Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులతో నిరుద్యోగిత రేటు పెరిగిపోతుండటం, నిత్యావసరాల ధరలు చుక్కలనంటడంతోపాటు మెజారిటీ ప్రజల ఆదాయం రోజురోజుకూ తగ్గుతుంది. దీనికితోడు దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం కారణంగా భారత్ 'మిడిల్ ఇన్కమ్ ట్రాప్'లో పడే అవకాశం ఉన్నదనీ, దాని బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలు.. అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడానికి అవకాశం ఉండకపోవచ్చు అనే అంశానికి సంబంధించినది. అంటే ఈ ఉచ్చులో చిక్కుకుంటే ఎప్పటికీ దాని నుంచి బయటకు రాలేవనీ, అధిక ఆదాయ దేశంగా నిలవలేవని ఆర్థికవేత్తలు పలుమార్లు తెలిపారు. దీనికి ఉదాహరణగా.. వేగంగా అభివృద్ధిని సాధిస్తూ.. ఆర్థిక ప్రగతిని సాధించిన బ్రెజిల్, మెక్సికో, టర్కీ దేశాలు దీని బారిన పడిన దేశాలే. ఈ దేశాల్లో ఆశాజనక ఆర్థిక వృద్ధి కనిపించినప్పటికీ.. ఎంతో అభివృద్ధి సాధించిన పశ్చిమ యూరప్, జపాన్ వంటి అధిక సంపన్న దేశాలు సాధించిన ఆర్థిక వృద్ధి, శ్రేయస్సును పొందలేవు. ఎందుకంటే ఆ దేశాల మధ్య ఆదాయ ఉచ్చు బారిన పడ్డాయని నిపుణులు సూచిసున్నారు. బలమైన వృద్ధి అనంతరం ఇలాంటి పరిస్థతులు తలెత్తుతాయనీ, దానికి పరిష్కరించే చర్యలు తీసుకోకపోతే ఏ దేశమైనా ఆర్థికంగా కుదేలవడం ఖాయమంటూ మధ్య ఆదాయ ఉచ్చు అంశాన్ని ప్రపంచ బ్యాంకుకు చెందిన ఆర్థికవేత్తలు ఇందర్మిట్ గిల్, హౌమి ఖరాస్లు 2006లో దీనిపై విస్త్రృతంగా జరిపిన అధ్యయనంలో వెల్లడించారు.
90వ దశకంలో తీసుకొచ్చిన ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత భారత్ ఆధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు తీసింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మధ్య ఆదాయ ఉచ్చులో భారత్ పడనున్నదా? అంటే దీనికి సమాధానాలు చెప్పలేము. కానీ ఇటీవలే కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన అడ్వాన్స్ డేటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 5 శాతానికి పడిపోతుందని సూచిస్తుంది. ప్రస్తుత గణాంకాలతో పోల్చితే పేరుగుదల మాత్రం ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. 2008 తర్వాత ఆర్థిక సంక్షోభం దిశగా నెమ్మదిగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరించినట్టుగా భారత్ ఈ ఉచ్చులో పడే ప్రమాదం ఉందని తెలుస్తున్నది.
గతేడాది మేలో ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి అప్పటి సభ్యులు రతిన్ రాయ్.. తక్కువ మధ్య తరగతుల ఆదాయ స్థాయిల్లో తలసరి ఆదాయం దాదాపు రూ.70 వేల నుంచి రూ.2.5 లక్షల మధ్య తగ్గాయని తెలిపారు. దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే భారత్ మధ్య ఆదాయ ట్రాప్లో చిక్కుకునే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. అలాగే గతేడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు వరసగా మూడు నెలలు ఫ్యాక్టరీల ఉత్పత్తులు కుదించబడ్డాయి. అలాగే గ్రామీణుల వేతనాలు సైతం 3.8 శాతం తగ్గాయి. నిర్మాణ రంగమూ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. తాజాగా ప్రఖ్యాత డ్యూక్ వర్సిటీ పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. భారత్ 2030 నాటకి ఎగువ మధ్య ఆదాయ దేశంగా మారదన్నారు. దీనికి తలసరి ఆదాయంలో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోడమేనని వివరించారు. అలాగే ఆర్థిక వృద్ధి చర్యలు తీసుకోకపోతే భారత్ 7నుంచి 8శాతం ఆర్థిక వృద్ధి సాధించటం కలేనన్నారు. దీనిపై దృష్టి సారించకుండా మోడీ సర్కారు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వంటి చట్టాలతో రాజకీయ ఎజెండాను మరింతగా పెంచుకోవడంలో నిమగమైదని అన్నారు. అలాగే ఇతర కారణాలు గమనిస్తే ఉత్పాదక రంగాన్ని సృష్టించడంలో విఫలమయ్యాం. ఇప్పటికి ఇది ఆర్థిక ఉత్పత్తిలో 17 శాతం కన్నా తక్కువ వాటా కలిగివున్నది. పెట్టుబడులను పెట్టడానికి ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ వాతావరణం నెలకొల్పారు కానీ, ఉత్పాదక రంగానికి స్థిరత్వం చేకూర్చే విధంగా సంస్కరణలు తీసుకురాలేకపోయారనీ ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అలాగే ములధన వ్యయాలను తగ్గించడానికి భూ, కార్మిక సంస్కరణలు తీసుకురావాలని సూచిస్తున్నారు. అసమాన ఆదాయ పంపిణీని అడ్డుకునే విధంగా అడుగులు వేయాలని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ దేశాల్లో భారత్ మానవ మూలధన వృద్ధి చాలా తక్కువ స్థాయిలో ఉంది. ప్రపంచ బ్యాంక్ గతేడాది విడుదల చేసిన గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో 157 దేశాలలో భారత్ 115వ స్థానంలో ఉంది. అయితే మనవ మూలధన వృద్ధిపై చర్యలు తీసుకోకుండా ఏ దేశామూ అధిక ఆదాయ దేశంగా వృద్ధిని సాధించలేదని ఇది వరకే పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ఇప్పటికైనా వాస్తవ విషయాల ను గ్రహించి ముందు చూపుతో ముందుకు సాగుతాయని ఆశిద్దాం.
- ఆర్.మహేష్
సెల్ : 9502329152