Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. 2012 డిసెంబర్ 16వ తేదీన జరిగిన నిర్భయ లైంగికదాడి కేసులో పవన్ గుప్తా, ముఖేష్, వినయ్ శర్మ అనే ముగ్గురు దోషులకు ఉరి శిక్షను ఖరారు చేసది. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులకు గాను, ఒకడు బాలనేరస్తుడు. మూడేండ్ల శిక్ష అనంతరం కోర్టు అతణ్ణి విడుదల చేసింది. 2013లో మరో దోషి రామ్సింగ్ జైలులోనే ఉరి బిగించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
భారతదేశంలో మొట్ట మొదటి ఉరి నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేలది. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన దుర్మార్గానికి 1949 నవంబర్ 15న ఈ ఇరువురికి ఉరిశిక్ష అమలైంది. దాని తరువాత 1991 నుండి 2015 వరకు 26 ఉరి శిక్షలు అమలయ్యాయి. 1976, 1997 సంవత్సరాల్లో పూనేలో ఏడుగురు వ్యక్తుల దారుణ హత్య, దోపిడీకి పాల్పడిన అభయంకర్ అనే నిందితుడిని 1983 నవంబర్ 27న ఎరవాడ జైల్లో ఉరి తీశారు.
1988 ప్రాంతంలో తమిళనాడులో తొమ్మిది మంది బాలికలు అదృశ్యమైన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆటో శంకర్ అనే కిరాతకుడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. తరువాత వీరిలో కొందరి మృతదేహాలు ఒక నదిలో లభ్యమయ్యాయి. ఈ దారుణానికి శంకరే బాధ్యుడని తేలడంతో 1995 ఏప్రిల్ 27న ఇతనికి సేలం సెంట్రల్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో గీతా, సంజయ్ చోప్రా అనే చిన్నారులను కిడ్నాప్ చేసి, హత్య చేసిన రంగా ఖుష్, అలియాస్ కుల్జీత్ సింగ్, బిల్లా, అలియాస్ జస్బీర్ సింగ్లకు 1982లో మరణ శిక్ష విధించారు. 1990 మార్చి 5న కలకత్తా నగరంలోని భవానీపూర్లో 14 ఏండ్ల చిన్నారిపై ధనుంజయ ఛటర్జీ అనే వ్యక్తి లైంగికదాడి జరిపి హత్య చేశాడు. ఈ దుర్మార్గుణ్ణి 2004 ఆగస్టు 14న కలకత్తా జైల్లో ఉరి తీశారు.
2008 నవంబర్ 26న అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది తన సహచరులతో కలిసి పేలుళ్లకు పాల్పడ్డాడు. ఇందులో 166 మంది మరణించారు. 2011 ఫిబ్రవరి 21న కసబ్కు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. 2012 నవంబర్ 21న కసబ్ను పూనేలోని ఎరవాడ జైల్లో ఉరి తీశారు. 2001 డిసెంబరు 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో అఫ్జల్ గురు సహా, మరో ఐదుగురు దాడి చేశారు. దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బందితోపాటు మొత్తం తొమ్మిది మంది మరణించారు. సెక్యూరిటీ దళాల కాల్పుల్లో ఐదుగురు దుండగులు చనిపోయారు. ఈ కేసులో అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9న తీహార్ జైల్లో ఉరి తీశారు. ఇక చివరిగా, ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ను 2015 జూలై 30న ఉరితీశారు. ఉరి శిక్షల విషయంలో నాటినుంచి నేటి వరకూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన దిశ నిందితుల విషయంలోనూ ఈ తరహా వ్యాఖ్యానాలను మనం గమనించాం. దేశంలోని అత్యధిక శాతం మంది తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. గల్లీ మొదలు ఢిల్లీ పార్లమెంటు వేదికల వరకూ ఇదే డిమాండ్ మారుమోగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు దిశ లైంగికదాడి దోషులను( ఆత్మ రక్షణ కోసమని ) వెనకా ముందూ ఆలోచించకుండా కాల్చిపడేశారు.
దేశ స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, బ్రిటిష్ కాలం నాటి చట్టాల ప్రకారం మరణశిక్ష విధింపు రాజ్యాంగ ఔచిత్యాన్ని పరిశీలించాల్సిన పరిస్థితుల్ని న్యాయవ్యవస్థ ముందుకు తెచ్చాయి. మానవుల సంక్షేమం కోసం, వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పడిన సాంఘిక వ్యవస్థలో మానవుడి జీవించే హక్కును హరించే అధికారం ఎవరికీ లేదని మానవతావాదులు, మానవ హక్కుల ఉద్యమకారులు అంటున్నారు. ఇంతగా అభివృద్ధి సాధించిన తరువాత కూడా ఇంకా మరణశిక్షలను కొనసాగిస్తే అది మళ్లీ మధ్య యుగాల్లో పాలకులు మానవుడి జీవించే హక్కును ఎలా హరించారో, ఆధునిక రాజ్యం కూడా అలానే వ్యవహరించినట్టు అవుతుందన్నది వారి వాదన. నిజానికి సమాజంలో ఏదైనా నేరం జరిగితే ఆ నేరం చేసిన వ్యక్తి మాత్రమే దానికి బాధ్యుడు కాదు. ఆ వ్యక్తిని ఆ స్థాయికి పురికొల్పిన కాలమాన పరిస్థితులతోపాటు, పాలకులు తమ ఆదాయం కోసం ఎంచుకున్న మద్యం, ఇతరత్రా అనేక సాధనాల పాత్ర కూడా ఉంటుంది. కనుక ఒక నేరానికి శిక్ష పేరుతో అదేవిధమైన నేరాన్ని చట్టబద్దంగా, అధికారంగా జరిపించడం వల్ల ఏ విధమైన ప్రయోజనమూ ఉండదు. దీనికంటే ముందు చెడుకు, దుర్మార్గాలకు పురిగొలిపే, ప్రేరేపించే సమస్త దారులనూ మూసివేయాల్సిఉంది. భారత్ లాంటి వర్దమాన దేశాల్లో నేర, న్యాయవ్యవస్థ, పోలీసు విచారణ వ్యవస్థల సామర్థ్యం, ప్రభావశీలత ఆశించినస్థాయిలో లేదు. అనేక సందర్భాల్లో ఈ విషయం తేటతెల్లమైంది. దీనికి చాలా ఉదాహరణలున్నాయి. పైగా న్యాయం అనేది సామాన్యులు అందుకోలేని, ఎంతో ఖరీదైన, అధిక సమయాభావంతో కూడుకున్న విషయం కాబట్టి భారత్లో మరణశిక్ష విధింపు వల్ల పేద, బడుగు, బలహీన వర్గాలవారే ప్రతికూల ప్రభావానికి గురవుతున్నారు. తాజాగా దిశ నిందితుల విషయంలో ఈ రకమైన వ్యాఖ్యానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. మానవ సంక్షేమం, సుఖమయ జీవనం, రక్షణ, శాంతి తదితరాలను సాధ్యమైనంతమేర పటిష్ఠం చేసుకోవడానికి ఏర్పర్చుకున్న అత్యున్నత సాంఘిక వ్యవస్థ మన సమాజం. దీనికి నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం మానవుడు. ఈ సమాజంలో ప్రజలందరూ తమ ఇష్ట ప్రకారం, సమష్టి ఏకాభిప్రాయంతో రూపొందించిన చట్టం ద్వారా అతని మానవీయ ఉనికిని, సామాజిక ఉనికిని అంతం చేయడాన్ని మరణశిక్షగా చెప్పుకోవచ్చు. సామాజిక జీవితంలో శాంతికి విఘాతం కలిగిస్తూ, సమాజం గర్హించే పనులు చేసేవారిని శిక్షించినప్పుడు శాంతిభద్రతలు పరిరక్షించబడతాయని, ప్రజాసంక్షేమం సుస్థాపితం అవుతుందని భావించబడినప్పుడు అలాంటి శిక్షలకు అవకాశం ఉంటుంది. అయితే ఆ శిక్షలు ఎలా ఉండాలి. వాటి అంతిమ ఉద్దేశం ఏమిటి? అనే విషయంలో వివిధ మతధర్మాలు, వివిధ సిద్ధాంతాలు వివిధ దృక్పధాలను ప్రతిపాదించాయి. అవి ఏం చెప్పినప్పటికీ, విలువలకు, ఉదార ప్రజాస్వామ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేటి ఆధునిక ప్రపంచ దృక్కోణం నుంచి చూస్తే, బాగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు, వర్ధమాన దేశాలూ, వెనుకబడిన దేశాలూ అన్ని చోట్లా ఉరి శిక్షల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
- యండి.ఉస్మాన్ఖాన్
సెల్ : 9912580645