Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో అత్యంత నిజాయితీ గల వత్తి నర్సింగ్ వృత్తి అని అనేక సంస్థలు నిర్వహించిన సర్వేలు వెల్లడించాయి.సేవా, దయ, కరుణ, ప్రేమాభిమానాలకు మారు పేరు. సుమారు 200 ఏండ్లుగా ఈ వృత్తికి ఆదరణ ఉంది. సమాజ సేవ పట్ల అంకితభావం కలిగిన వారు, జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునే వారు అనేకులు శిక్షణ పొంది ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడే అవకాశం కూడా ఉంది. కానీ, రెండు దశాబ్ధాలుగా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పదేండ్లు గడిచినా ఒక్క ఉద్యోగ ప్రకటన రావట్లేదు. ఉద్యోగ ప్రకటనలు వచ్చినా, కోర్టు వివాదాల్లో పరిష్కారం కాకుండా నలిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగుల శాతం కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
దేశంలో దాదాపు 20 లక్షల మంది నర్సులు పనిచేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా మరో 20 లక్షల మంది నర్సులు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. తెలంగాణ రాష్ట్రంలో 80 వేల నుంచి లక్ష వరకూ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలోనే 10 వేల నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా మరో 5 వేల పోస్టులు అవసరం. ప్రభుత్వాలు, వైద్యారోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. వైద్య విధాన పరిషత్ 3341 పోస్టులకు నోటిఫికేషన్ వేసినా.. కోర్టు వివాదాల కారణంగా ఫలితాలు విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రయివేటు రంగంలో నర్సుల పరిస్థితి దారుణం. నర్సింగ్ వత్తిపై తీవ్రమైన చులకన భావం కలిగేలా యాజమాన్యాలు, కొందరి వైద్యుల ప్రవర్తన ఉంటుంది. చాలీచాలనీ వేతనాలతో శ్రమను దోచుకుంటున్నారు. ఏండ్ల తరబడి బాండ్లు రాయించుకుంటున్నారు. బాండ్లు రాసిన నర్సులు బానిసలకంటే హీనంగా వెట్టిచాకిరి చేస్తున్నారు. దాదాపు 75 శాతం ప్రయివేటు ఆసుపత్రుల్లో రోజుకి 8 గంటలకు బదులుగా 10-12 గంటలు పని చేస్తున్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులకు కనీస వేతనం రూ.20వేలు ఉండాలని 2016లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 200 పడకల ప్రయివేటు ఆసుపత్రులలో పనిచేసే నర్సులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులకు మాదిరిగానే వేతనాలు ఉండాలని చెప్పాయి. ఈ తీర్పుకు అనుగుణంగా కేరళ, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తున్నాయి. తమిళనాడులో కనీస వేతనం రూ.17వేలుగా ఉంది. ఢిల్లీ, మహరాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని అమలు చేయాలని నోటిఫికేషన్లు జారీ చేశాయి.
ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిల్యాండ్, ఉత్తర కొరియా వంటి పాశ్చాత్య దేశాలలో ప్రస్తుతం ఆన్కాల్ పద్ధతి అమలులో ఉంది. ఈ విధానం మన రాష్ట్రంలోనూ విస్తరిస్తోంది. ఈ పద్ధతివల్ల ప్రయివేటు ఆసుపత్రుల్లో నర్సులు ఉద్యోగ భద్రతను కోల్పోతున్నారు. రోజు వారీ కూలీలుగా, షిఫ్ట్ల వారీగా పనిచేసే దౌర్భాగ్య పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రయివేటు రంగంలో పనిచేసే నర్సులకు ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగాలైన ఐసీయూ వంటి వార్డులో రోగి ఉన్నప్పుడు మాత్రమే కాల్ చేసి నర్సింగ్ సిబ్బందిని డ్యూటీకి పిలుస్తారు. పని గంటలు కూడా ఎక్కువే. సమాజంలో నర్సులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2020 ఏడాదిని ప్రపంచ ఆరోగ్య సంస్థ నర్సుల సంవత్సరంగా ప్రకటించింది. ఆరోగ్య సేవలు అందిస్తున్న నర్సుల సేవలను ఉపయోగించుకుంటూ, ఆరోగ్య సమాజానికి బాటలు వేయాలని డబ్ల్యూహెచ్వో యోచిస్తోంది. ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్, ప్రతి 400 మందికి ఒక నర్సు ఉండాలని డబ్ల్యూహెచ్వో నిబంధనలు చెబుతున్నాయి. దేశంలో ప్రతి 1,200 మందికి ఒక డాక్టర్, ప్రతి 600 మందికి ఒక నర్సు సేవలు అందిస్తున్నారు.
ప్రపంచ దేశాలకు నాణ్యమైన నర్సింగ్ సిబ్బందిని అంది స్తున్న ఐదు దేశాలలో మన దేశం ఒకటి. అయినా, మనదేశంలో నర్సుల కొరత తీవ్రంగానే ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీసవేతన చట్టాన్ని అమలు చేయాలని వివిధ నర్సింగ్ సం ఘాలు ఆందోళనలు చేసినా, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నర్సుల శ్రమను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న ప్రయివేటు యాజమాన్యాలు కోట్లాది రూపాయలు గడిస్తూ కుబేరులవు తున్నారు. నర్సులు మాత్రం ఆర్ధిక, మానసిక సంక్షోభంలో కుంగి పోతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నర్సింగ్ వత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే నర్సింగ్ విద్యను అభ్యసించిన అనేకమంది వృత్తిని వదిలిపోతున్నారు. ప్రభుత్వాలు ఇకనైనా కండ్లు తెరచి నర్సింగ్ వత్తిని పరిరక్షించాలి.
- ధనుంజయ్ కాంపాటి
సెల్ : 99127 65242