Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎడ్లు ఎన్ని సచ్చినాయనికాదు.. వడ్లు ఎన్ని పండినయా అనే చందంగా దేశంలో ఎన్నికల తీరు కనిపిస్తోంది. ఏమి చేశామా అనేది కాదు ఎన్నికల్లో గెలిచామా లేదా.. అనే తీరు మేధావులను అలోచింపచేస్తోంది. సామాన్యులను ఎన్నికలకు దూరం చేస్తోంది. నేడు చట్టసభల్లో, ప్రజల భాగస్వామ్యం ఉంది. కానీ మెజారిటీ ప్రజల భాగస్వామ్యం లేదు. హంగూ ఆర్భాటం, డబ్బూ దర్పం ఉన్న కొన్ని పాలక కులాలకే చట్టసభలు పరిమితమయ్యాయి. దేశంలో మూడువేలకు పైగా బలహీన వర్గాలకు చెందిన కులాలున్నాయి. నేటికి కేవలం పదుల సంఖ్యలోనే చట్టసభలలో అడుగు పెట్టాయి. వేలాది కులాలు పార్లమెంట్ గడపతొక్కలేదు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యానికి సంకేతం? ప్రజాస్వామ్యం పరిపూర్ణత సాధించాలన్నా, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా, మెజారిటీ బలహీన వర్గాల భాగస్వామ్యం వ్యవస్థలో నిక్షిప్తమై ఉండాలి. సంస్థపైనా, వ్యవస్థపైనా బలహీనవర్గాలు, పేదలు భాగస్వామ్యం ఉంటేనే రాణిస్తాయి. భారతదేశ ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే విషాదం. ప్రపంచస్థాయి కోటీశ్వరులున్నా, భారతదేశం పేదదే, ప్రభుత్వాలు అవినీతిని నియంత్రించక పోవటం వల్ల పేదలు ధనవంతుల మధ్య అంతరం పెరిగి జీవనం, జీవితం కుచించుకుపోతున్నది. దీంతో పేదలు మరింత పేదలుగాను ధనవంతులు మరింత ధనవంతులుగానూ అవుతున్నారన్న భావన ప్రజల్లో ఉంది. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు ప్రపంచంలోనే అణగారిన వర్గాలు, పేదలు, యాభైశాతానికిపైగా ఉన్నా, బీసీల సంఖ్య చట్టసభల్లో వేళ్లమీద లెక్కకే పరిమితం. వాస్తవానికి బీసీలు 272 మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి. కానీ ఆ పరిస్థితి ఉందా! కారణం వారిదగ్గర ఎన్నికల్లో గెలవ గలిగే డబ్బు లేకపోవటమే, ఎన్నికల వ్యవస్థను నియంత్రించాల్సింది, వ్యవస్థదా! వ్యక్తులదా! ఎన్నికల వ్యవస్థ వైఫల్యం కాదా! వ్యవస్థల వైఫల్యం వల్ల రాజ్యాంగ లక్ష్యాలు ఎప్పుడు నెరవేరాలి.
నేడు రాజకీయాలు మేధావులకు, డబ్బులేని బలహీనవర్గాలకు, పేదలకు కిందికులాలలకు వేదికగా లేవు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసే స్థోమత బలహీనవర్గాలకు లేకపోవడమే కారణం. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలనే నిబంధన ఉన్నా, అది అమలు కావటంలేదు. దాన్ని అమలు చేసేది వ్యవస్థా, వ్యక్తులా, రాజ్యాంగాన్ని, చట్టాలను కాపాడాల్సిన వ్యవస్థలు నిర్వీర్యమైతే కంచే చేను మేసిన చందంగా ఉంటుంది. నేడు ప్రజాస్వామ్యం ఓ తంతుగా ఉంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు ఖర్చుపై అవేదన చెందారు. మారాల్సింది ప్రజలే కాని వ్యవస్థకాదు అంటున్నారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ, ఖర్చు పెట్టేవాడికి పేదలు లోకువ, ప్రభుత్వాలకు ప్రజలు లోకువన్నట్టుగా వ్యవస్థ బాధ్యతల్ని విస్మరించి, ప్రజలే మారాలి అనడం ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే 28లక్షలు, ఎంపీ 70 లక్షలు ఖర్చు పెట్టాలనే నిబంధనలను ప్రభుత్వాలు ఎంత వరకు అమలు చేస్తున్నాయి. ఇది వ్యవస్థ నిర్లక్యం కాదా? రాజకీయాలలో వ్యవస్థాగతంగా ఎన్నికల ఖర్చు కట్టడి చేయగలిగితే, చట్టపరిధి లోనే ఖర్చు నియంత్రించగలిగితే బలహీన వర్గాలు పేదల సంఖ్య ఘణనీయంగా చట్టసభలలో పెరుగు తుంది. కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఖర్చు అనే బాధ చట్టసభల్లో ప్రవేశించలేని వారందరిదీ. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత వ్యక్తులది కాదు. వ్యవస్ధది. రాజ్యాంగ విరుద్ధమైన పాలన చేస్తూ, ఆడలేక మద్దెల ఓటిదంటూ, ప్రశ్నించే గొంతుల్ని అణచేయడం పాలకులకు పరిపాటి అవుతున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగటం వల్ల పేదలు ధనికుల మధ్య అంతరం పెరుగుతున్నది. పేదల జీవనం, జీవితం మరింత దిగజారి ప్రజాస్వామ్యం మరింత దిగజారుతున్న పరిస్థితి నేడుంది. ఎవరు అధికారంలో ఉంటే వారు రాజ్యాంగ చట్టబద్ధ సంస్థలైన ఎలక్షన్ కమిషన్, సీబీఐ, ఈడీలను నిర్వీర్యపరుస్తున్నారు. స్వీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న నేపథ్యంలో మారాల్సింది ప్రజలకన్నా ముందు ప్రభుత్వాలే, వ్యవస్థాగతంగా సంస్థాగతంగా పని చేసిన వెంకయ్యనాయుడికి ఇవి తెలియనివా? ఎన్నికల్లో విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టిన వాళ్లే రాజకీయ పలుకుబడితో అక్రమ దందాలకు తెరతీస్తారు. కోట్లు ఖర్చు పెట్టినవాళ్లు వ్యవస్థను నియంత్రించి మరింత అవినీతికి పాల్పడతారు, కారణం చట్టాల వైఫల్యం, ప్రజల సామాజిక, ఆర్థిక వెనకబాటు, రాజకీయాలలో అవినీతిని అడ్డుకోలేని అశక్తత. చట్టాల వైఫల్యం వల్లనే డబ్బుకు లోకం దాసోహం అనే పరిస్థితికి సమాజం నెట్టబడింది. సమాజానికే గురువుగా, అవగాహన అర్హతలేని వాళ్లు నాయకులుగా చెలామణీ అవుతున్నారు. నాయకులు తమ పనిని వదలిపెట్టి, అన్నదమ్ములు, భర్తాభార్య, రియల్ఎస్టేట్ వ్యాపారాలు, పంచాయితీలు చేస్తూ, రాజకీయాలను కలుషితం చేస్తున్న తీరు ఆవేదన కలిగిస్తోంది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధిగా అక్రమ సంపాదనకు సమాజాన్ని ప్రయోగశాలగా మారుస్తున్నాడు, దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలకే ఎక్కువ బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యం పరిపూర్ణత సాధించాలన్నా, ఎన్నికల వ్యయం తగ్గాలన్నా ఎలక్షన్ కమిషన్ సక్రమంగా పనిచేయాలి.
- సాధం వెంకట్
సెల్: 9395315326