Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెరిసేదంతా బంగారం కాదు అనేది ఒక సామెత. అట్లాగే ''మేడి పండు చూడ మేలమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు'' అని వేమన వివరించాడు. ఈ రెండింటిలోని విషయమేమిటంటే బయట పైకి కనపడేది వేరు. లోపల ఉన్నది వేరు అని అంటే కనిపిస్తున్న దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావద్దనీ లోపలి అంతస్సారాన్ని చూసి అంచనాకు రావాలని అర్థం. దీన్నే అంతస్సారం-దృగ్గోచరం (Essence- Appearance) అనే అభివర్గంలో చర్చిద్దాం. అంతస్సారం అంటే అసలు సారం, నిగ్గు, సత్తా, మౌలికమైన ప్రధానమైన సారాన్ని అంతస్సారం అంటాము. దృగ్గోచరం అంటే పైకి కనిపించేది. అంతస్సారాన్ని అల్లుకుని ఉండేది. బంగారంలానే కొన్ని లోహాలు మెరుస్తాయి. కానీ అవి బంగారమో కాదో తెలియాలంటే 'గీటు' గీసి, తూకం వేసి దాని బరువును బట్టి బంగారమని తేలుస్తారు. మెరుపు వల్లనే బంగారమో కాదో చెప్పేయగలిగితే చిక్కులే ఉండేవి కావు. అయితే కనిపించేది ఒకటై, లోపలి అంతస్సారం వేరేదిగా ఉంటుందా? కాదు గానీ, కనిపించేది దాని అంతస్సారాన్ని సంపూర్ణంగా తెలుపలేదు. ఇవి రెండూ గతితార్కిక సంబంధాన్ని కలిగి ఉంటాయి. వైరుధ్యం, ఏకత కలిగి ఉండటం వల్లనే వస్తువు సారం, దృగ్గోచరం ఏమిటో తెలుసుకోవాల్సి వస్తుంది. అంతస్సారం దృగ్గోచరాన్ని పూర్తిగా ఆవరించి ఉండదు. కానీ రూపం సారాన్ని పూర్తిగా ఆవరించి ఉంటుంది. దృగ్గోచరం అనేది అంతస్సారపు ఇంచుమించు వ్యక్తీకరణ మాత్రమే. దృగ్గోచరం ద్వారానే అంతస్సారాన్ని గుర్తించగలిగితే వివిధ విజ్ఞాన శాస్త్రాల అవసరమే ఉండేది కాదు.
సారం, అంతస్సారం ఒకటి కాదు. ఒక వస్తువులోని అత్యంత మౌలికమైన, నిలకడైన అంశాలూ, వస్తు స్వభావానికి ప్రాతిపదికగా ఉండే అంశాలు మాత్రమే అంతస్సారం. వస్తువు బాహ్య లక్షణాలనూ, ధర్మాలనూ, ఇతర వస్తువులతో ఉండే సంబంధాలను దృగ్గోచరం అంటారు. అంటే అంతస్సారం వ్యక్తమయ్యే రూపమే దృగ్గోచరం. అయితే వస్తువు అంతస్సారాన్ని ఏదో కొంత మేర పైకి, దృగ్గోచరంగా ఉండే అంశాలు వెల్లడి చేస్తాయి. అంతస్సారం దానికదిగా బయటికి కనిపించదు. దృగ్గోచరమయ్యేవి ఇంద్రియ స్పర్శజ్ఞానానికి తక్షణమే అందుతాయి. అంతస్సారం అలా తక్షణమే అందదు. కాబట్టి అంతస్సారాన్ని అధ్యయనం ద్వారానే తెలుసుకోగలుగుతాము. ''ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు. చూడ చూడ రుచుల జాడవేరు'' అంటే ఉప్పు, కర్పూరం రెండూ ఒకే విధమైన బాహ్య రూపాన్ని కలిగి ఉంటాయి. కానీ వాటి గుణాన్ని తెలుసుకుంటే, అనగా వాడిన తరువాతనే ఉప్పేదో, కర్పూరం ఏదో తెలిసివస్తుంది.
దృగ్గోచరం, అంతస్సారం రెండూ అభేద్యంగా కలిసే ఉంటాయి. గతితార్కిక ఐక్యతలో ఉంటాయి. మరి అంతస్సారాన్ని తెలియజేయని దృగ్గోచరం వల్ల లాభ మేమైనా ఉందా? అసలు దృగ్గోచరం ప్రత్యేకత ఏమిటి? అంటే దృగ్గోచరాన్ని బట్టే అంతస్సారం వైపు వెళ్లడానికి వీలు కలుగుతుంది. ఉదాహరణకు బంగారం రం గులో ఏదైనా వస్తువు మెరుస్తుందీ అంటే, అది బంగారమా కాదా! అనేది తెలు సుకోవడానికి పూనుకుంటాము. ఇంకో ఉదాహరణేమంటే డాక్టరు రోగి కండ్లను చూసి, నాడీ చూసి, జ్వరాన్ని కొలిచీ, నాలుకను పరిశీలించి అసలు రోగమేమై ఉంటుందో ఊహిస్తాడు. అందుకు కావలసిన పరీక్షలు చేసి రోగాన్ని నిర్ధారిస్తాడు. అంటే పైకి కనిపించే దృగ్గోచర అంశాలను బట్టి, దాని అసలు మూలమేమిటో తెలుసుకోగలుగుతాడు. అప్పుడే సరైన వైద్యం అందిస్తాడు. రోగమూ నయమవుతుంది. కాబట్టి దృగ్గోచరం అనేది అంతస్సారాన్ని తెలుసుకునేందుకు తోడ్పడుతుంది. దృగ్గోచరంగా వ్యక్తమయ్యే జ్వరాన్ని చూసి, అసలు రోగమేమిటో తెలుసుకోకుండా మందులిస్తే, జ్వరం మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది.
దృగ్గోచరం అయినదాన్ని చూసి దాని అంతస్సారాన్ని గ్రహించాలి. అంటే దాని మౌలిక నియమాలను పరిశీలించాలి. సమాజం ఉంది. లేదా అనేక విషయాలు ఉన్నాయి. గణిత సమస్యలూ ఉన్నాయి. వాటి అంతస్సారం ఏమిటో గ్రహించాలంటే దానికి సంబంధించిన గతి నియమాలు పరిశీలించి, అభివృద్ధిని పరిశీలించి చేసిన సిద్ధాంతాలుంటాయి. ఆ సిద్ధాంతాలేమిటో తెలుసుకోవాలి. ఇదివరకే అధ్యయనం చేసి సిద్ధాంతీకరించిన వాటిని, కొత్త వాటికి అన్వయించి నిర్ధారించుకోవాలి. పెట్టుబడిదారీ విధానంలో శ్రమశక్తి, పెట్టుబడుల మధ్య సంబంధం సమాన విలువల మారకం రూపంలో వ్యక్తమవుతుంది. దృగ్గోచరమవుతుంది. ఇది పెట్టుబడి-శ్రమశక్తి సంబంధపు అంతస్సారాన్ని వ్యక్తం చేసేదికాదు. సమాన విలువల మారకం రూపంలో అదనపు విలువ దోపిడీ జరగడమనేదే పెట్టుబడి, శ్రమశక్తి సంబంధపు అంతస్సారం. ఈ అంతస్సారాన్ని మార్క్స్ తన అదనపు విలువ సిద్ధాంతం ద్వారా వెల్లడించాడు.
ఇంకొక ఉదాహరణ ఏమంటే, బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అం తస్సారం బూర్జువా వర్గ నియంతృత్వమే. కానీ పైకి అది ప్రజలందరి ప్రజాస్వా మ్యంగా, వారి అభిష్టానికి అనుగుణంగా నడిచే వ్యవస్థగా కనపడుతుంది. ఇది దృగ్గోచరం. ఇక కార్మిక వర్గ నియంతృత్వం అనగానే అది ఒక నియంతృత్వమనే అనుకుంటారు. కానీ దాని అంతస్సారం నిజమైన శ్రామిక ప్రజల, మెజారిటీ ప్రజ ల పక్షాన పనిచేసే ప్రజాస్వామ్యం. కాబట్టి అంతస్సారంగా అది ఎవరి పక్షాన, ఎవరి మేలుకు ఉపయోగపడుతున్నది అనే దాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇదే అంతస్సారం. అంతస్సారం, దృగ్గోచరం ఒక వస్తువు యొక్క రెండు పార్వ్శాలు. అందువల్ల వాటిని ఆలోచనలో మాత్రమే విడదీయడం సాధ్యమవుతుంది. ఇవి కూడా పరస్పరం వాటి స్థానాలను మార్చుకుంటాయి. అంతస్సారమనేది వస్తువు లోపల ఉంటుందని చెప్పుకున్నాము. అది వస్తువుపైన వ్యక్తమయ్యేది కాదు. దృగ్గోచరం మాటున అది దాగి ఉంటుంది. పంచేంద్రియ జ్ఞానం ద్వారా అంతస్సారాన్ని గుర్తించలేము. నిర్థిష్ట ఆలోచన ద్వారా అంతస్సారాన్ని గుర్తించవలసి ఉంటుంది. మన జ్ఞాన సంపాదనా క్రమం అంతా దృగ్గోచరం నుండే ప్రారంభమై అంతస్సారాన్ని చేరుకునేదిగా ఉంటుంది. పంచేంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం అనుభూతి జ్ఞానం. ఈ అనుభూతి జ్ఞానం నుండి తర్కబద్ద జ్ఞానం. ఈ అనుభూతి జ్ఞానం నుండి తర్కబద్దజ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. వీటి ద్వారానే వస్తువు అంతస్సారాన్ని తెలుసుకోగలుగుతాము.
అంతస్సారాన్ని గ్రహించాము అని ఎలా చెబుతాము? మొదటగా ఆ వస్తువు కానీ, విషయం కానీ ఎలా పుట్టిందీ, దాని అభివృద్ధి నియమాలు ఏమిటి అనేవి గ్రహించడం మొదటి దశ. నిర్థిష్టంగా ఆ నియమాలను సూత్రీకరించడం రెండవ దశ. ఈ సూత్రీకరణలను బట్టి భవిష్యత్తును ఊహిస్తాం. ఆ ఊహ రుజువైతే శాస్త్రీయ పద్ధతిలో ఆ వస్తువు అంతస్సారం గ్రహించినట్టే. ప్రయోగాల ద్వారా సిద్ధాంతాన్ని పరీక్షించి, నిగ్గు తేల్చవచ్చు. గణిత, భౌతిక, రసాయనిక శాస్త్రాలకు సంబంధించి విజ్ఞానం మనం అలా పొందినదే.
అయితే సాంఘిక జీవితం, సామాజిక శాస్త్రాలు కూడా ఏయే నియమాల వల్ల అభివృద్ధి చెందుతున్నాయో పరిశీలించి అనేక సూత్రీకరణలు వచ్చాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగిన నేటి స్థితిలో చాలా వాస్తవికంగా సమాజం గురించి తెలుసుకునే వీలు కలిగింది. జీవితం గురించి, ప్రపంచం గురించి అనేక సిద్ధాం తాలు ఉన్నాయి. ఆయా దేశాల కాల, మాన పరిస్థితుల పరిశీలనలోంచి వచ్చినవే అవి. పరిశీలన, ప్రయోగం, ఆచరణ, సిద్ధాంతం అనే క్రమంలో వచ్చిన సూత్రీకరణలే అవి. అయితే ఏ సిద్ధాంతానికైనా జీవితమే ప్రమాణం, ఆచరణే ఆధారం. అంతస్సారాన్ని శాస్త్రీయంగా తెలుసుకోగలిగితే మనకు కలిగే ప్రయోజనమేమిటంటే, దృగ్గోచర విషయాలను సరిగా గ్రహించలేకపోవడం వలన అనేక వక్రీకరణలు, తప్పుడు సూత్రీకరణలు చేసి నష్టపోతాము. ఒక మనిషిని, కార్యకర్త ను, నాయకుణ్ణి గురించిన అవగాహన కలగాలంటే, కేవలం దృగ్గోచరమయ్యే వేష భాషలను చూస్తే సరిపోదు. అతని ప్రవర్తన, నిబద్ధత, నిమగత, కృషిని బట్టి అతని అంతస్సారం తెలుసుకోగలుగుతాము. అప్పుడు మాత్రమే సరిగా అంచనా వేయగలుగుతాము. అంతస్సారం తెలుసుకుని దాని ఆధారంగా విశ్లేషణని సైద్ధాంతికంగా చేసినట్టయితే అభివృద్ధిలో అడుగు ముందుకు పడుతుంది. శత్రువు అంతస్సారాన్ని తెలుసుకోగలిగితేనే శత్రువును ఓడించే ఎత్తుగడను వేయగలుగుతాము. అలాగే ప్రభుత్వం, పాలకవర్గం యొక్క అంతస్సారాన్ని సరిగా గుర్తించగలిగినప్పుడే, దానిపై ఏ విధమైన ప్రజా పోరాటాన్ని చేయాలో కమ్యూనిస్టు పార్టీలు కార్యక్రమాన్ని నిర్ధేషించుకోగలుగుతాయి.
- కె.ఆనందాచారి
సెల్ : 9948787660