లాగేసుకోవ డం ఏ అభివృద్ధికి సూచికో పాలకపక్షాలు సమాధానం చెప్పాలి. అక్కడి నేల కు, చెట్టుకు, మనిషికి, జంతువుకు ఉన్న బొడ్డు, పేగు బంధాన్ని తెంపేందు కు ప్రభుత్వాలు సమయం కోసం వేచి చూస్తున్నాయి. ఆ నేలపొరల్లో యురేనియం ఉన్నదని, ఆ ప్రాంత నేలను పొక్కిలి చేసేందుకు రహస్యంగా సర్వేలు చేస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే కేవలం అక్కడి ప్రాంత ప్రజలకే నష్టమని చాలామంది భ్రమల్లో ఉన్నారు. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు కొన్ని వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా ప్రకృతి అంతా కలుషితమై మనుషులు, జంతువులు ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణిస్తారు. అంతేకాదు పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి స్త్రీలలో అండం విడుదల దెబ్బతింటుంది. యురేనియం ప్రాజెక్టు వలన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో జార్ఖండ్లోని జాదుగూడ చరిత్ర మరిచిపోలేని సాక్ష్యాలను లిఖించింది. దాదాపు 35,000 మంది కలుషిత జలాల బారిన పడడం వలన అక్కడ పిల్లలు కలగకపోవడం, పుట్టినా వక్రంగా పుట్టడమే గాక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. యురేనియం తవ్వకాల అనర్ధాలను గ్రహించి 2011 ఫుకుషిమా ప్రమాదం తర్వాత జపాన్ తన న్యూక్లియర్ ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించుకుంది. జర్మనీ తన పదిహేడు ప్లాంట్లలో ఎనిమిదింటిని ఇప్పటికే మూసి వేసింది. మిగతావి 2022 చివరికల్లా మూసివేయాలని నిర్ణయించుకుంది. ఇటలీ తన ఏకైక ప్లాంట్ను మూసివేసింది. ఆస్ట్రి యా, బెల్జియం, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, స్వీడన్, స్విట్జర్లాండ్లూ అదే బాటలో పయనిస్తున్నాయి.
అడవిని కాపాడుకోవడమంటే కనుమరుగవుతున్న చరిత్రను, మానవీయతను, సమస్త మానవాళిని కాపాడుకోవడమే. అలాంటి అడవిని వేల సంవత్సరాలుగా కాపాడుతున్న ఆదివాసీల జీవితాలు బజారుపాలు కాకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత. మనం బతకడానికి స్వచ్ఛమైన గాలిని కానుకగా ఇస్తున్న వాళ్లను బతకనిస్తే వారు మనకు బతుకునిస్తారనే నిజాన్ని గుర్తెరిగి పాలకుల కుట్ర రాజకీయాలను అంతమొదించేవరకు నల్లమల రక్షణ కోసం కొట్లాడదాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత యురేనియం తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. కానీ మండలిలో కేటీఆర్ మాట్లాడుతూ.. 2016లో రాష్ట్ర వన్యప్రాణి విభాగం చైర్మన్గా ఉన్న సీఎం కేసీఆర్ యురేనియం తవ్వకాలకు ఐదు షరతులతో కూడిన అనుమతులిచ్చారని స్పష్టం చేశారు. ఇలా తండ్రి, కొడుకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాము సేఫ్జోన్లో ఉండటం కోసం సమస్యను పక్కదారి పట్టించి నల్లమల ప్రాంత ప్రజలను బలిపీఠం ఎక్కించేందుకు కేంద్ర పాలకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2019 మే 22న కేంద్ర అటవీ సలహా మండలి సమావేశం జరిపి అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఉడిమిళ్ల కేంద్రంగా 83 చదరపు కిలోమీటర్లలో 4000 భారీ బోర్లు తవ్వి 20 వేల టన్నుల యురేనియం నిక్షేపాలు వెలికి తీయాలని అంచనా వేశారు. అనంతరం యురేనియంపై గ్రీన్ సిగల్ ఇస్తూ సెంట్రల్ ఎన్విరాన్మెంట్ మినిస్టరీ నుంచి 19 జూన్ నాడు ఢిల్లీలో సర్క్యులర్ విడుదలైంది. కేంద్రం అనుమతులు ఇస్తున్నప్పుడు నోరు మెదపకుండా కాలయాపన చేసిన కేసీఆర్ అకస్మాత్తుగా తన స్వరాన్ని మార్చడం వెనక ఉన్న మతలబేంటో చెప్పాలి! యురేనియం తవ్వకాలపై కేంద్రాన్ని నిలదీసి, తవ్వకాలను ఆపేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక యురేనియం తవ్వకాల విషయంలో కేంద్ర వైఖరితో బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. ప్రజల పక్షం వహించకుండా పార్టీ లైన్ను అనుసరిస్తూ కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లమలవాసుల ఆకాంక్షలను పట్టించుకోకపోవడం నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్యం. ప్రజలంతా మమేకపోతారేమోననే ఆందోళనలో ఉన్నపుడు కనీసం ''యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తాం, మీకు అండగా నిలబడతాం'' అని ఒక్క మాటైనా మాట్లాడనేలేదు. ఓట్లేసి, మా సమస్యలను పరిష్కరించమని చట్టసభలకు పంపితే వారి ఆవేదనను పట్టించుకోకుండా తమ సీటును కాపాడుకోవడం కోసం గొంతెత్తకపోవడం నియోజకవర్గ ప్రజలను అవమానించడమే అవుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వాల కదలికల పట్ల ఏమాత్రం ఏమరపాటు వహించినా నల్లమల ఎద ఛిద్రం కావడం ఖాయం. నల్లమలను కాపాడుకోవడానికి మనమంతా ఐక్యమవ్వాలి. విశాల ప్రజా ఉద్యమం నిర్మించాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా యురేనియం విషయంలో ముందుకే పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షం నిలబడి కేంద్రం ప్రయత్నాలను అడ్డుకోవడంలో తమ నిజాయితీని నిరూపించుకోవాలి. ఏమైనా ప్రజా ఉద్యమమే అంతిమంగా యురేనియం ప్రమాదం నుంచి ప్రజలకు రక్ష.
సెల్: 9502403430