Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రజావ్యతిరేక విధానాలతో భారతదేశ ప్రతిష్ట దేశంలోనూ, విదేశాల్లోనూ దిగజారిపోతోంది. మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకుల విలీనం తదితర అంశాలతో దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనం ఆరంభమైంది. అప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకుతుండగా పుల్వామా, బాలాకోట్ దాడులు, పాకిస్థాస్తో యుద్ధం వస్తున్నట్టు సృష్టించిన పరిణామాలతో మోడీ అనూహ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇక ఆ తరువాత దేశ ప్రతిష్ట మరింతగా దిగజారిపోయింది. ఒకప్పుడు మోడీ విధానాలు ఎంతో బాగున్నాయని కీర్తించిన వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పత్రికలు నేడు మోడీని తీవ్రగా ఎండగడుతున్నాయి. ప్రధానంగా ఇటీవలి ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లపై దేశ విదేశాల్లో మోడీపై తీవ్రంగా విమర్శలు చెలరేగుతున్నాయి. దీంతోపాటు ప్రతిష్టాత్మక జేఎన్యూలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులపై జరిగిన దాడులపై దేశంలో ఏకంగా 250 యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసలు, ఆందోళనలు చేపట్టడం దేశంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసీ ప్రాంతంలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలోనూ మోడీ విధానాలపై విద్యార్థులు మండిపడుతుడటం గమనార్హం. ప్రముఖ చరిత్రకారులు రామచంద్ర గుహ, ప్రఖ్యాత సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్తో పాటు భారతరత్న, పద్మశ్రీ, పద్మ విభూషణ్, నోబెల్ బహుమతి గ్రహీతలు సైతం ఇప్పుడు మోడీ విధానాలను తూర్పారపడుతున్నారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జేఎస్యూలో ముసుగులు ధరిచిన అరాచక శక్తులు విచక్షణలేకుండా మారణాయుధాలతో చేసిన దాడులకు దేశవ్యాప్తంగా నిరసలు పెల్లుబుకుతున్నాయి. ఇదే సమయంలో విద్యార్థులపై మానవత్వం చూపిన వాళ్లను అర్బన్ నక్సలైట్లనీ, దేశద్రోహులనీ ముద్ర వేయడం దుర్మార్గ చర్య. ప్రముఖ బాలీవుడ్ నటులంతా జేఎన్యూ ఘటనపై తీవ్రంగా స్పందించడం కూడా దేశద్రోహమేనని అంటున్నారు. ప్రముఖ నటి దీపికా పదుకొణే జేఎన్యూ విద్యార్థి సంఘాల నాయకురాలు అయిషీ ఘోష్ను పరామర్శించడంపై ఇప్పుడు దేశంలో బీజేపీ మూకలు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో నెల కొన్న పరిస్థితులపై విదేశాల్లోని ప్రముఖ మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శలు చేయడమే దేశ ప్రతిష్ట దిగజారుతోందనడానికి నిదర్శనం. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సంచలన పత్రిక న్యూయార్క్ టైమ్స్, ఇంగ్లాండ్లోని ప్రముఖ పత్రి క టెలిగ్రాఫ్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అగ్రగామిగా ఉన్న గల్ఫ్ టైమ్స్ పత్రిక, న్యూజిలాండ్లోని ప్రఖ్యాత ఒగాటా పత్రిక, దక్షిణాఫ్రికాలోని ప్రముఖ పత్రిక సిటిజన్ సహా వివిధ దేశాలలో భారతదేశంలో నెలకొన్న మతోన్మాదం, మూకదాడులు, నిరసనలపై ప్రత్యేక కథనాలు వెల్లడించాయి. తాను అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పిన మోడీ ఆ మాట నిలబెట్టుకోవడంలో విఫలమవగా ఇప్పుడు దేశంలో నిరుద్యోగం ఏకాఏకిన నాలుగున్నర దశాబ్దాల వెనుకకు దిగజారిపోవడం దేశంలోని నిరుద్యోగ తీవ్రతను గుర్తుచేస్తోంది. ఆర్థిక మాంద్యంతో ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నా స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను మోడీ సర్కారు అమలు చేయని ఫలితంగా కేవలం ఆరేండ్లలోనే దేశంలో 1,12500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కోట్లమంది వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. 'సబ్కా సాత్ సబ్కా వికాస్..' అంటూ ఊదరగొట్టిన మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల బతుకులు దిగజారిపోతుండగా, అంబానీ, అదానీల ఆస్తులు మాత్రం లక్షల కోట్లకు పెరిగాయి. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కూడా దేశంలోని ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని వెల్లడించడం వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోంది. ఇటీవల జనవరి 8న జరిగిన సార్వత్రిక సమ్మెలో దేశంలో 25కోట్లకు పైగా కార్మికులు, ఉద్యోగులు పాల్గొని మోడీ విధానాలను ఎండగట్టడం అభినందించదగిన విషయం.
- వేదగిరి శ్రీనివాసరావు
సెల్: 9490098104