Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమారు పదహారు సంవత్సరాల కిందటి మాట. కమ్యూనిస్టు పార్టీ డివిజన్ మహాసభ జరుగుతున్నది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి హాజరయ్యారు. మండలాల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు, కార్యకర్తలు తమ తమ కార్యకలాపాల రిపోర్టులు ఇచ్చారు. తాము నిర్వ హించిన వివిధ పోరాట కార్యక్రమాలను వివరించారు. చివరగా ఒక పెద్దాయన వేదికపైకి వచ్చి మాట్లాడారు (ఆయనిప్పుడు లేరు). ఆయనేమన్నారంటే ''ఒక రోజు ఉదయం నేను సైకిల్పై ఖమ్మం బయలుదేరా. సెంటర్కు వచ్చే సరికి ఒక భయంకర దృశ్యం కంటబడింది. స్త్రీలు, పిల్లలతో సహా పదకొండు మంది పిచ్చికుక్క కాట్లకు గురై, రక్తం కారుతున్న గాయాలతో లబోదిబోమంటున్నారు. నేను వెంటనే రెండు ఆటోలను మాట్లాడుకొని వాళ్లందరినీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్లా. ఆస్పత్రిలో ఇంజక్షన్లు లేవన్నారు. దగ్గరలోనే ఉన్న కలెక్టర్ కార్యాలయానికి వారిని తీసుకొని వెళ్లా. కలెక్టర్ ఇంకా క్యాంపు కార్యాలయం నుంచి రాలేదన్నారు. వెంటనే వాళ్లను కాస్త దూరంలో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లాం. కలెక్టర్ ఎవరితోనో మాట్లాడుతున్నారు. కొద్దిసేపు కూర్చోండని అక్కడి సిబ్బంది చెప్పారు. అర్ధగంట కూర్చున్నా లోపలి వాళ్లు బయటకు రాలేదు. వెంటనే నేను తలుపు తోసుకొని కలెక్టర్ చాంబర్లోకి వెళ్లా. పరిస్థితి తీవ్రతను వివరించా. కలెక్టర్ కూడా వెంటనే స్పందించా రు. బయటకు వచ్చి క్షతగాత్రులను చూశారు. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టరుకు ఫోన్ చేసి ఎక్కడినుంచైనా సరే ఇంజక్షన్లు తెప్పించి గాయపడ్డ వారందరికీ వైద్యం తక్షణం చేయ్యండని ఆదేశించారు. మళ్లీ వాళ్లందరినీ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి, ఇంజక్షన్లు చేయించి కట్లు కట్టించి ఇండ్లకు చేర్చా'' అని ముగించారు. మిగతా వాళ్లంతా పోరాట కార్యక్రమాలను గురించి చెబుతుంటే, ఈ ముసలాయనేంటి సోది చెప్పాడని కొంతమంది డెలిగేట్స్ పక్క వారితో గుసగులాడారు. చివరిలో రాష్ట్ర కార్యదర్శి చేసిన సమీక్షలో ఆ పెద్దాయనను అభినందించారు. చుట్టుపక్కల వారి కష్టాలకు స్పందించి సహాయపడటంలో ఒక ఆత్మీయ స్పర్శ ఉందన్నారు. ఆయన చేసిన పనిలో ఇమిడి ఉన్న మానవీయకోణం, పట్టుదల, తెగువ ఇవన్నీ కమ్యూనిస్టు లక్షణాలన్నారు.
కమ్యూనిస్టు అనగానే సహజంగానే ధర్నాలు, పికెటింగులు, ప్రదర్శనలు, సమ్మెలు మొదలైన పోరాట కార్యక్రమాలు గుర్తొస్తయ్. అవును ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలపై కమ్యూనిస్టు నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటారు. ఆర్థిక సమస్యలపైనే కాక కుల, మత దురంహకారాలపై జరిగే సామాజిక పోరాటాలు, సాంస్కృతిక పోరాటాలు కూడా ఉంటాయి. ఈ పోరాటాలకు తమను తాము సమాయత్తం చేసుకోవడానికి, ఇతరులను చైతన్య పరచడానికి సైద్ధాంతిక అధ్యయనం, రాజకీయ తరగతులు, చర్చలు లాంటి మేధో సంబంధ కార్యక్రమాలు కూడా కమ్యూనిస్టు పార్టీలో ఉంటాయి. అయితే మౌలికంగా మార్క్సిజాన్ని నమ్మిన వారంతా మార్క్సిస్టులే. అందరూ సిద్ధాంతవేత్తలు కానక్కరలేదు. అయితే కమ్యూనిస్టు పార్టీ అంటే అధ్యయనం, పోరాటాలు, ఎన్నికలు, ఎత్తుగడలు, ఓట్లు, సీట్లు, సమీక్షలు మాత్రమే కాదు. సేవా తత్పరత కూడా. మానవీయత, ఆత్మీయత, అప్యాయత, నిరాడంభరత, త్యాగశీలత, నిరహంకారం, పేదలు, దళితుల పట్ల ప్రేమ, మూఢ నమ్మకాల పట్ల వ్యతిరేకత. ఇవేవీ లేకుండా నేను మార్క్సిస్టునంటే కుదరదు. ఈ మధ్య ఈ అంశానికి పార్టీలో ప్రాధాన్యత కొంత పెరిగినా, ఇంకా పెరగాలి. నాయకులు, కార్యకర్తలు ప్రతి రోజు పెట్టే ఉరుకులు, పరుగులలో సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్న వాటా ఎంత? ప్రత్యేకంగా వాటా ఏమిటి? ఈ ఉరుకులు, పరుగులు, మీటింగులు, పోరాటాలు అన్నీ పేదల బాధితుల కష్టాలను పారదోలటానికే కదా! అసలు పార్టీ ఉన్నదే అందుకు కదా! అనవచ్చు. అవన్నీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక సామూహిక సమస్యలకు సంబంధించినవి. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి వారంతట వారే పరిష్కరించుకోలేని సమస్యలనేకం వస్తుంటాయి. వాటిని కూడా నాయకులు, కార్యకర్తలు పట్టించుకొని బాధితులకు అండగా నిలవాల్సి ఉంది. ఇవన్నీ చేస్తూ ఉంటే విప్లవం మాటేమిటనొచ్చు. దశాబ్దాలుగా సాగుతున్న సాప్రదాయక కార్యాచరణతో సేవా దృక్పథాన్ని మిళితం చేయనందువల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించడం లాంఛనప్రాయం కాకుండా ఆచరణ ప్రాధాన్యంగా ఉండాలి. సేవా దృక్పథాన్ని అలవర్చుకోవడం మామూలు విషయమేం కాదు. అధ్యయనం మన ఆచరణకు కచ్చితంగా పదును పెట్టాలి. మానవీయ పరిమళాలను మరింత గుబాళింపజేయాలి. అట్లా చేస్తుండకపోతున్నట్లయితే ఎక్కడ లింకు దెబ్బతిన్నదో చెక్ చేసుకోవాలి. సరి చేసుకోవాలి. కమ్యూనిస్టులు తమ ప్రాభవాన్ని కోల్పోతుండటాన్ని వారి ఓట్లు సీట్లు గల్లంతు కావడాన్ని మనం చూస్తున్నాం. ఈ పరిణామాలను చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. కసి పెంచుకొని, కృషి పెంచుకొని మరింత పట్టుదలతో ప్రజలకు మరింత దగ్గరయ్యే మార్గం చూసుకోకుండా నిర్వికార నిశ్చలత్వంలోకి జారుకునేవాళ్లు కొందరైతే పైపై మెరుగులకు భ్రమపడి, తక్షణ లాభాలకు ఆశపడి పక్క చూపులు చూసి, పక్కదారులు పట్టి బొక్కబోర్లా పడ్డవాళ్లు మరి కొందరు. విచిత్రమేమంటే ఇట్లాంటివాళ్లలో కాస్తో కూస్తో సిద్ధాంత గ్రంథాలు చదివిన వాళ్లున్నారు. రాజకీయ తరగతులకు హాజరైన వారున్నారు. రాజకీయ పాఠాలు చెప్పిన వాళ్లూ ఉన్నారు. చదివిందాంటన్లో ఎంత శాతం ఒంటబడుతుందో చెప్పలేం. ఒంట బట్టినదాంట్లో ఎంత శాతం ఆచరణలోకి వస్తుందో చెప్పలేం. ఇదొక తపస్సు. ఆచరణ శాతం పెరిగే దాకా, వయసుతో నిమిత్తం లేకుండా ఈ తపస్సును కొనసాగించాల్సిందే. అడవుల్లోకి పోయి చేసేదికాదిది. ప్రజల మధ్యన, ప్రలోభాల మధ్యన ఉండి చేసే అశిధారావ్రతం. మనం చేసే ఈ వ్రతాన్ని మనకు తెలియకుండానే, జనం నిరంతరం మూల్యాంకనం చేస్తారు. ఆ మూల్యాంకనలో మనకెన్ని మార్కులొస్తున్నాయో గ్రమించగలగాలి. గ్రహించడంతోటే సరిపోదు. తదనుగుణంగా మన పని విధానాన్ని మెరుగుపరచుకోవాలనే చిత్తశుద్ధి ఉండాలి.
కొందరు స్థితప్రజ్ఞులున్నారు. గెలుపోటములకు వారు పొంగరు. కుంగరు. వారి పని వారు చేసుకుంటూ పోతుంటారు. వారికి పెద్దగా చదువూ ఉండదు. వారిని నివాస ప్రాంతంలో పార్టీ అత్యంత బలహీనంగా కూడ ఉండవచ్చు. ఆ మాటకొస్తే అక్కడ వారొక్కరిదే పార్టీ కుటుంబం కావచ్చు. అయినా, వారింటి మీద ఎర్రజెండా సగర్వంగా, సమున్నతంగా ఎగురుతుంటుంది. ఎందుకని? ఆ తెగింపు, ఆ ఆత్మ విశ్వాసం, ఆ నిబద్ధత ఏ గ్రంథ పఠనం ద్వారా వచ్చింది? పార్టీతో పాటు వారికి మానవత్వం మీద అచంచల విశ్వాసముంటుంది. తాము నమ్మిన సిద్ధాంతానికి, ఆచరణకు సామీప్యత ఉండాలనే అవగాహన ఉంటుంది. వారిలో స్వార్థముండదు. పార్టీని అడ్డం పెట్టుకొని లబ్ది పొందాలనే ఆశ ఉండదు. అది వారి సహజ ధర్మంగా భావించి పార్టీలో పని చేస్తారు. ఇతర పార్టీలతో పోల్చుకొని తమ పార్టీ ప్రత్యేకతను గుర్తెరిగి ''అవును నేను కమ్యూనిస్టును'' అని పది మందిలో సగర్వంగా చెప్పుకుంటారు. అంతకంటే విశ్వసనీయత ఏముంటుంది చెప్పండి. ఎర్రజెండా గొప్పతనాన్ని వారు తమ ప్రవర్తన ద్వారా తెలియజేస్తారు. ఎవరికే ఇబ్బంది వచ్చినా, వారక్కడ ప్రత్యక్షమవుతారు. అండగా ఉంటారు. కలివిడితనాన్ని, ఆప్యాయతను ప్రదర్శిస్తూ, కమ్యూనిస్టు అంటే ఎలా ఉండాలో సహజ ధోరనిలో నిరూపిస్తారు. మాట తీరు, శరీర భాష (బాడీ లాంగ్వేజ్) ద్వారా ఆ సామాన్యులు కొన్ని సంద ర్భాలలో నాయకులకే స్ఫూర్తినిస్తారనటంలో అతిశయోక్తి లేదు. అట్లాంటి వారే కమ్యూనిస్టు పార్టీకి మూలధనం. నిక్షిప్త శక్తి.
- కందడై శ్రీనివాసులు
సెల్ : 9246901149