Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోసంగి కులం వారు ఎన్నో సంవత్సరాల నుండి తనకున్న జానపద కళల ద్వారా బిక్షాటన చేసుకొని పొట్ట పోసుకుంటూ అంటరాని వారుగా గ్రామాల్లో బానిసలుగా జీవిస్తున్నారు. గోసంగిలు బిక్షాటన చేస్తూ తనకున్న కళల ద్వారా ఆడుతూ పాడుతూ జీవనం సాగిస్తున్నారు. తంబురాతో రామాయణం, మహాభారతం, బొబ్బిలి యుద్ధం, జగదేకవీరుని కథ, కాంభోజ రాజు కథ, బాలనాగమ్మ మొదలగు వాటిపై కొందరు బుర్ర కధలు చెబుతారు. మరికొందరేమో గొల్లవారిని అడుక్కొనేందుకు మల్లయ్య, మందగొల్ల కథలను చెప్పుకుంటూ తమ జీవితాన్ని గడుపుతారు. ఇంకొందరు కాటికాపర్లు, పగటి వేషాలు వేసుకుని శవాల దగ్గర అడుక్కుంటూ చిందులు వేస్తూ పబ్బం గడుపుకుంటారు. భౌరూపుల వేషం (ప్యాంటు, షర్టు, బూట్లు, హాట్ కర్ర తుపాకీ చేతపట్టుకుని పోలీసు వేషంలో) వేసి నవ్వు పుట్టించే డంబాచారంతో యాచన సాగిస్తారు. బాలసంతుల వేషం ఇలా రకరకాల వేషాలు వేసి అడుక్కుని జీవితం గడుపుతారు. తెల్లవారుజామున గ్రామాలలోని ఇంటింటికి వెళ్లి పాటలు పాడుతూ భిక్షాటన చేస్తూ పాత బట్టలు, అన్నం, ధాన్యాలు ఇలా అడుక్కుని జీవనం సాగిస్తారు.
గోసంగిలు అంటే జానపద కళాకారులలో అరుదైనవారు. వీళ్లు తెలంగాణలోనే ఎక్కువమంది నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. మరి కొంతమంది అక్కడక్కడ కనిపిస్తుంటారు. వీళ్లు ఆశ్రిత, గాయకుల, స్వచ్ఛంద గానాలు, ఒక కులం ఒక కళారూపంలో కథ నడిపిస్తారు. పుట్టే పిల్లవాడి దగ్గరనుంచి చనిపోయే ముసలివారి వరకు ఏ వ్యక్తి గురించి అయినా సరే బుర్రకథలో రూపంలోనూ వివిధ గానాలతో పాడుతూ చిందులు వేస్తూ వాళ్లను తృప్తి పరుస్తూ భిక్షాటన చేసి కడుపు నింపుకుంటారు. ఒకవేళ బిక్షాటనలో అనుకున్నంత ఆహారం రాకపోతే పొలాల్లో లేదా కొండ చరియల్లో ఎలుకలు, ముంగిసలు, తాబేళ్లు పక్షులు వివిధ రకాల జంతువులను చంపి తింటారు. భిక్షాటన చేసిన సొమ్ము ఉంచుకోరు. గ్రామాలలో ఏవైనా శుభకార్యాలకు, పండుగలకు ఆధిపత్య కులాల వారి వాకిళ్లలో వివిధ వాయిద్యాలు తీసుకుని తమదైన శైలిలో, బాణీలో పాటలు పాడుతూ చిందులు వేస్తూ ఆ గ్రామ ప్రజలను ఆనందింపజేసి పండుగకన్నా శవాల దగ్గర పాటల రక్తిని రంజింపజేస్తారు.
గోసంగిలు, గోస, గోసమో, గోగి, గోసి మొదలగు పేర్లతో వీరిని పిలుస్తుంటారు. వీరు జాంబవంతుడి వారసులుగా పిలుస్తారు. ఆ భ్రమలోనే జీవనం గడుపుతూ వంశ వారసునిగా వాళ్ల చరిత్రను తమ పిల్లలకు చెబుతూ ఉంటారు. ప్రస్తుత కాలానికి మాదిగ కులంలో ఇది ఒక ఉపకులం. ఈ గోసంగులు మాదిగలను చూసి భయపడేవారు. ఎందుకంటే భిక్షాటన చేసే పర్యటనలో ఈ గోసంగిలను ఎక్కువగా హేళనచేస్తూ ఇబ్బంది పెట్టేవాళ్లు మాదిగలు. మాదిగలు వృత్తి పరంగా చచ్చిన జంతువులను కోసి వాటితోలు, ఎముకలు ఇంట్లో దాచుకునే వాళ్లు. గోసంగిలకు కూడా మొదటి నుంచి ఆ ఆచారమే ఉంది. అయితే వీళ్లు వారసత్వ జానపద కళాకారులుగా ఆయా గ్రామాల ప్రజలలో కళాకారులుగానే మిగిలిపోయారు. ఆ గ్రామంలో ఏమైనా జంతువులు చనిపోతే ఆ జంతువులను ఊరి చివర అంటే ఈ గోసంగి ఇండ్ల పక్కనే కళేబరాలను తీసుకెళ్లాలని ఆ ఊరి కరణం, మున్సబులు లేదా అధికారులు వీళ్లని అజ్ఞాపించేవారు. గోసంగిల పెండ్లిలలో ఒకటి, రెండు రోజులు కాదు ఏకంగా 25రోజులపాటు పెండ్లి సందడిలో ఉండిపోతారు. చచ్చిన జంతువులను తింటూ కల్లు తాగుతూ ఆనందంగా పెండ్లి తంతు పూర్తి చేసుకుంటారు.
గోసంగిలకు తల్లిపాలు దూరం చేసినట్టు వారి హక్కులను కాలరాసింది బ్రాహ్మణ వ్యవస్థ. ఊరికి దూరంగా నిలబెట్టి వీరిని అజ్ఞానంలో ఉంచి వీరి ప్రతిభను గుర్తించకుండా చేశారు. వీరికి కళలపై ఎలా ఆసక్తి కలిగిందంటే మాలల్లో ఉప కులమైన మాల జంగం వాళ్లు నిజమైన కళాకారులుగా గోసంగులు గుర్తించి వారిని అనుసరించే వాళ్లు. ఈ కులం వారికీ అంటరాన్నితనం ఉంది. మాల జంగం వాళ్లు పెండ్లీలు చేయడం, సత్యనారాయణ వ్రతాలకు కథలు చెప్పడం, ఇంకా బుర్రకథలు, హరికథలు చెప్పడంలో మంచి నైపుణ్యం కలవారు. అందుకేనేమో గోసంగులు మాల జంగం వాళ్లను అనుసరిస్తూ, అనుకరిస్తూ జానపద కళా రక్షకులుగా ఉండిపోయారు. మాల జంగం వాళ్లు ఏ రోజు కూడా భిక్షాటన ఊరికే చేసేవాళ్లు కాదు. ఏదో ఒక కళను ప్రదర్శించి 'తమ వంతు సహాయం' అని అడిగి అక్కడ గ్రామ ప్రజలను సంతోషపెట్టే వాళ్లు. రాను రాను గోసంగిలకు మాత్రం ఇది భిక్షాటనగా అలవాటైపో యింది. ప్రస్తుతం వీళ్లకు ఎలాంటి పనులు లేకపోవడం వల్ల ఈ వృత్తినే కొనసాగిస్తూ ఉండిపోయారు.
పగటి వేషాలు వేసే వారిని కళాకారులే రక్తి కట్టిస్తారు. కానీ ఇక్కడ గోసంగిలే పగటివేషగాళ్లుగా ఉండేవాళ్లు. గోసంగిల ఇండ్లు చిన్న చిన్న డేరాలుగా ఏర్పర్చుకునేవాళ్లు లేదా ఒక చెట్టు కింద సంసార జీవితం కొనసాగించేవారు. ఇప్పటికీ సొంత ఇండ్లు లేవంటే ఆశ్చర్యపోనక్కరలేదు. గోసంగిలకు తమ పిల్లలను చదివించడానికి ఆర్థిక స్తోమత ఉండేది కాదు. వీళ్లు తమ వారసత్వ కళాకారునిగా తయారు చేసే వాళ్లు. రానురాను ఆ కళ మరుగున పడిపోతోంది.
గోసంగి కళాకారులు జీవన వృత్తులను కొన్నింటిని కొనసాగిస్తూ వచ్చారు. వాళ్ల జీవితాలు మారిన వారసత్వ సంపద ఏమైనా ఉన్నాయంటే తంబుర ఒక్కటే. హరికథలకు, బుర్రకథలకు ఉపయోగించే పనిముట్లను చాలా భద్రంగా దాచుకునేవాళ్లు. ఎండిన గుమ్మడికాయ, బొంగుకర్ర, రాగితీగలు మొదలగు వాటితో ఈ తంబురా ఇతర పనిముట్లను తయారు చేసేవాళ్లు. ఎండిన తూటికూర పుల్లలతో సన్నాయి ఊదుకునే వాళ్లు. చచ్చిన గొడ్ల నుండి తీసిన చర్మాన్ని డోలుకు ఉపయోగించేవారు. వీటన్నిటితోపాటు మంచి కంఠస్వరంతో పాడి, పదునైన మాటల తూటల్లా పేలే పాటలతో ఆనందింపచేసేవాళ్లు. ముఖ్యంగా పండుగ సమయాల్లో జనమంతా ఒకచోట చేరి ఆసక్తిగా వీళ్ల కథలు వినేవాళ్లు. అలాంటి నైపుణ్యం కలిగిన గోసంగిలు ఈనాడు కళారూపాలకు దూరమవుతున్నారంటే నేటి సామాజిక మార్పులతోపాటు ప్రభుత్వాలు వీరికి చేయూతనివ్వకపోవడమూ కారణమే. వీళ్లు జానపద కళల నైపుణ్యంలో భాగంగా ఈత చెట్టు ఆకులు, కొబ్బరి చెట్టు ఆకులు, తాడి చెట్టు ఆకులతో రకరకాల ఆడుకునే వస్తువులు, చాపలు, తట్టలు, బుట్టలు తయారు చేస్తారు.
ఈ గోసంగిల మీద పరిశోధన చేసిన వాళ్లలో గనిశెట్టి రాములు ఒకరు. ఈయన ''చీకటి బతుకుల్లో గోసంగిలు'', ''గోసంగిలు ఎవరు?'' అనే పుస్తకాలను ప్రచురించారు. ఈయన పరిశోధన చేసింది పీహెచ్డీ డిగ్రీ కోసమో, మరొక అర్హత కోసమో కాదు. వాళ్ల జీవన పరిస్థితుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెెళ్లాలనే తపనతో పరిశోధన చేశారు. గోసంగి సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంది. ఆ సమాజం నుండి వచ్చిన విద్యావంతులైన మేధావులు, ఉద్యోగస్తులు నాయకులపైనే ఉంది. సాంఘిక రాజకీయ రంగాలలో వేడి నెత్తురు పొంగులెత్తు నిజాయితీ గల యువకులు పూనుకుంటే తప్ప ఈ గోసంగి సమాజం మారదు. బలం కలవడు పులి. తెలివికలవాడు నక్క. ఇరువర్గాలకు ఆహారంగా బతుకుతున్న మూర్ఖులు గొర్రెలు. అందుకే గోసంగిలు పరిస్థితులను అర్థం చేసుకోవాలి.
ఇది అస్పృశ్య కులాల కళల గురించి వివరించి చెప్పడానికి చేసే ప్రయత్నం మాత్రమే. ఇది శిథిలమైన శిలా కళల నుంచి బతుకుపోరు నిర్మించే శాస్త్రజ్ఞుని పని వంటిది. చెల్లాచెదురుగా పడ్డ ఎముకల్ని, దంతాలను బట్టి ఊరు పేరు లేకుండా కాలగర్భంలో కలిసిపోతున్నా దళిత కళల గురించి చెప్పటం లాంటిది. ఊరి చవాళ్లలో కథలు జనసామాన్యపు జీవన పర్యావరణంలోకి గ్రామాలలో జనం తందాన కథలై నడిచారు. చిందు, డక్కలి, బైండ్ల, గోసంగి, బుడిగె జంగం తదితర కులాల కథలు చరిత్రలో లిఖించబడలేదు. వీళ్లపట్ల చరిత్ర అంటరానిదై వీరి కథల కళలకు అంటరానివయ్యాయి. వీళ్లు తిరిగిన కథ వృత్తం ఏ గురజాడకు అంతుచిక్కని విషయం, తందాన శైలి ముందర వందల గురజాడలు కూడా వీళ్లే ముందర నిలబడలేరు. ఉన్నత కులాలనబడే వారిని మాత్రమే గుర్తించి మిగతా ప్రజాబాహుళ్య సంస్కృతిని విస్మరించడం, మొదటి శూద్ర కులాలను కొన్నింటిని గుర్తించి, ఆ తర్వాత ఉపకులాలో కొన్నింటిని గుర్తించి మిగతా ఉపకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నేటికీ గుర్తించకపోవడం అన్యాయంలో ఒక భాగమేనని గనిశెట్టి రాములు ప్రస్తావించారు.
గోసంగి కులం జానపద కళల ప్రదర్శనలో తంబూర వాడుతారు. హార్మోనియం, తాళాలు, మద్దెల, డమికి, సితార ఇంకా పౌరాణిక నాటకాలకు కావలసిన సామగ్రిని తయారు చేసుకుని వాడతారు. వీరు రామాయణం, మహాభారతం, బొబ్బిలి యుద్ధం, జగదేకవీరునికథ, కాంభోజరాజు కథ, బాలనాగమ్మ, కాటమరాజుకథ ఆధునికంలో అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్, గాంధీ చరిత్రలను బుర్ర కథలుగా చెప్పుకుంటూ జీవనం సాగిస్తారు. ఉత్పత్తి కులాలను సంతోషపెట్టే కళల్లో జానపద కళలు ప్రధానమైనవి. దళిత కులాలను ఆశ్రయించి అనేక ఆశ్రిత కులాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఈ సాంస్కృతిక పరమైన వ్యవస్థ కొనసాగుతుంది. ఇలాంటి ఆశ్రిత కులాలు మరుగునపడినా మానవ విలువలు కలిగిన గొప్ప సంస్కృతిని కాపాడుతున్నాయనడంలో సందేహం లేదు. వీరు వివిధ రకాల జానపద కళలను ఆశ్రయించి బతికే కులం కానీ కులం. గోసంగిలు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో తక్కువగానూ ఉన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వీరున్నారు. గోసంగి కులం పేరుతో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇంచుమించు లక్ష జనాభా ఉంది. వీళ్లల్లో ఇంకా సామాజిక మార్పుతో అభివృద్ధిలోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534