Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వడ్డించేవాడు మనవాడైతే విస్తరంతా మనదే అనే సామెత ఊరికే రాలేదు. తాజాగా ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ ఇందుకు అద్దం పడుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసిన కాషాయ దళం బీజేపీ యేతర రాష్ట్రాలకు మొండి చేయి చూపించింది. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్న సామెతను ఒంట బట్టించుకున్న మోడీ సేన తన వారికి కొసరి కొసరి వడ్డించుకున్నది. ఇతరులకు మాత్రం అన్నింటా అన్యాయం చేసింది. 2011 జనాభా ప్రాతిపదికన సాధారణం నుంచి మొదలుకొని ప్రత్యేక కేటాయింపుల వరకు అడుగడుగునా పక్షపాతమే పాటించింది. కేంద్ర పన్నుల వాటా చెల్లింపుల్లో తీసుకున్న ప్రామాణికాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్ట పోయాయి. అక్కడక్కడా బీజేపీ రాష్ట్రాలకు ఈ సెగ తగిలినా ప్రత్యేక పథకాలతో ఆ లోటును పూడ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కర్ణాటక రాజధాని బెంగళూర్కు 19 వేల కోట్లతో సబర్బన్ మెట్రో రైల్వే పథకాన్ని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. రాజ ధర్మాన్ని పాటించని రాజు ఏదో ఒక రోజు ప్రజల ఆగ్రహానికి గురికావడం తథ్యం. ఇందుకు బీజేపీ మినహాయింపు కాదు.
- మల్లేష్