Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల మున్సిపాల్టీ ఎన్నికల ఘట్టం మహా రసవత్తరంగా ముగిసింది. మద్యం ఏరులై పారితే.. నోట్ల కట్టలు.. కట్ల పాముల్లా చరచరా పాకాయి. ఈ తంతులో ఎన్నెన్ని వింతలో... సూర్యాపేట గ్రేడ్-వన్ మున్సిపాల్టీకి సంబంధించి మరో విచిత్రం చోటు చేసుకున్నది. అక్కడి అధికార పార్టీలోనే నాలుగైదు గ్రూపులుండటంతో మంత్రి జగదీశ్రెడ్డికి తలబొప్పి కట్టింది. ఒక్కో వార్డులో టీఆర్ఎస్ తరపున నిలబడిన అభ్యర్థులు.. తామే గెలవాలి, గెలిచి మున్సిపాల్టీ చైర్మెన్ కావాలని తెగ ఉబలాట పడిపోయారు. అదే తమాషా.. పక్క వార్డుల్లో ఉన్న వారు అధికార పార్టీ వారైనా సరే.. వారిని ఓడించి తీరాలని కంకణం కట్టుకున్నారు. వారు గెలిస్తే ఎక్కడ తమ చైర్మెన్ పోస్టుకు పోటీకొస్తారోననే ఉద్దేశంతో... ఇలా సొంత పార్టీ వాళ్లనే ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారట అక్కడి కారు పార్టీ అభ్యర్థులు. ఇందుకోసం పొరుగు వార్డులో ఉన్న గులాబీ కౌన్సిలర్లను ఓడించేందుకు డబ్బులు కూడా తెగ ఖర్చు పెట్టారట. ఈ విషయం తెలిసి 'రాజకీయాలంటే ఇలా కూడా ఉంటాయా...?' అని ముక్కున వేలేసుకున్నారు సూర్యాపేట జనాలు.
- జి.రేణయ్య