Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్న మా ఎడిటర్ గారు పిలిచి అత్యవసరంగా ఒక అసైన్మెంట్కి వెళ్ళాలన్నారు.
''ఏంటి సార్?'' అడిగాను.
''శిఖరాగ్ర సమావేశం.. కరోనాపై''.
''ఏ దేశాధిపతులతో సార్?'' మరలా ఆడిగాను. దేశాధిపతులు కాదు రాష్ట్రాధిపతులు. కేసీఆర్, వైఎస్ జగన్ల మధ్య'' అన్నారు. ఆశ్చర్యపోవడం నా వంతైంది.
శిఖరాగ్ర సమావేశం కోసం తాజ్ హౌటల్ ముస్తాబైంది. బయట ప్రెస్.. కేసీఆర్, జగన్ ప్రత్యేక కార్యదర్శులు స్వాగతం చెప్పారు. సమావేశానికి ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి చౌబే కూడా వచ్చారు. జగన్ ప్రత్యేక కార్యదర్శి షేక్హ్యాండ్ ఇవ్వబోయాడు. నేను నమస్కారం పెట్టాను.
''ఏంటమ్మా చాదస్తం''అంటూ ''కరోనా పట్టు కుంటే రాదు. కారం, మిరియాలు తింటే వస్తది. వాటిని మానేయండి'' అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. విలేకరులంతా షాక్కు గురై తేరుకునేలోపు ఆయన వెళ్లిపోయాడు. లోపల కేంద్ర మంత్రి అందరినీ పలుకరిస్తున్నాడు. పంచ కట్టుకుని అచ్చం సంప్రదాయ బద్ధంగా ఉన్నాడు.
''రండి రండి అలా బయటకు వెళదాం'' అన్నారు.
''ఎందుకు'' అడిగాం.
''తెలియదా మీకు కాసేపు అందరం అలా సూర్యభగవానుడికి ఎదురు నిలబడి వేడుకుంటే కరోనా దగ్గరకు రాదన్నాడు. మరో షాక్. అదెలా సార్'' మరలా అడిగాము.
''సూర్య కిరణాల థెరపీ. తెలియదా మీకు. మన భారతీయులతో ఇదేనయ్యా తంటా.. మన స్వంత శాస్త్రాలను పట్టించుకోము'' అంటూ కాస్త అసహనం ప్రదర్శించాడు.
హాలంతా నిశ్శబ్ధం. ముఖ్యమంత్రులిద్దరూ వేంచే శారు. ''అరె.. భరు... తెలుగు రాష్ట్రాలకు కరోనా రాదు. ఇక్కడంతా ఎండలు''అన్నాడు జగన్తో కేసీఆర్.
''వస్తదన్నా.. వస్తే మాత్రం ఏం చేస్తది. బ్లీచింగ్ చల్లేస్తాం. పారిపోతుంది'' జగన్ భరోసా ఇచ్చాడు కేసీఆర్కు.
ఇంతలో జగన్ కార్యదర్శి ఒక చిట్టీ పంపాడు.
''అన్నా, మా రాష్ట్రంలో కరోనా వస్తే ఏం చేయాలని భయపడుతున్నారు. 'నేనున్నా.. వస్తున్నా... అంటూ రాత్రికిరాత్రి ఫ్లెక్సీలు పెట్టించా. జగన్ పేరు వింటేనే కరోనా పారిపోతుందని మా జనం నమ్ముతున్నారు'' ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
''అరె.. భరు... నా మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పా. పోయి సరిహద్దులో కర్రలు పట్టుకొని నిలబడండి. కరోనా పారిపోద్ది'' అని. ఇంతలో కేసీఆర్ కార్యదర్శి వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. ఈ శిఖరాగ్ర సమావేశం వార్త తెలుసుకుని అమెరికా నుండి ట్రంప్ ఫోన్ చేశాడు. ''ట్రంప్.. వీడియో కాల్'' చెప్పాడు కేంద్ర మంత్రి చౌబే.
''గుడ్ ఈవెనింగ్ ఎవిరిబడీ'' ట్రంప్ వాయిస్ మోగింది. ''ఇక్కడ క్యూలు పెరిగిపోయాయి. సరుకులు దొరకడం లేదు. మీ జనాన్ని తీసుకెళ్ళిపోండి.'' హుకుం జారీ చేశాడు.
''నో సార్... నో..'' మేం మీకు చిట్కాలు చెప్తాం. కరోనా రాదు. అందరికీ పారాసిటమాల్ మాత్ర వేయండి. క్షణంలో మాయమవుద్ది'' అన్నాడు జగన్.
''వావ్'' ట్రంప్ మంత్రముగ్ధుడయ్యాడు. ఇంతలో కేంద్ర మంత్రి జోక్యం చేసుకుంటూ ''పారాసిటమాల్ను ఆవు పంచకంతో తాగించండి. ఇంటి చుట్టూ ఆవు పేడతో వారధి కట్టండి. అందుకు మా భారతీయుల్ని పెట్టుకోండి. కరోనాను తరిమికొడతారు'' హామీ ఇచ్చాడు. ''వెరీ గుడ్'' చప్పట్లు కొట్టాడు ట్రంప్. మీరు ముగ్గురూ మా దేశం రండి. ప్రత్యేక సలహాదార్లుగా నియమిస్తాం. మీరు గ్రేట్ డాక్టర్స్'' అని చెప్పాడు ట్రంప్.
అంతే ఇంతలో కరెంటు పోయింది. పనిలోపనిగా విలేకర్లు బయటకు పారిపోయారు.
- నక్షత్ర