Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ బహదూర్ గౌర్ ఒక విప్లవకారుడు..
స్వాతంత్య్ర సమరయోధుడు,..
సాహిత్య ప్రేమికుడు..
కార్మిక నాయకుడు..
కమ్యూనిస్టు నేత..
హైదరాబాద్ పాతబస్తీ లోని గౌలిపురాలో పుట్టి పెరిగి, ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి పట్టా అందుకున్న తొలి తరం వైద్యుల్లో ఒకడు.. ఆయన విశ్వవిద్యాలయంలో వైద్య విద్యే కాదు, సమాజం నుండి కమ్యూనిజాన్నీ నేర్చుకున్నాడు. అందుకే రోగులకు చికిత్స చేయడం మాత్రమే కాకుండా సమాజానికీ చికిత్స చేయాల్సిన అవసరాన్ని గుర్తించాడు. ఉద్యమ కార్యాచరణలోకి దూకాడు. ప్రజల డాక్టర్గానే కాదు, ప్రజా నాయకుడిగా చరిత్రకెక్కాడు.
ప్రజాస్వామిక హక్కులు అంటే తెలియని రోజులవి. ప్రజలు దొరలు, దేశముఖ్ల వెట్టిచాకిరిలో నలిగిపోతున్నారు. కార్మిక హక్కులు అంటే తెలియని కాలమది. కష్టజీవులు కంపెనీ యజమాన్యాల చేతిలో మగ్గిపోతున్నారు. అటువంటి తరుణంలో కార్మికులను, ప్రజలను సంఘటితపరిచి అణిచివేత వ్యతిరేక దినం పేరిట నిజాం పాలనకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె చేయించిన యోధుడు కామ్రేడ్ రాజ్బహదూర్ గౌర్. దశాబ్దాల కాలం నగరంలో బలీయంగా ఎదిగిన ట్రేడ్ యూనియన్కు ప్రాణదాత రాజ్బహదూర్ గౌర్. ఉన్నతమైన జీవితానికి నైతిక కట్టుబాట్లు అవసరమని భావించిన నీతి వర్తనుడు,. పదవులకు అతీతంగా అర్థశతాబ్దంపైగా ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఆదర్శనేత. అసమానతలతో ఉన్న సమాజానికి చికిత్స కోసం జీవితాన్నే అర్పించిన వైద్యుడు..
హైదరాబాద్ పాతనగరంలోని గౌలిపురాలో 1918 జులై 21న ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన కుటుంబంలో జన్మించాడాయన. 1939లో నాగ్పూర్లో జరిగిన ఏఐఎస్ఎఫ్ మహాసభలకు మఖ్దూంతో కలిసి హాజరయ్యాడు. అప్పుడే కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొందిన గౌర్ 1941లో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1943లో వైద్య విద్యను పూర్తి చేసిన తరువాత పూర్తిగా రాజకీయ కార్యకలాపాల్లోకి వచ్చిన గౌర్ నిజాం రైల్వే కార్మికుల ట్రేడ్ యూనియన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. 1945లో ఔరంగాబాద్లో ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దానికి 1946లో రాజ్ బహదూర్ గౌర్ కార్యదర్శిగా వ్యవహరించాడు. 1946 అక్టోబర్ 16న ప్రజలను, కార్మికులను సంఘటితం చేసి అణిచివేత వ్యతిరేక దినం సందర్భంగా సార్వత్రిక సమ్మెకు నాయకత్వం వహించాడు. దీంతో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. 1946 నవంబర్ 15న కమ్యూనిస్టు పార్టీని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 'విశ్వసనీయ కుటుంబం నుంచి వచ్చిన విద్రోహి' అంటూ గౌర్పై నిజాం సర్కార్ కుట్రకేసు మోపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బయట ముఖ్యమైన పనులెన్నో ఉంటే ... తాను లోపల ఉండటమేంటి? ఇది గౌర్ను కలిచివేసిన ప్రశ్న. వెంటనే ఎలా తప్పించుకోవాలో ప్యూహ రచన చేశాడు. ములాఖత్కు వచ్చిన కామ్రేడ్స్ ద్వారా పార్టీ నాయకత్వానికి సమాచారం అందిచాడు. వారు వెంటనే రంగంలోకి దిగారు. తనకూ, సహచరుడు జవాద్ రజ్వీకి తరచూ జ్వరం వస్తోందని జైలర్కు చెప్పాడు. పరీక్షించిన డాక్టర్ ఇరువురి ఆరోగ్యంలో లోపం కన్పించలేదన్నాడు... అయినా, డెంటిస్ట్కు చూపించమని సలహా ఇచ్చాడు ఆ డాక్టర్. ఇది చాలు జైలు నుండి తప్పించుకోవడానికి అనుకున్నాడు గౌర్. అది ఏడో నిజాం పేరుతో ఏర్పడిన ఉస్మానియా ఆస్పత్రి. డెంటల్ విభాగం అధిపతి డా.మోరిస్ ఎక్విప్మెంట్ను జైలుకు తరలించడం వీలు కాదు, రోగులను ఆస్పత్రికి తీసుకురమ్మన్నాడు. 1947 మే 7న ఉస్మానియా వెనుక గేట్ నుంచి ఎస్కార్ట్ పోలీసులు 'పేషెంట్స్'ను దవాఖానాలోకి తీసుకొచ్చారు. అదే రోజు జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్లో పర్యటిస్తున్నాడు. దానితో ఎక్కువ మంది పోలీసులు అక్కడ సెక్యూరిటీలో ఉన్నారు. పథకం ప్రకారం చాలా మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అప్పటికే డెంటిస్ట్ దగ్గర క్యూ కట్టారు. డాక్టర్ దగ్గరకు పోలీసులు వెళ్లకూడదని అభ్యంతరాలు పెట్టారు. లోపలకు వెళ్లిన రాజ్ ద్వయం డాక్టర్ పరంజపే సహకారంతో క్లినిక్ వెనుక గేటు నుంచి తప్పించుకొని బేగంబజార్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ స్టార్ట్ చేసి ఉన్న కారులో ఆసిఫ్ నగర్కు, అక్కడ కారు వదిలేసి మరో కారులో అజ్ఞాత వాసానికీ వెళ్లిపోయారు! నాలుగేండ్ల తర్వాత 1951 ఏప్రిల్ 24న రాచకొండ అడవుల్లో ఒక చెరువులో నీరు తాగుతుండగా అరెస్టయిన రాజ్ బహదూర్ 13 నెలలు జైలులో గడిపాడు. చిత్రహింసలను పంటి బిగువున భరించిన రాజ్ బహదూర్.. తన మూల గదిలో సహచర ఖైదీలతో సాహితీ చర్చలు జరిపేవాడు. ఆ గది పేరు 'షాస్ కార్నర్'.
భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ఉన్న కమ్యూనిస్టులకు ఆయుధాల అవసరం ఏర్పడింది. 1947 సెప్టెంబర్లో కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలు పట్టాలని నిర్ణయించింది. బొంబాయిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన రాజ్ బహదూర్ గౌర్ హైదరాబాద్ రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరించి నాయకత్వాన్ని ఒప్పించి ఆయుధాలకు అమోదం పొందగలిగాడు. 1948 సెప్టెంబర్లో జరిగిన పోలీసు చర్యతో పరిస్థితులు మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ చేతుల్లోనే ఉన్న కారణంగా ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వాళ్లు భావించారు. అనేక నిర్బంధాలను ప్రయోగించారు. సైనిక అధికారులు 1948 నవంబర్ - డిసెంబర్ నాటికి కమ్యూనిస్టు పార్టీ నేతలను కార్యకర్తలను వేటాడటం, చిత్రహింసలకు గురిచేయటం, కాల్చి చంపడం ప్రారంభించారు. అటువంటి కీలక సమయంలో సాయుధ పోరాటంలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కానీ జైలు నుండి మరోసారి తప్పించుకున్న రాజ్బహదూర్ గౌర్ 1949 ఏప్రిల్లో అజ్ఞాతంలోనే ఉంటూ హైదరాబాద్ సిటీ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. పోరాట దళంలో చేరడానికి ఆయన ఆ బాధ్యతలను మఖ్దూంకు అప్పగించి రాచకొండ గుట్టలకు వెళ్లిపోయాడు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడే పార్టీ మహిళా విభాగంలో పని చేస్తున్న బ్రిజ్రాణీని వివాహం చేసుకున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడుండాలి? ఒక సమస్య దారి చూపింది! చిక్కడపల్లి నాలా దగ్గర ఒక మురికివాడ. అక్కడి పేదవారి నివాసాలను ఖాళీ చేయిస్తున్న అధికారులను బ్రిజ్రాణి అడ్డుకుంది. ప్రజలను సంఘటిత పరిచి అధికారులను ప్రతిఘటించింది. ప్రభుత్వంతో పోరాడి ఆ స్థలాలను ప్రజలకు సాధించి పెట్టింది. ఆమెను తమతోనే కలసి ఉండాల్సిందిగా మురికివాడ ప్రజలు కోరారు. అలా ఆ మురికివాడలోని ఓ పూరి గుడిసే వారికి నివాస స్థలమైంది.. రాజు-రాణి ఓ ఇంటివారయ్యారు. తరువాత రష్యాలో వైద్యం చదివిన వీరి కుమార్తె తమారా 1982లో అదే స్థలంలో చిన్న పక్కా ఇల్లు నిర్మించింది. రాజ్ ఆ ఇంటికి 'చమేలీ కా మండ్వా' (మల్లెపూల పందిరి) అని పేరు పెట్టుకున్నాడు. తన ప్రాణస్నేహితుడు మగ్దూం మొహియుద్దీన్ కవిత పేరది!
ఉద్యమాల దారుల్లో చెరసాలలు, అజ్ఞాతాలే జీవితంగా సాగిన రాజ్బహదూర్ని 'హైదరాబాద్ సంస్థానం' భారత్లో విలీనమైన తర్వాత కూడా బంధించి జైలులోనే ఉంచారు. సాయుధ పోరాటాన్ని ఉపసంహరణ తరువాత 1952 ఎన్నికల్లో పాల్గొనాలన్న పార్టీ నిర్ణయం మేరకు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావించినప్పటికీ ఓటరు లిస్టులో పేరు లేకపోవడంతో పోటీ చేయలేదు. కాని అదే సంవత్సరం ఆయన జైలు నుండే రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పార్లమెంట్ సమావేశాలలో పాల్గొనేందుకు వీలుగా నాటి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదేశాలతో 1952 మే 13న జైలు నుంచి విడుదలయ్యాడు. 1956లో తిరిగి రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. దేశానికి మతోన్మాద ముప్పు ఎదురు కానుందని ఏనాడో పసిగట్టిన దార్శనికుడతడు. సోషలిజం ప్రస్థానంలో ప్రజాస్వామ్యాన్ని లౌకికతత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియచెప్పిన కమ్యూనిస్టు పాఠం అతడు. దేశంలో ఎన్నెన్నో దారులలో చీలికలు పేలికలుగా ఉన్న కమ్యూనిస్టు శ్రేణుల ఐక్యత అవసరమని గట్టిగా నమ్మినవాడు. 1964లో ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, 1969 లో జాతీయ సమితికీ ఎన్నికయ్యాడు. 1975 నుంచి 1988లో ఆయన రిటైరవ్వాలని నిర్ణయించుకునేంతవరకూ కేంద్ర కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా ఉన్నాడు. ఈ కాలంలోనే పార్టీ ఉర్దూ సైద్ధాంతిక పత్రిక 'కమ్యూనిస్టు బైజా'కు సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించాడు. 70 ఏండ్లు నిండిన తర్వాత నవతరానికి అవకాశాలివ్వాలన్న లక్ష్యంతో ఆయన అన్ని బాధ్యతల నుండి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. ఆ యనతన ఏడు పదుల ఉద్యమ జీవితంలో.. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. ప్రపంచ కార్మిక సమాఖ్య (డబ్ల్యుఎఫ్టీయూ) నాయకునిగా రష్యా, బల్గేరియా, మంగోలియా, జెకొస్లోవెకియా, ఉత్తర కొరియా తదితర దేశాలను సందర్శించాడు.
ఆయన గురించి కుమార్తె చెప్పిన ఒక సంఘటన గౌర్ నిబద్దతను తెలియజేస్తుంది. ఎనిమిదేండ్ల వయసులో ఆమె తన తండ్రిని ఎందుకో కొంత డబ్బు అడిగింది. 'లేదు వెళ్లు' అని రాజ్ అంటుండగా.. అదే సమయంలో అక్కడికి ఒక సందర్శకుడొచ్చాడు. తమారాకు 'రూపాయి' ఇచ్చాడు. అది తీసుకున్నందుకు ఆమె తన జీవితంలో తన తండ్రి చేత మొదటిసారి చెంపదెబ్బ తిన్నది (అదే చివరి సారి కూడా). అప్పుడు గౌర్ పార్లమెంట్ సభ్యుడు. అయినా ఆయన ఆర్థిక పరిస్థితికీ, ఆత్మాభిమానానికీ ఈ సంఘటన ఓ ఉదాహరణ. ఉర్దూ భాషకు చేసిన సేవలకు గాను 1991లో గౌర్ 'బహదుర్షా జాఫర్' అవార్డు కింద పాతిక వేల రూపాయలు అందుకున్నాడు. ఇంత పెద్దమొత్తాన్ని ఏం చేద్దామని కుమార్తెను రహస్యంగా అడిగారట ఆయన. తీర్చాల్సిన అప్పులను గుర్తు చేసిందట ఆ కూతురు ! అప్పులు పోగా పదివేల రూపాయలు మిగిలితే మగ్దూం ట్రస్ట్కు అందజేశాడట ఆయన..! మగ్దూం కంటే గౌర్ పదేండ్లు పెద్ద. అయినా.. 'మగ్దూం నా గురువు, స్నేహితుడు, వల్లభుడు' అనే వాడు రాజ్. ఇరువురూ కలిసి పాడుకున్నారు. మధుపానం చేశారు. ఉద్వేగం చెందారు. మగ్దూంను తలచుకోని రోజం టూ గౌర్ జీవితంలో, గౌర్ను తలచుకోని రోజంటూ మఖ్ధూమ్ జీవితంలో లేదంటే అతిశయోక్తి కాదు. గౌర్- మగ్దూం లిద్దరూ హైదరాబాద్ చెట్టుకు పూసిన ఒకే కొమ్మ పువ్వులు.
రాజ్ బహదూర్ జీవితం సాహిత్యం, ట్రేడ్ యూనియన్, రాజకీయ ఉద్యమాలతో పెనవేసుకొని సాగింది. నిజాం వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటంలో రజాకార్లను గడగడలాడించిన రాజ్ బహదూర్ గౌర్ తన 93వ ఏట 2011 అక్టోబర్ 7న అమరుడయ్యాడు. ''అరాచకానికి విప్లవానికి రేఖామాత్రమే భేదం ఉంది, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తిరుగుబాటు చేయడం అరాచకం.. సామాజిక ప్రయోజనాల కోసం తిరుగుబాటు చేయడం విప్లవం.. విప్లవంలో క్రమశిక్షణ అదుపు చేస్తుంది. అదుపు చేయలేనప్పుడు అరాచకమే విప్లవమవుతుంది. అరాచకమెప్పుడూ అది పుట్టిన చోటే అంతమవుతుంది. కానీ విప్లవం అలా కాదు. వ్యక్తిని పండించి వ్యవస్థను పరిమళింపజేసేదే కమ్యూనిజం'' అంటారాయన. అనడమే కాదు దానికి నిబద్ధుడై జీవించాడు. కనకనే నేటికీ 'చమేలీకా మండ్వా'గా పరిమళిస్తున్నాడు. కమ్యూనిస్టు చైతన్యమై ప్రవహిస్తున్నాడు.
- అనంతోజు మోహన్కృష్ణ
సెల్: 8897765417