Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ సమాజానికైనా దాని శీగ్ర పురోభివృధ్ధి కోసం విద్య ప్రధాన భూమిక పోషిస్తుంది. ఐరిష్ కవి ఆలివర్ గోల్డ్స్మిత్ రాసిన ద విలేజ్ స్కూల్ మాస్టర్లో చెప్పినట్టుగా ఉపాధ్యాయుడు ఆ గ్రామానికి ఉదయించే సూర్యుడిలాంటివాడు. కానీ ఇప్పుడు రాజ్యం దృష్టి కోణం ఏదైతే, అదే విద్యను ఉపాధ్యాయుడు బోధించే పరిస్థితి దాపురించింది. రాజ్యం ఇప్పుడు మను షులను ప్రాంతాలుగా, మతాలుగా, కులాలుగా, విడదీస్తూ తన అధికారాన్ని సుస్తిరం జేసుకొనే పనిలో ఉంది. రాజ పోషకుల శిబిరాల్లో పెంపుడు చిలుకలైన కవిపుంగవులు, పుష్య మిత్ర సంగుడు, రాజరాజ నరేంద్రుడు లాంటి రాజుల మెప్పుకోసం రాసిన పురాణ కథలను విజ్ఞానం పేరుతో, భావి భారత పౌరులకు బోధించాలని ఉపాధ్యాయులకు కర్తవ్య నిర్దేశం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, ఫెడరేషన్ భావజాలం కలిగిన ఉపాధ్యాయ సంఘాలు కలిసిపోవడం ఒక ఆశాజనకమైన, ఆహ్వానించదగ్గ పరిణామం.
భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో చూస్తే దళిత బహుజనులకు విద్య ఎప్పటినుండి అందిందో చూద్దాం. రాచరిక వ్యవస్థలో శూద్రులకు ఆయుధం, ఆస్తి, విద్య హక్కులు నిషేధం. ఇంగ్లాండ్లో 1870లో ఫ్రీ అండ్ కంపల్సరీ విద్యా చట్టం వచ్చింది. 1882లో వచ్చిన హంటర్ కమిషన్కు జ్యోతిబాఫూలే భారతదేశంలో కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ విద్య కావాలని రిప్రజెంటేషన్ చేశాడు. సంస్థానాధీశుల బిడ్డలకు వారివారి ఇండ్లలోనే ఇవి నేర్పించేవారు. ఇక తెలంగాణలో అయితే 6వ నిజాం హయాం 1869లో ఉర్దు పాఠశాలలతోపాటు కొన్ని తెలుగు పాఠశాలలకు అను మతి ఇచ్చినట్టు తెలుస్తున్నది. 1884 లో నిజాం రాజ్యంలో ఉర్దు అధికార భాష. కనుక తెలుగు భాషకు గౌరవం ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. 1890 నుండి 7వ నిజాం విద్యకు ఎక్కువ నిధు లు కేటాయించి చదువుల పట్ల కొంత శ్రద్ధ పెట్టినా అవి కులీన వర్గాలకు మాత్రమే అందుబా టులోకి వచ్చినట్టు తెలుస్తున్నది. 1907 డిసెంబర్లో కలకత్తా లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో దేశంలో ఫ్రీ అండ్ కంపల్సరీ విద్య కోసం తీర్మానం చేశారు. 1912 నాటికి దేశంలో అక్షరాస్యత 6శాతం అంటే దళిత బహుజనుల స్థానం ఎక్కడో ఊ హించండి. అంటే ఇక్కడి దళిత బహుజనులకు విద్య ఎప్పటినుండి అందిందో చూస్తే దళిత, బహుజన ఉపాధ్యాయులు ఎప్పటినుండి ఈ సమాజానికి అందుబాటులోకి వచ్చారో అర్థం అవుతుంది.
ఎన్నో ఒడుదొడుకులతో 1958 దాకా జిల్లా బోర్డుల ద్వారా నిర్వహించబడిన విద్య 1959 నవంబర్ నుండి పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ల ఆధీనంలోకి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుల నియామకాలు సైతం జిల్లా బోర్డుల నుండి డీఎస్సీ ద్వారా జరిగాయి. స్థానిక సంస్థల్లో నియమించబడినవారికి సెలవు నిబంధనలు, పెన్షన్లు, సర్వీస్ రూల్స్ లాంటివి ఏవి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా లేకుండే. కారణం ఏమంటే ఉపాధ్యాయులు ఒకే గొడుగు కింద ఉంటే వాళ్లు ఐక్యమై ప్రభుత్వాలను ఎక్కడ నిలదీస్తారో ఏమో అన్న అభద్రతా భావం వలన, విద్యను, ప్రభుత్వ, పంచాయతీ రాజ్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కస్తూర్బా, మోడల్ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ అంటూ రకరకాల పేర్లతో విద్యారంగాన్ని ఆకుకు అందక, పోకకు పొందక కుక్కలు చింపిన విస్తరిలా చేశారు. అప్పుడు గాని పాపం వారికి విద్యను పూర్తిగా ప్రైవేట్కు అప్పగించడానికి సరైన సాకులు లభించవన్నమాట. ఇట్లా విద్య వివిధ మేనేజ్మెంటుల్లోకి వెళ్లినప్పుడల్లా ఒక్కొక్క మేనేజ్మెంట్కు ఒక్కొక్క సంఘం పుట్టుకొని వచ్చింది. ఉపాధ్యాయులు మేనేజ్మెంటుల వారీగా క్యాడర్ల వారీగా చీలిపోయారు. కనుక వారు ఒకే సంఘంగా ఏర్పడలేకపోయి బలమైన ఉపాధ్యాయ ఉద్యమం నిర్మించుకోవడం సాధ్యపడలేదు. అయినప్పటికీ ఫ్యాప్టో, జాక్టో పేర్లతో కొన్ని సమైక్య ఉద్యమాలు నిర్మించి పంచాయత్ రాజ్ ఉపాధ్యాయులకు పెన్సియన్, గ్రాట్యువిటి, జీపీఎఫ్, ప్రావెన్షలైజేషన్, సర్వీస్ రూల్స్, రిగ్రూపింగ్ స్కేల్స్, ప్రమోషన్లు, బదిలీల్లో కౌన్సిలింగ్ పద్ధతి, ఎంఈవో, హెచ్ఎంలకు డ్రాయింగ్, పరిపాలనా అధికారాలు పొందడం లాంటి కొన్ని సమస్యలు సాధించుకోగలిగాం. ఏవైనా సమిష్టి ఉద్యమాల ద్వారానే సాధించుకున్నారు. కానీ కొందరు చెప్పుకుంటున్నట్టుగా ఏ ఒక్క సంఘమో సాధించినది కాదు. ఏ సౌకర్యమైనా విద్యా రంగం పట్ల, బోధకుల సమస్యలపట్ల ఒక సమగ్రమైన అవగాహన కలిగిన ఫెడరేషన్ సంఘాలు సైతం, తామందరిది ఒకే అవగాహన, ఒకే ఉద్దేశం కోసం పోరాటం చేస్తు న్నామని చెప్తున్నప్పటికీ సిద్దాంత రాద్దాంతాల చర్చలు, అందులో కులీనవర్గాల భావనలు, ఆధిపత్యపోరు, నాయకత్వ కుమ్ములాట వెరసి ఫెడరేషన్ సంఘాలు సైతం ముక్కలు చెక్కలు గా విడిపోయిన పరిస్థితి గత 20 సంవత్సరాల నుండి చూస్తున్నాం.
ఒకవైపు ప్రపంచ పెట్టుబడిదారీ వర్గాలు ఏడాదికోసారి దోహాలో సమావేశమై ప్రపంచ వనరులను, ప్రపంచ ప్రజలను ఎలా కొల్లగొట్టి పంచుకోవాలా అని తోడేళ్ల వలె పథకాలు రచిస్తుంటే, వారి వేటకు బలయ్యే గొర్రెలు మాత్రం ఇంకా, ప్రాంతాలు, మతాలు, కులాల కుంపట్లలో కూలి కాలిపోతున్నాయి. సామాన్యులకు అందకుండా ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్య, వైద్యం అలివిగాని భారమైపోగా, సహజవనరులన్నీ సంపన్నుల రాక్షసానందానికి హారతి కర్పూరాలైతుంటే బుద్దిజీవులైన ఉపాధ్యాయులకు బాధ్యత ఉండనక్కర లేదా? వారు కాకుంటే ఈ సమస్యలన్నింటిపైన ఎవరు ఆలోచించాలి మరి? సమాజం నుండి ఎంతో పొందిన, ఎన్నో నేర్చుకున్న, ఇప్పటికీ నిత్యం సమాజం ఇస్తున్న జీతభత్యాలు, పెన్షన్లతో జీవిక కొనసాగిస్తున్న ఉపాధ్యాయులు పెన్షనర్లు విద్యారంగం గురించి ఆలోచింహాల్సిన బాధ్యత అంది.
విద్యపైన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం 1.2 శాతం. కేరళలో 100 శాతం అక్షరాస్యత. ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలు ఉండడానికి కారణం అక్కడ బడ్జెట్లో విద్యకు ఇస్తున్న కేటాయింపులు కాదా? ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయని చిన్నాపెద్ద గొంతెత్తి ప్రచారం చేస్తున్నా ప్రభుత్వ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నిష్పత్తి ఇంకా 51:49గా ఉంది. ఏ రంగమైనా అపసవ్యదిశలో పోతుంటే దాన్ని సవ్య దిశలో పెట్టే బాధ్యత ఆ రంగంలో పనిజేస్తున్న వారిదే. నేడు విద్యా రంగాన్ని సరిజేయాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులకుంది. కనుక ఉపాధ్యాయ సంఘాలు ఐక్యమై, ప్రభుత్వాలను ప్రశ్నించి, ప్రజోపయోగమైన, ప్రజలందరికీ ఒకేవిధమైన విద్యను కామన్ స్కూల్ విధానం ద్వారా ప్రభుత్వాలు అందించాలన్న డిమాండ్తో ముందుకు రావాల్సి ఉంది.
- వీరగోని పెంటయ్య
సెల్ : 9908116990