Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతమైన ఈ విశ్వంలో జీవుల ఆవిర్భావం ఒక అంతుచిక్కని ప్రశ్నగా వేధిస్తున్న సమయంలో శాస్త్రీయ సమాధానమై నిలిచింది డార్విన్ పరిణామవాదం. జీవుల పుట్టుక, మరణానికి సంబంధించి పూర్తిగా నూతన, శాస్త్రీయ దృక్కోణాన్ని ప్రసాదించింది. పారిశ్రామిక విప్లవకాలంలో చార్లెస్ డార్విన్కు ముందు జీవశాస్త్రంలో అనేక నూతన ఆవిష్కరణలు జరిగినప్పటికీ జీవుల పుట్టుక, పరిణామంపై సమగ్రమైన వివరణ ఇవ్వడంలో సఫలం కాలేకపోయారు. కానీ చార్లెస్ సిద్ధాంతాలు ''మనిషి కోతి నుంచి వచ్చాడు, మనిషిని దేవుడు సృష్టించలేదు'' అనే శాస్త్రీయతను తెరమీదికి తేవడంతో ప్రపంచంలో తీవ్రమైన వాదోపవాదాలూ, విపరీతమైన సామాజిక వివాదాలు చెలరేగినా అంతిమంగా అది శాస్త్ర ప్రపంచంలో పెను విప్లవాలకు మూలమైంది. 1809 ఫిబ్రవరి 12న జన్మించిన చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇంగ్లాండ్కు చెందిన వ్యక్తి. బిగీల్ అనే నౌకలో డార్విన్ ప్రకృతి పరిశీలన నిమిత్తం ప్రపంచ యాత్ర చేసి జీవుల భిన్న లక్షణాలపై సమగ్రమైన వివరణ ఇచ్చాడు. ఈ భూమి మీద మానవునితో సహా ఇప్పుడున్న జీవజాతులు యధాతథంగా సృష్టించబడ్డాయన్న వాదనను సవాలు చేసి చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిష్కారం చూపాడు. అయితే జీవులు జీవపరిణామం ద్వారా ఆవిర్భవించాయన్న భావనను సాంప్రదాయవాదులు తిరస్కరించారు. కానీ చార్లెస్ డార్విన్ జాతుల ఆవిర్భావం (origin of species) అనే గ్రంథంలో పరిణామాల ద్వారా జీవులు ఆవిర్భవిస్తాయని చెప్పడమే కాకుండా జీవ పరిణామానికి ప్రకృతి వరణం (natural selection) కారణమని తిరుగు లేని విధంగా నిరూపించాడు. జీవులలో భిన్నత్వం ఉంటుందనీ, ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా భిన్నత్వం ఉంటుందనీ పేర్కొన్నాడు. సృష్టిలోని పర్యావరణ పరిస్థితులకు అనుకూలమైన లక్షణాలు గల జీవులు బతుకుతాయనీ, ఆ లక్షణాలను తమ సంతతికి కూడా ఇస్తాయని తన ''ప్రకృతి వరణం'' అనే సిద్ధాంతంలో పేర్కొన్నారు. అనగా మనుగడ కోసం జరిగే పోరాటంలో ప్రకృతికి తట్టుకోగల జీవులు బతుకుతాయని మిగిలినవన్నీ నశిస్తాయనే సూత్రాన్ని ఆయన చెప్పాడు.
ఆనాటి మత గ్రంథాలు, సాంప్రదాయవాదులు చార్లెస్ డార్విన్ వాదనను ఎంతగా వ్యతిరేకించినా డార్విన్ ''పరిణామ వాదం'' జీవులను అవగాహన చేసుకోవడంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికింది. అనేక మంది యువకులు జీవ శాస్త్రం పట్ల ఆసక్తి పెంచుకొని ఆ దిశలో పరిశోధనలు ప్రారంభించడానికి డార్విన్ ''నేచురల్ సెలక్షన్'' గ్రంథం స్ఫూర్తినిచ్చింది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం జీవుల పుట్టుక, పరిణామంపై ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను విభేదించడంలో కీలక పాత్ర వహిస్తూ శాస్త్రీయ ఆలోచనలకు పునాది వేసింది. కానీ భారతదేశంలో కొంతకాలంగా భారతీయ మేధావి, పాలకవర్గం పలు వేదికల దగ్గర భారతదేశ శాస్త్ర విజ్ఞానంతో పాటు ప్రపంచ శాస్త్ర విజ్ఞానానికి వక్రభాష్యం పలుకుతున్నారు. దానికి ఉదాహరణ గత సంవత్సరం జలంధర్ సైన్స్ కాంగ్రెస్లో ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్... చార్లెస్ డార్విన్ సిద్ధాంతం మన పురాణాల్లోని దశావతారంలో ''మత్స్యావతారం''గా పేర్కొనడం, 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా వున్న సత్యపాల్ సింగ్ డార్విన్ సిద్ధాంతం తప్పని విద్యావ్యవస్థలో డార్విన్ సిద్ధాంతాన్ని సైన్స్ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించాలని పేర్కొనడం ప్రపంచ శాస్త్ర వారసత్వాన్ని అపహాస్యం చేయడమే అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రకృతికి, జీవులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రీయంగా సైద్ధాంతికంగా నిరూపించి మానవ సమాజానికి అనువర్తనం చేసిన గొప్ప శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సిద్ధాంతం నేటికీ ఆమోదయోగ్యం, ఆచరణీయమని సైన్సు నిరూపిస్తూనే ఉంది.
- సంపతి రమేష్ మహారాజ్
సెల్ : 9959556367