Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ రెండో పర్యాయం అధికారంలో కొనసాగు తోంది. బడుగులకు అండగా ఉంటామనీ, సంక్షేమ పథకాల్లో వారికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి అనేకసార్లు స్వయంగా ప్రకటించారు. అయితే ఇటీవల ఎంబీసీ కార్పొరేషన్కు రూ.250 కోట్లు విడుదల చేస్తూ జీవో 99 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. రజక, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించి, ఒక్క పైస కూడా లబ్ధిదారులకు విడుదల చెయ్యలేదు. మిగిలిన 9 కులాల ఫెడరేషన్లకు రూ.164 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. గ్రామీణ కుల వృత్తిదారులు, సంచార, సేవా, ఉత్పత్తి వృత్తుల వారికి ఉపాధి కింద బ్యాంకుతో లింకు పెట్టి రుణాలు ఇస్తున్నామంటూ గొప్పగా చెప్పిన ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల, ఫెడరేషన్లోని సొసైటీలు, వ్యక్తిగత రుణాల కోసం ఆన్లైన్లో 5,77,643 దరఖాస్తులు వచ్చాయి. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలోనే 74,055 ఆన్లైన్ బీసీ రుణాల దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి రుణాలిస్తామని బహిరంగంగా ప్రకటన చేశారు. జిల్లాలవారీగా యూనిట్ల టార్గెట్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు.
రాష్ట్ర జనాభాలో 52 శాతంగా ఉన్న బీసీ, ఎంబీసీల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని ఆర్భాటంగా ప్రకటనలు చేయడమే కాకుండా బీసీ మంత్రులు ప్రెస్మీట్లో బహిరంగంగా చెప్పారు. కానీ గత బడ్జెట్ నుండి ఒక్క పైస ఖర్చు చేయలేదు. బీసీల్లోవున్న కొన్ని కులాలైన యాదవ, గౌడ, ముదిరాజ్, మున్నూరుకాపు, పద్మశాలి, యాదవులకు గొర్రెలు, ముదిరాజ్లకు చేపపిల్లలు ఇచ్చి మిగతా మూడు, నాలుగు కులాలకు హామీలతో సర్ది చెప్పారు. బీసీలపట్ల స్పష్టత లేని విధానాలతో అరకొర పథకాలు అందినప్పుడు బీసీల్లో 34 శాతంగా ఉన్న ఎంబీసీ, సంచార కులాలైన వృత్తిదారులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది. వీరు నేటికీ గుర్తింపుకు నోచుకోలేదు. వీరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు లేవు. ఎంబీసీలకు, బీసీలకు 2018-19లో సుమారు 5.70 లక్షల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే వీరికి కావాల్సిన బడ్జెట్ సుమారు 10 వేల కోట్లు. కానీ కొద్దిమందికే ఇచ్చే ప్రయత్నం చేస్తుందేమో అనే సందేహం కలుగుతుంది. వాస్తవానికి 2014-15లో అరకొర ఇచ్చారు. 2017-18 మరో 3 వేల మందిని గుర్తిం చి రుణాలు ఇవ్వలేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి తప్పకుండా రుణం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఉపాధి కోసం చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటుకు బీసీ, వృత్తిదారులు ఆశావహులు దరఖాస్తు చేసుకొని రుణం ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. అందరికి రుణాలు అందాలంటే బీసీ బడ్జెట్ పక్కదారి పట్టించకుండా బీసీలకే ఇస్తే అందులోనుండి దరఖాస్తు చేసుకున్న వారందరికి రూ.10 వేల కోట్లు సరిపోతాయి. కానీ ప్రభుత్వం 2 వేల కోట్లతో సరిపెట్టాలని చూస్తుంది. ఇటీవల మంత్రులు తమ మాటల్లో బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికి రుణాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేయడం బీసీ, ఎంబీసీలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా ఎంబీసీలకు కార్పొరేషన్, దానికో చైర్మన్, వెయ్యి కోట్లు 2 సార్లు కేటాయించి వాటిని ఖర్చు చేయకుండా ఇతర వాటికి మళ్లించడమంటే ఎంబీసీల పట్ల వివక్షత అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రుణాలు మంజూరయ్యేవి. వారి అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి కేటాయించిన బడ్జెట్ను ఖర్చు చెయ్యాల్సివుంది. బీసీ రుణాల దరఖాస్తుల పరిశీలనను గత సంవత్సరం మే-15 నుండి 21 వరకు బీసీ అర్హులను గుర్తించి, జూన్లో లిస్టు పెడతామని చెప్పి నేటికి ప్రకటించలేదు. ఇప్పటి వరకు బ్యాంకులకు ఎలాంటి సమాచారం జారీ చెయ్యలేదు. బ్యాంకుతో లింకు లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు.
ఇప్పటికేవున్న ఫెడరేషన్లకు ఉమ్మడిగా గాని విడిపోయాకగాని వాటి నుండి బీసీ, ఎంబీసీలకు గత ఐదేండ్లలో బడ్జెట్ నుండి ఒక్క పైసా ఖర్చు చెయ్యలేదు. రజకులకు, నాయిబ్రాహ్మనులకు రూ.500 కోట్ల నుండి ఒక్కపైస ఖర్చు చెయ్యలేదు. ట్రైనింగ్ల పేరుతో రజకులను నాయిబ్రాహ్మణులను ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు. వారికీ లబ్ధి చేకూరలేదు. గత ఆరు మాసాలు వరుసగా ఎన్నికలు రావడం, ఎన్నికలు పూర్తయ్యాక రుణాలు విడుదల అవుతాయని ఆశావహులు ఎదురు చూడటంతోనే సరిపోతుంది. కాబట్టి ప్రభుత్వం బీసీ, ఎంబీసీ, సంచార కులాల నుండి దరఖాస్తు చేసుకున్న వారందరికి రుణాలు మంజూరు చెయ్యాలి. అర్హులైన వారికి 90 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలి.
- గుమ్మడిరాజు నరేష్
సెల్ : 9491039520