Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలుగా పేర్కొంటున్న తరుణంలో వారి నిర్ణయాన్ని ఓటు హక్కు అనే ఆయుధం ద్వారా తెలియజేస్తున్నారు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు కుల, జాతి, మత, లింగ, భాష వంటి భేదం లేకుండా ''ఒక ఓటు ఒక విలువ'' ద్వారా ప్రజానిధులను ఎన్నుకునే అవకాశం కల్పించి సమానత్వ సూత్రాన్ని ఆపాదించిన గొప్ప ఘనత ప్రజాస్వామ్యానిదే. ఎన్నికల్లో పోటీచేసి అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటు అనే ఆయుధంతో నిర్ణయించే అవకాశం ప్రజాస్వామ్యంలో ప్రజలకు కల్పించబడింది. దేశంలో ఓటు హక్కు అనేది వ్యక్తి అస్తిత్వాన్ని నిలబెడుతూ, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. నేడు భారతదేశంలో ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అందులో యువ ఓటర్ల సంఖ్య కూడా పెరగడం సంతోషించదగ్గ విషయం. కానీ పార్లమెంట్ ఎన్నికల నుండి నేటి పురపాలక ఎన్నికల వరకు బరిలో నిలబడిన అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు, మద్యంతో ఓటర్లకు గాలం వేసే సంస్కృతి విజృంభించడం విచారించదగ్గ విషయం.
కాల క్రమంలో ఎన్నికలలో జరుగుతున్న మార్పులను పరిశీలిస్తే అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతి వైపు వెళ్తున్నారు. ఓటర్లు ఎన్నికలలో ప్రలోభాలకు గురై అంధకారంలోకి వెళ్తున్నారు. తద్వారా 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కోట్లాది పట్టణ ప్రజలు సరైన పారిశుధ్య వ్యవస్థకు నోచుకోక మురికివాడల్లో దోమలు స్వైరవిహారం మధ్య జీవిస్తూ పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అజ్ఞానం, అనారోగ్యం అనే వెనుకబాటుతనానికి చిరునామాగా మారారు. వీటిని మార్చడంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు తాత్కాలిక పరిష్కారం వైపు వెళ్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపడంలో వైఫల్యం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలలో నీతి నిజాయితీలతో ఓటు వేసే సంస్కృతికి ఓటర్లు దూరంగా ఉంటున్నారు. రాజకీయ నాయకులు కూడా ప్రలోభ సంస్కృతితో ఓటు వేయించుకోవడంలో ముందు వరుసలో ఉంటున్నారు. తద్వారా నేటి ఎన్నికల క్రీడా యుద్ధంలో గెలుపొందిన అభ్యర్థులు పాత్రకే విలువను ఆపాదిస్తూ, ఓటర్ల పాత్ర శూన్యంగా మారుతోంది.
నేటి పురపాలక ఎన్నికల ముఖచిత్రాన్ని పరిశీలిస్తే కూడా ప్రలోభ రాజకీయాలు మితిమీరిపోతూ ప్రశాంత పట్టణ వాతావరణం రోజురోజుకు దెబ్బతింటోంది. ముఖ్యంగా ఓటర్లు అనేక రకాలుగా ప్రలోభాలకు లోనై తమ ఓటు హక్కును మద్యానికి, మాంసానికి, డబ్బుకి అమ్ముకోవడానికి సిద్ధమై సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడంలో విఫలమవుతున్నారు. ఓటర్లు తాత్కాలికంగా రాజకీయ కూలిగా మారి పార్టీల జెండాలను, అజెండాలు మోసే బానిసలుగా మారుతున్నారు. మొత్తంగా ఎన్నికల క్రీడలో ఓటర్లు, రాజకీయ పార్టీల అభ్యర్థులు మునుపెన్నడూ లేని స్థాయిలో దిగజారుతూ నోటుతో ఓటు పొందడం పార్టీల ఆచారంగా, ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల ఆచారంగా మారుతోంది. తద్వారా ఓటు ఒక సరుకుగా, ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్గా మారిపోయింది. రాజకీయ పార్టీలలో, నాయకుల్లో, ఓటర్లలో చైతన్యం రావలసిన అవసరం ఉంది. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి బాధ్యతపైన, ఓటర్ల ఓటు హక్కు ప్రాముఖ్యతపైన భారతీయ ఎన్నికల కమిషన్, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు విస్తృతంగా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. అప్పుడే ఓటర్లు తమ ఓటు అనే వజ్రాయుధాన్ని నిజాయితీగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, వినియోగించుకొని సమర్థవంతమైన ప్రజా సేవకున్ని ఎన్నుకునే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా పురుడు పోసుకున్న ''పట్టణ స్వయం పరిపాలన''కు సార్థకత చేకూరి పట్టణాభివృద్ధికి బాటలు పడతాయి.
- సంపతి రమేష్ మహారాజ్
సెల్ : 9959556367