Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది 1990వ దశకం.. మధిరలో జరుగుతున్న భారత కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తున్నారు. ''రాజకీయ పార్టీల నేతల దగ్గరకు ప్రజలు ఇక రాకపోవచ్చు. అందుకని ప్రజల వద్దకే రాజకీయ పార్టీల నేతలు వెళ్లాలి. లేదంటే ప్రజలకు దూరమవుతారు. నేతలకు ఆత్మీయ నమస్కారాలు కరువవుతాయి. ఎందుకంటే రాజకీయాలు వ్యాపారాలతో ముడి పడుతున్నాయి. ఓటర్లను, నేతలను టోకున కొనేవారు రాజకీయాల్లోకి రావచ్చు. నిబద్ధతకంటే నిధులకే ప్రాధాన్యత రాబోతుంది. రేపటి పోరాటాలకు నేతల చేష్టలే ఎజెండాలు కావచ్చు'' అంటూ ఆ ప్రసంగం ముగిసింది. నేటి రాజకీయ పరిణామాలను మూడుదశాబ్దాల క్రితమే అంచనా వేసి చెప్పిన ఉపన్యాసమది. ఇంతకూ ఆ ఉపన్యాసకుడు ఎవరనే కదా మీ ఆసక్తి..? అతడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు, భారత కమ్యూనిస్టుపార్టీ రాష్ట్రకార్యదర్శిగా, జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటు సభ్యుడిగా సుధీర్ఘ కాలం బాధ్యతలు నిర్వర్తించిన నిరాడంబరుడు, నిస్వార్థ ప్రజా నాయకుడు నల్లమల గిరిప్రసాద్.
మధిర మండలం తొండల గోపవరంలో 1931 ఏప్రిల్ 6న జన్మించాడు. మద్రాసులో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఆంధ్ర మహాసభ సాగిస్తున్న కార్యకలాపాల పట్ల ఆకర్షితులయ్యాడు. 1947లో స్వగ్రామానికి వచ్చిన గిరిప్రసాద్ చదువుకు స్వస్తి చెప్పి ఆంధ్ర మహాసభలో చేరాడు. కృష్ణా జిల్లాలోని తునికిపాడులో జరుగుతున్న రాజకీయ పాఠశాలకు తొలిసారి హాజరైన గిరి ప్రసాద్ అప్పటి నుండి పూర్తికాలం ప్రజల కోసం పని చేయడం ప్రారభించాడు. ఆయనకు కమలా దేవితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఆంధ్రమహాసభ నుండి కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి అంకితమై పనిచేస్తున్న గిరిప్రసాద్ను.. నిజాం రక్కసి మూకలు సాగిస్తున్న అకృత్యాలు, అరాచకాలను ప్రతిఘటిస్తూ పార్టీ ఇచ్చిన సాయుధ పోరాట పిలుపు సాయుధుడ్ని చేసింది. పాల్వంచ ప్రాంతంలో సాయుధ దళాలకు నాయకత్వం వహించిన గిరి దళం అంటే ఆ రోజుల్లో నైజాం సైనికులకు వెన్నులో వణుకు.. గిరి ప్రసాద్ పేరులోని గిరి గురించి రెండు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గిరి ప్రసాద్ అసలు పేరు నల్లమల ప్రసాద్ కాగా, సాయుధ పోరాటం అనంతరం ఆయన పేరుకు ముందు గిరి చేరింది. గిరిజన ప్రాంతంలో పోరాటాన్ని నిర్మించినందున.. గిరిజనాన్ని గుండెల్లో పెట్టుకుని వారిని వీరులుగా తీర్చిదిద్దినందున.. గిరిజనంతో ఆయనకు అపురూపమైన ఆత్మీయ బంధమున్నందున.. ఆ గిరిజనంలోని 'గిరి' వచ్చి ఆయన పేరు ముందు చేరిందని కొందరు, మరో కమ్యూనిస్టు యోధుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకుడు కామ్రేడ్ శేష గిరిరావును నైజాం మూకలు హతమార్చినప్పుడు.. ఆ శేషగిరి స్ఫూర్తినందుకుని నిజాం సేనలను గడగడలాడించి 'గిరి' దళాలాలుగా ప్రసిద్ధిగాంచిన సాయుధ సేనలకు నేతృత్వం వహించినందున నల్లమల ప్రసాద్ కాస్తా నల్లమల గిరిప్రసాద్గా వాసికెక్కాడని మరికొందరు కథలు కథలుగా చెప్పుకుంటారు.
సాయుధ పోరాట కాలంలో నైజాం రక్కసి మూకల నుండి గ్రామాలకు గ్రామాలనే విముక్తి చేసుకుంటూ గిరి దళాల ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. గిరిప్రసాద్ సేన ధాటికి తట్టుకోలేని నైజాం రక్కసి మూకలు గిరిప్రసాద్ను హత మార్చడమే ధ్యేయంగా కాపు కాసాయి. తమ వేగుల ద్వారా సమాచారమందుకున్న నిజాం పోలీసు మూకలు ఓ రాత్రి మెరుపుదాడికి దిగాయి. ఊహించని దాడి కలవరపరిచినా వెంటనే తేరుకుని తన దళాన్ని అప్రమత్తం చేసాడు. తేరుకున్న దళం ఎదురుదాడి ప్రారంభించింది. తన గెరిల్లా యుద్ధతంత్రాలతో దళాన్ని ముందుండి నడిపాడు. ఆ ఎదురుదాడిని తట్టుకోలేని నిజాం పోలీసు చివరికి తోక ముడిచింది. కానీ ఆ రాత్రి జరిగిన హౌరాహౌరి పోరాటానంతరం దళ సభ్యులకు ఆయన కనిపించలేదు. ఆందోళన చెందిన దళం చెట్టు పుట్ట అన్ని గాలించిది. తూరుపు తెలతెలవారుతుండగా.. చాతిలోకి తుపాకీ తూటా దూసుకు పోయి... ఓ పొద మాటున రక్తపు మడుగులో పడి ఉన్న గిరిప్రసాద్ను గుర్తించిన దళ సభ్యులు చికిత్స చేసి రక్షించుకున్నారు. ఆ వీరోచిత ఘట్టానికి గుర్తుగా ఆ తూటా చివరి వరకూ ఆయన శరీరంలోనే ఉండిపోయింది. సాయుధపోరాటంలో ఐదు సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపిన గిరిప్రసాద్, పార్టీ పోరాట విరమణకు పిలుపునివ్వడంతో అజ్ఞాతాన్ని వీడాడు. తర్వాత అప్పటి ప్రభుత్వం ఆయనపై అనేక కేసులు నమోదు చేసి జైలుకు పంపింది. జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత 1953లో భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై 11 సంవత్సరాలపాటు పని చేశారు. 1962లో ఖమ్మం శాససభ్యుడిగా గెలుపొందారు. ఆ సమయంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. నిత్యం ప్రజలతో ఉండేవాడే నిజమైన కమ్యూనిస్టు అనే దానికి గిరి ప్రసాద్ ఒక నిలువెత్తు నిదర్శనం. ఆచరించిదే చెప్పాడు. చెప్పిందే ఆచరించాడు. ఖమ్మం జిల్లాలోనే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆయన విశేష కృషి చేశాడు.
1978లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై 1991వరకు పనిచేశాడు. 1992 నుండి రాజ్యసభ సభ్యులుగా పని చేసిన గిరిప్రసాద్ అప్పటి విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షుడిగానూ సేవలందించాడు. 1992లో జాతీయ సమితి కార్యదర్శిగా, 1996లో జాతీయ ఉపప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1990 దశకంలో స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్గా పనిచేశాడు. పదవుల్ని బాధ్యతగా భావించే గిరిప్రసాద్ ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చాడు. గిరిప్ర సాద్ ఉపన్యాసాలు సాధారణ రాజకీయ నాయకుల ఉపన్యాసాలకు భిన్నంగా ఉండేవి. అంతర్జాతీయ, జాతీయ విధానాలు మొదలు రాష్ట్ర స్థాయి వరకు ఏ విమర్శ చేసినా నిర్మాణాత్మ కంగా ఉండేది. ఒక అంశంపై విమర్శ చేసినప్పుడు అలా ఎందుకు చేయాల్సివచ్చిందో ప్రత్యర్థులకేగాక ప్రజలకూ సవివరంగా తెలియజేయడం ఆయన ప్రత్యేకత. ఎన్.టి. రామారావు పాలనా కాలంలో గిరిప్రసాద్ ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో యావత్ రాష్ట్ర దృష్టిని ఆకర్షించాడు. అంతర్గత సమావేశాల్లో ఆయన ఉపన్యాసం ఎప్పుడూ ఆత్మవిమర్శ వైపు సాగేది. అనేక సమావేశాల్లో ఆయన నాయకత్వాన్ని హెచ్చరిస్తున్న తీరు కమ్యూనిస్టు కార్యకర్తల పట్ల ఆయనకున్న మమకారాన్ని, బాధ్యతను గుర్తు చేసే విధంగా ఉండేది. భవిష్యత్ రాజకీయాల గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. రాజకీయాలు అస్తవ్యస్తమై వ్యాపారగా మారి అవినీతితో కలగాపులగమై రాజ్యమేలుతాయని చెప్పిన గిరిప్రసాద్ అనారోగ్యంతో 1997 మే 24న తుదిశ్వాస విడిచాడు. శాసన సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలోను, సమస్యల పరిష్కారం కోసం అగ్రభాగాన నిలిచేవాడు. తనతోపాటు సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి పింఛన్ ఇప్పించేందుకు అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక సమరయోధుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించాడు. తుదిశ్వాస వదిలే సమయలోనూ ''ఇంకా ఇప్పించవలసిన వారికి పింఛన్ ఇప్పించకుండానే కన్నుమూస్తానేమో'' అనే బాధను ఆయన తరచూ తన సహచరుల వద్ద వెలిబుచ్చేవారు. నిత్యం నిర్బంధాల మధ్య.. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చివరి క్షణం వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన గిరిప్రసాద్ ఓ వెలుగుల దివిటీ. అసమాన త్యాగాలూ సాహసాల మయమైన ఆయన ఆరు దశాబ్దాల ప్రయాణం ఓ ఎర్రని ప్రవాహం. ఊహ తెలిసిన నాటి నుండి ఉద్యమాలే ఊపిరిగా సాగిన ఆయన విరామమెరుగని జీవితం పోరాటాల చిరునామా. ఆశయాల వీలునామా..
- అనంతోజు మోహన్ కృష్ణ
సెల్ : 8897765417