Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల వైకుంఠపురం సినిమాలోని రామూలో.. రాములా... అనే పాటతో అక్కడి ఆటో హోరెత్తిపోతున్నది. ఆ పాటను హమ్ చేస్తూ రయ్యున పాసింజెర్ల దగ్గరికి బండిని తీసుకొచ్చాడు ఆటోవాలా. ఆ... ఎక్కడికెళ్లాలండీ... అంటూ ఆ ఇద్దరు ప్రయాణీకులను అడిగాడు. వాళ్లు అక్కడికి సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలోని ఒక ఊరి పేరు చెప్పారు. 'అయితే చెరో నూట యాభై చొప్పున.. ఇద్దరికి మూడొందలు...' ఇవ్వండంటూ అతడు చెప్పిన రేటు విని నోరెళ్లబెట్టారు సదరు పాసింజెర్లు. వారిలో ఒకరు కలుగజేసుకుని... 'ఏమయ్యా.. మాకేమీ తెలియదనుకుంటున్నావా..? ఏంటి...? హైదరాబాద్ నుంచి రూ.250తో ఇక్కడి దాకా సూపర్ లగ్జరీ బస్సులో వచ్చాం. అలాంటిది కేవలం ఆరు కిలోమీటర్ల దూరానికి నూట యాభై ఇవ్వాల్నా..?' అని గద్దించి అడిగాడు. దానికి మన ఆటో జానీ తాపీగా... 'అయ్యన్నీ కాదండీ... ఈరోజు సంక్రాంతి, మీరెళ్లే ఊరికి ఒక్క బస్సూ ఉండదు. మీకిష్టమైతే ఎక్కండి.. లేకపోతే లేదు...' అంటూ సమాధానమిచ్చాడు. అదేంటీ మా ఊరుకు గతంలో రోజుకు ఆరేడు ట్రిప్పులు బస్సు తిరిగేది కదా...? అని సదరు ప్రయాణీకులు అడగ్గా... 'మీకోటి తెల్సా.. మీ ఊరికే కాదు.. ఈ హుజూర్నగర్ (సూర్యాపేట జిల్లా) చుట్టుపక్కల దాదాపు పదూళ్లకు బస్సులు తీసేశారు. మీకు మా ఆటోలే గతి...టైం వేస్టు చేసుకోకుండా ఆటో ఎక్కండి...' అన్నాడు ఆటోవాలా విసురుగా. దాంతో వారు కిమ్మనకుండా బండెక్కి కూర్చున్నారు. ఆటో కదులుతుండగా ఎందుకో తెలియదుగానీ 'ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం..సుఖప్రదం...' అనే పదాలు అదే పనిగా గుర్తుకొచ్చాయి వారికి. ఆటోవాలా మాత్రం యధాలాపంగా... 'రాములో.. రాములా...' అనే పాటను హమ్ చేస్తూనే ఉన్నాడు...
-బి.వి.యన్.పద్మరాజు