Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుద్ధం నిర్దాక్షిణ్యమైనది. అందులోనూ రాజ్యంతో యుద్ధమన్నప్పుడు కత్తుల కొనలపై నిలబడి జీవితాలను మరణం ముందు నిలబెట్టడమే. అలా తన జీవితాన్ని యుద్ధభూమిలోనే నిర్మించుకున్న వీరవనిత ఆరుట్ల కమలాదేవి. నమ్మిన సిద్ధాంతం కోసం, కమ్యూనిజమనే దీపాన్ని నెత్తిన పెట్టుకొని.. బతుకంతా అరుణకాంతిగా వెలిగిన ధీరవనిత ఆరుట్ల కమలాదేవి. నాటి నల్లగొండ జిల్లా నేటి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో 1920లో జన్మించింది. తల్లిదండ్రులు పల్లా లక్ష్మీనర్సమ్మ, వెంకటరాంరెడ్డి. మధ్య తరగతి రైతు కుటుంబం. పుట్టిన ఊరులోనే పెద్ద బాలశిక్ష చదివింది. 11వ యేట తన మేనబావ, ప్రముఖ కమ్యూనిస్టు దిగ్గజం ఆరుట్ల రామచంద్రారెడ్డితో ఆమె వివాహం జరిగింది.
కమలాదేవి అసలు పేరు రుక్మిణి. ఆనాటి ప్రముఖ జాతీయోద్యమ నాయకు రాలైన కమలాదేవి చటోపాధ్యాయ అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డికి ప్రత్యేక అభి మానం. అందుకే రుక్మిణి పేరును కమలాదేవిగా మార్చారు. పేరు మార్చడంలోనే కాదు, ఆమె జీవితాన్ని తీర్చిదిద్దడంలోనూ రామచంద్రారెడ్డి తన ఆదర్శాన్ని చాటా డు. పెండ్లితోనే ఆడపిల్లల జీవితాలు ముగిసిపోతున్న కాలంలో... ఆమె జీవితా నికి గొప్ప ప్రారంభాన్నిచ్చాడాయన. పై చదువుల కోసం హైదరాబాద్లో మాడపా టి హనుమంతరావు స్థాపించిన బాలికల ఉన్నత పాఠశాలలో మూడో తరగతిలో చేర్పించాడు. ఆ రోజుల్లో ఆడపిల్లలు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల బాలికలకు చదవడమే గగనం. ఇక వసతి గృహాలెక్కడివి? కానీ రాజబహ ద్దూర్ వెంకటరాంరెడ్డిని ఒప్పించి రెడ్డి హాస్టల్కు అనుబంధంగా బాలికల హాస్టల్ను కూడా స్థాపింపచేశాడు రామచంద్రారెడ్డి. అలా ఏర్పడిన ఆ అమ్మాయిల హా స్టల్లో చేరిన మొట్టమొదటి అ మ్మాయి కమలాదేవి. హెచ్ఎస్సీ వరకు అక్కడే చదువుకుంది.
హాస్టల్లో ఉన్నప్పుడే కమలాదేవి రాంచంద్రారెడ్డితో కలిసి ఆంధ్ర మహాసభలకు హాజరవుతుండేది. నిజామాబాద్లో జరిగిన ఆరవ ఆంధ్రమహాసభ, మల్కాపురంలో జరిగిన ఏడవ ఆంధ్రమహాసభలో వాలంటీరుగా పని చేసింది. ఆ క్రమంలో చదువుతోపాటే రాజకీయ అవగాహనా పెరగడంతో.. తన భర్తతో కలిసి రాజకీయ కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొనేది. స్కూల్ ఫైనల్ పాసైన తర్వాత స్వగ్రామం కొలనుపాక చేరింది. కానీ ఇంటికే పరిమితమవడానికి ఆమె సాధారణ మహిళ కాదు కదా! అమె ఓ కమ్యూనిస్టు చైతన్యం..!! అందుకే ఆ చైతన్యం ప్రజలకందించడానికి వారిని అక్షరాలకు చేరువ చేయాలనుకుంది. తన ఆలోచనలను భర్తతో పంచుకుంది. కానీ.. ఆ రోజుల్లో పాఠశాలలు స్థాపించడానికి అవకాశం ఉండేది కాదు. ఉన్నా ఉర్థూలో తప్ప తెలుగులో చదువుకోకూడదు. ఇలాంటి ఆంక్షల నడుమ, జాగీరు ప్రభుత్వం పాఠశాలలకు ఎలాగూ అనుమతివ్వదు కనుక.. ''రామానుజ కూటమి'' అనే పేరుతో గ్రంథాలయ భవనాన్ని తమ స్వగ్రామమైన కొలనుపాకలో ప్రజల స హకారంతో ఆరుట్ల సోదరులు రెండు నెలల్లో పూర్తి చేశారు. చదువు విలువ తెలి సిన మనిషి కమలాదేవి. తాను చదువుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో తెలు సు. కనుక ఆ కష్టాలు తన ప్రజలకు ఉండకూడదు అనుకుంది. ఆ భవనంలోనే బాలికల పాఠశాలను ప్రారంభించింది. ఆడపిల్లలకు ఉచితంగా చదువు నేర్పడం మొదలుపెట్టింది. అది దినదినాభివృద్ధి చెందింది. విషయం తెలిసిన జాగీర్దార్ల కడుపు మండింది. బలవంతంగా ఆ పాఠశాలను మూసివేశారు.
అక్షరాలు నడిచే దారుల్లో వెలుగుల దీపాలవుతాయని ఆమెకు తెలుసు. అక్షరాలు మట్టి మనుషుల బతుకులు మార్చే ఆయుధలవుతాయనీ ఆమెకు తెలుసు. అక్షరాలు బానిస బతుకుల బంధ విముక్తికి బాటలు వేస్తాయనీ ఆమెకు తెలుసు. అందుకే మహిళను చదువుకు దూరం చేసి సంప్రదాయాల మాటున వంటింటికే పరిమితం చేసి, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వారి పాత్రను పురుషుల నీడగా మార్చివేయజూస్తున్న ఆ ఫ్యూడల్ ఆధిపత్యాన్ని సహిం చలేకపోయింది కమలాదేవి. మహిళల జీవితాల్లో ఉషోదయాల కోసం ఉద్యమమై నిలిచింది. మూసివేసిన పాఠశాలను కొలనుపాక జైనమందిరంలో తిరిగి ప్రారంభించింది. ''కన్యా బాలికల పాఠశాల'' పేరుతో చదువుతోపాటే పిల్లలకు స్వావలంబననూ నేర్పింది. అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెంచటానికి సైకిల్ తొక్కడం నేర్పించింది. సైకిల్ తొక్కడం ఈరోజు మనకు ఓ చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ ఆ కాలానికి అమ్మాయిలు సైకిల్ తొక్కడం ఓ అసాధారణ దృశ్యం. అలాంటి రోజుల్లో కమలాదేవి నేతృత్వంలో వందలమంది ఆడపిల్లలు సైకిళ్లపై దూసుకుపోతుంటే.. ఆ దారుల్లో ఎన్ని కళ్లు మురిసిపోయాయో..! ఎన్ని కలలు మెరిసిపోయాయో..! ఎంత ధైర్యం మొగ్గ తోడిగిందో..!
ఆ ధైర్యమే ఆమెను కమ్యూనిస్టుగా పదును పెట్టింది. ఆ సాహసమే ఆమెను సాయుధ పోరాటానికి నడిపించింది. దొరలూ జాగిర్దార్లూ, నిరంకుశ నిజాం రాచరికం చెర నుండి ఈ నేలను విముక్తి చేయడానికి.. కమ్యూనిస్టుపార్టీ ఇచ్చిన సాయుధపోరాట పిలుపునందుకుంది. 1943లో విజయవాడలో జరిగిన మహిళా ఆత్మరక్షణ శిబిరంలో శిక్షణ పొందింది. స్వీయరక్షణ కోసం కారం, రోకలిబండల్ని ఎలా ఆయుధాలుగా ఉపయోగించాలో నేర్చుకుంది. ఆ తరువాత ఆయుధ శిక్షణలో ఆరితేరింది. అనేక పోరాటలలో ముందు నిలిచి.. స్త్రీ అంటే సమాజంలో ఉన్న సుకుమారత్వం, లాలిత్యం అనే భావజాలాన్ని ఛేదించి.. గరిట తిప్పే చేతులలో గన్నులు పట్టి, తూటాల పూలమాలలతో పల్లెపల్లెనూ అలంకరించింది.
అవి సాయుధపోరాటం మహౌజ్వలంగా సాగుతున్న రోజులు. 1946లో నిజాం సర్కారు మార్షల్లా విధించే సమయానికి కమలాదేవికి రెండేండ్ల పిల్లవాడు. సాయుధ పోరాట యోధులంతా అజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది. అప్పుడు కమలాదేవి కొడుకు చిన్నవాడు కనుక చాలామంది అజ్ఞాతంలోకి పోవద్దని చెప్పినప్పుడు.. మాతృత్వం అన్నది ప్రజలందరి కోసమంటూ అడవుల్లోకి తరలిపోయింది. ప్రతి మనిషి జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరీక్షలకు నిలబడినవారికే చరిత్ర పుటల్లో స్థానం లభిస్తుంది. అట్లా నిలిచింది కనుకనే కమలాదేవి చరిత్రలో ఒక అగ్ని శిఖగా నేటికీ జ్వలిస్తూనే ఉంది.
అజ్ఞాత జీవితంలో మహిళా గెరిల్లా దళాలతో నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అనేక ప్రత్యక్షదాడుల్లో పాల్గొంది. చల్లూరు గుట్టలు అప్పట్లో దళాలకు ప్రధాన రక్షణ స్థావరం. అది పసిగట్టిన యూనియన్ సైన్యాలు ఆ గుట్టలను చుట్టుముట్టాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోతాయి. దళాలు నిర్మూలించబడతాయి. యుద్ధంలో శత్రువుది బలమైన సైన్యమే కాదు, బలమైన ఆయుధ సంపత్తి. పోరాడటం తప్ప తప్పించుకునే మరో మార్గం లేదు.. అప్పుడు నలుదిక్కులకూ కాల్పులు జరుపుతూ ఎత్తైన కొండలు ఎక్కుతూ దిగుతూ.. చుట్టుముట్టిన కంపెనీ సైనికుల నుండి దళాలను తప్పించడంలో ఆమె సాహసాన్ని నేటికీ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. కంపెనీ సైన్యాలను తిప్పికొట్టిన కమ్యూనిస్టు దళాల ఆ వీరోచిత పోరాట చరిత్రను నేటికీ ఆ చల్లూరు గుట్టలు చెబుతూనే ఉంటాయి. అలా అనేక గ్రామాల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి దళాలను నిర్మించింది కమలాదేవి. పల్లెల్లో పడగవిప్పిన భూస్వామ్య పెత్తనాలు, కంపెనీ సైన్యాల దాడులతో, రజాకారు పిశాచాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రతీ క్షణం జనం కోసం పోరాటమై నిలబడింది కమలాదేవి.
అజ్ఞాత జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. ఒకసారి తీవ్రమైన అనారోగ్యంపాలై రహస్యంగా ఆస్పత్రికి వెళ్తుండగా, కమ్మగూడెం దగ్గర మాటు వేసిన బహద్దూర్పేట పోలీసులు ఆమెను, భర్తతో సహా అరెస్ట్ చేశారు. రామచంద్రారెడ్డిని ఖమ్మం జైలుకు, కమలాదేవిని వరంగల్ జైలుకు పంపారు. ఆ తర్వాత ఔరంగా బాద్, సికింద్రాబాద్ కారాగారాల్లో రెం డున్నరేండ్లు ఆమె నరకం చూసింది. అ యినా ఎప్పుడూ ధైర్యం, భవిష్యత్తుపై విశ్వాసం కోల్పోని కమలాదేవి 1951లో విడుదలైంది.
సాయుధ పోరాటం విరమణ త ర్వాత 1952లో ఆలేరు నియోజకవ ర్గం నుండి ఎమ్మెల్యేగా భారీ విజయా న్నందుకుంది. 1967 వరకు ఎమ్మె ల్యేగా కమలాదేవిది అప్రతిహాత జైత్ర యాత్ర. 1962లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, పు చ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నా యకుడిగా, కమలాదేవి ఉపనాయకు రాలిగా శాసనసభలో ప్రాతినిధ్యం వ హించారు. 1964లో ప్రతిపక్ష నా యకురాలిగా ఎన్నికై మొదటి మహి ళా ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్ర సృష్టించింది. ప్రజా క్షేత్రంలోనే కాదు, చట్టసభ ల్లోనూ అమెది అవిశ్రాంత పోరాటమే. ఎమ్మెల్యేగా అనేక సమస్యలపై ఉద్యమించా రు. 1953లో కరువు ఏర్పడ్డప్పుడు కరువు ఫండ్ను ఏర్పాటు చేయడంలో, ఖైదీల ను పెరోల్పై వదిలి పెట్టినప్పుడు మధ్యలో పోలీసుల జోక్యం వద్దన్న పోరాటంలో, సేథ్ సింధ్, నీరడీల జీతాలు పెంచడంలో, రజాకార్ల కాలంలో నష్టపడ్డ గ్రామాల లోని ప్రజలకు ఇండ్లు కట్టుకోవడానికి ఇచ్చిన డబ్బును తిరిగి వసూలు చేయొద్దన్న పోరాటంలో ఆమె ఎప్పుడూ ప్రజలమధ్యే, ప్రజలతోటే. ప్రజాపక్షపాతిగా చట్టసభలను కూడా నికరమైన పోరాట క్షేత్రంగా మలిచిన పోరుబిడ్డ కమలాదేవి. అనుక్షణం ప్రజలనంటిపెట్టుకొని.. ఎక్కడవున్నా కమ్యూనిస్టులు తమ మూలాలను మరవరని నిరూపించిన ఎర్ర కలువ కమలాదేవి.
1973లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యదర్శిగానూ పని చేసిన కమలా దేవి.. తన 65 సంవత్సరాల సుదీర్ఘ క్రీయశీలరాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీర్తిశిఖ రాలను అధిరోహించారు. అనంతరం ఆమె స్వచ్ఛందంగా రాజకీయాల నుండి వి శ్రమించారు. ఆదర్శ మహిళగా, అణువణువునా ధైర్యాన్ని నింపుకున్న యోధురాలు గా, పోరాటవనితగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఆరుట్ల కమలాదేవిని కాకతీయ వి శ్వవిద్యాలయం 1998లో గౌరవ డాక్టరేట్ అందించి తనను తాను సత్కరించుకు ంది. జీవితంలోని ప్రతి దశనూ ప్రజా హక్కుల కోసం, అభ్యున్నతి కోసం పంచిన కమలాదేవి 1జనవరి 2001న తుదిశ్వాస విడిచారు. ఈ విశాలప్రపంచంలో కాల ం బహు చిత్రమైనది. మానవ జీవిత ముద్రణలను నిరంతరం అనేక రూపాలుగా తనలో దాచుకుంటుంది. మంచివారు మరణించి బతికితే, చెడ్డవారు బతికుండీ మరణిస్తారు. మరణించినా కమలాదేవి ఎప్పుడూ మనుషుల మధ్యన మహౌన్న తురాలిగా వెలుగొందుతూనే ఉంటుంది!! పోరాట జెండాకు ఎరుపురంగు అద్దుతూనే ఉంటుంది !!
- స్ఫూర్తి
సెల్ : 9490098694