Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో భారత ప్రజల భవిష్యత్ ఎంతగానో ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో అందరి చూపు ఈ బడ్జెట్ సమావేశాలవైపు మళ్లింది. నిర్మల మదిలో ఏముందో..? ఆమె వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉ న్నాయో....? మందగమనంలో ఉన్న భారత ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దనున్నారోనని యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2018-19 ప్రారంభంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాయి. అమెరికా కూడా ఉక్కిరిబిక్కిరైంది. ఆర్థిక క్రమశిక్షణకు, అభివృద్ధికి మ రోపేరు అని చెప్పుకుంటున్న చైనా కూడా ఈ మధ్యకాలంలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. ఇటువంటి క్లిష్ట సమయంలో గతేడాది ప్రారంభంలో మన దేశ వృద్ధిరేటు 8 శాతం సాధించి ఔరా..! అనిపించుకుంది. అయితే.... ఆరు నెలల తరు వాత మన దేశ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఏడాది చివరకు పరిస్థితులు మరిం త క్షీణించాయి. మొత్తం ప్రపంచం ఆర్థికమాంద్య పరిస్థితులతో అయోమయంతో కొట్టుమిట్టాడుతున్నది. సాక్షాత్ ఐక్యరాజ్యసమితికే నిధుల కొరత ఏర్పడింది. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్య దేశాలు ఇతరత్రా మరికొన్ని దేశాలు ప్రతియేటా ఇచ్చే విరాళాలలో కోత ఏర్పడడంతో సమితి సైతం కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో మన భారత పాలకులు మేకపోతు గాంభీర్యంతో ''ప్రపంచమంతా ఆర్థికమాంద్యం ఏర్పడినప్పటికీ మనకు ఆ దుస్థితి రాలేదు. కేవలం ఆర్థిక మందగమనం మాత్రమే ఉన్నది. గతంలో అనేక ఆర్థిక సంక్షోభాలను తట్టుకొని ముందుకెళ్లగలిగాం. మళ్లీ గత వైభవం వస్తుంది'' అని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా మన దేశంలో సంపదను సృష్టించడానికి పుష్కలమైన వనరులున్నాయి.
మానవవనరుల సంపద కూడా గణనీయంగా ఉంది. కానీ ఈ మానవ వనరుల ద్వారా సహజ వనరులను, ఇతర వనరులను ఉపయోగించడంలో పాలకులు విఫలమవుతున్నారు. విఫలం అనడం కన్నా.... కక్కుర్తితో, స్వార్థంతో వ్యవహరిస్తున్నారంటే బాగుంటుంది. రెండేండ్ల కిందట ప్రపంచ ధనిక దేశాలలో మన దేశానికి 6వ స్థానం వచ్చిందని పాలకులు ఎగిరి గంతులేశారు. అయితే.... కేవలం 1 శాతం నల్లకుబేరుల చేతుల్లో 70 శాతం సంపద కేంద్రీకృతమై ఉంటే.... దేశం ధనికమెలా అవుతుంది? రెండేండ్ల కిందట మన భారత ఆర్థికశాఖ వ్యవసాయరంగంలో 2022 నాటికి రెట్టింపు ఆదాయం తీసుకురావాలని సమగ్రమైన ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక గురించి అప్పటినుంచి ఇప్పటివరకు చర్చలు, సమావేశాలు, చైతన్య వేదికలు నిర్వహిస్తూనే ఉన్నారు. కుంటుబడిన వ్యవసాయరంగాన్ని, నత్తనడక నడుస్తున్న పారిశ్రామికరంగాన్ని రెండు కండ్లుగా భావించి ముందుకు నడిపించాలి. మొత్తం పారిశ్రామికవ్యవస్థ కేవలం కొద్దిమంది నల్లకుబేరుల గుప్పెట్లో చిక్కుకుంది. ఇలా కాకుండా ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రజలను భాగస్వాములను చేసి సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వాలి. మార్కెటింగ్ బాధ్యతలు కూడా ప్రభుత్వమే చేపట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాలి. వ్యవసాయ రంగంలో కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను భారీ స్థాయిలో సృష్టించాలి. రైతులకు, వ్యాపారులకు మధ్య దళారీ వ్యవస్థలను రద్దు చేయాలి. ఈ విధంగా రైతు ఉత్పత్తులను రైతులే అమ్ముకునే విధంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో నూతన విధానాన్ని తీసుకురావాలి. ఈ స్థాయిలో దూరదృష్టితో మన ఆర్థికశాఖమంత్రి ఆలోచిస్తారో సాదాసీదాగా ప్రతియేటా ప్రవేశపెడుతున్న బడ్జెట్ తరహాలోనే ఈసారి కూడా కార్పొరేట్లకు కొమ్ముకాచేవిధంగా తీసుకొస్తారో... వేచి చూడాలి.
- తిప్పినేని రామదాసప్ప
సెల్ : 99898 18212