Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ 2019 డిశంబర్లో చైనాలో ప్రత్యక్షం అయినప్పటి నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ముందు అది కేవలం చైనాకు సంభంధించిన సమస్యగానే కనిపించినా త్వరలోనే ప్రపంచ సమస్యగా ముందుకు వచ్చింది. ప్రతీ దేశం మా దేశానికి ఏమి కాదు అనుకున్నది. కానీ నేడు ప్రతీ దేశం కరోనా వైరస్ భయంతో వణికి పోతున్నది. కరోనా వైరస్ చైనా సమస్య కాదు. కరోనా వైరస్కు కారణమూ చైనా కాదు. ప్రపంచ దేశాలన్ని కలిసి ప్రపంచ ఆర్ధికవ్యవస్థ అనే బలమైన గొలుసులో భాగాలుగా మారిపోయిన నేటి కాలంలో ఒక వైరస్ విజృంభణకు ఏదో ఒక దేశాన్ని కారణం చేయలేము (అది బయోవెపన్ కాకపొతే). అంతర్జాతీయంగా పర్యావరణ సమస్యలు పెరిగిపోతున్నాయి. వాటి నుండి కరోనా వైరస్ విజృంభణను వేరు చేసి చూడలేం. భూగోళపు ఊపిరి తిత్తులుగా చెప్పబడే బ్రెజిల్ అడవులు పెద్ద ఎత్తున కాలిపోయాయి. తరువాత ఆస్ట్రేలియా అడవులు నెలల తరబడి కాలిపోయాయి. వాతావరణంలో పెరుగుతున్న వేడికీ ఈ అడవుల అసాధారణ దహనానికీ సంబంధం ఉన్నది. ధృవాల వద్ద మంచు ఖండాలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. చల్లటి ప్రాంతాలలో తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి. అకాల వర్షాలూ తుఫాన్లూ పెరిగిపో తున్నాయి. కరోణా వైరస్ విజృంభణ కూడా పర్యావరణంలో వస్తున్న మార్పుల క్రమంలో ఒక భాగం మాత్రమే. ఎప్పుడైనా కాని ప్రకృతి పైన ఇష్టం వచ్ఛినట్టు దాడి చేస్తే అది ప్రతీకారం తీర్చుకుంటుంది. ప్రకృతి నియమాలు అర్ధం చేసుకుంటూ, ఆ నియమాలకు అనుగుణంగా మానవ ఉత్పత్తి కార్యకలాపాలు ఉన్నప్పుడే, మానవ సమాజానికి ప్రకృతికి మధ్య సమన్వయం సమతుల్యత సాధించడం సులువవుతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమే నేటి పర్యావరణ సమస్యలకు, వాటి కారణంగా వచ్చే వ్యాధులకు కారణం.
కరోనా వైరస్ సందర్భంలో మతాల గురించిన చర్చలు, వాదనలు కూడా జరుగుతున్నాయి. ప్రారంభంలో వివిధ మతాలకు చెందిన ప్రాంతీయ ఫాదర్లు, పూజారులు, కరోనా వైరస్ను ప్రార్థనలు పూజలు యజ్ఞాలతో కట్టడి చేస్తామని చెప్పారు. కాని చివరికి మౌనం వహించారు. దక్షిణ కొరియాలో ఒక చర్చి పెద్ద కరోనా వైరస్ను కట్టడి చేయడనికి చేపించిన సామూహిక ప్రార్థనల కారణంగా ప్రాణనష్టం జరిగింది. దానితో మళ్ళీ ఏ మత పెద్ద కూడా అటువంటి ధైర్యం చేయడం లేదు. ఆయా దేశాల ప్రభుత్వాలే ప్రార్థనా స్థలాలలో సామూహిక ప్రార్థనలపై, ఇతర కార్య క్రమాలపై ఆంక్షలు విధించాయి. మత పెద్దలు ఎవరు కూడా ఈ ఆంక్షలను వ్యతిరేకించడం లేదు. ఆంక్షలను వ్యతిరేకించి సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తే నయంకాకపోగా ఇంకా నలుగురికి కరోనా అంటుకోవచ్చు. అప్పుడు తమ పరువు పోవడమే కాక ప్రజలకు మతంపైనే నమ్మకం పోతుందని ఈ మత పెద్దలకు తెలుసు. అందుకే మౌనంగా ఉంటున్నారు. రేపు కరోనా వైరస్పైన సైన్స్ విజయం సాధించిన తరువాత, దేవుడి దయవల్లనే సైంటిస్టులు ఈ విజయం సాధించారని ఈ మతపెద్దలే చెపుతారు! అప్పటి వరకు మౌనవ్రతంలోనే ఉంటారు. నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదులు కరోనా సందర్భంలో మతాల వైఫల్యాల గురించి, వాటి అశక్తత గురించి, వాటి అశాస్త్రీయత గురించి సరిగానే ఎండగడుతున్నారు. అంతిమంగా సైన్స్ విజయం గురించి చెపుతున్నారు. కాని కరోనా వైరస్కూ రాజకీయాలకూ ఉన్న సంభంధం గురించి వారు విశ్లేశించలేరు. వారి పరిధిలోకి అది రాదు కూడా. కాని ఒక్కసారి సైన్స్ విజయం సాధించిన తరువాత, మతం ఆ విజయాల పైనే ఎక్కి ప్రజల మెదల్లలో భావవాదాన్ని, అజ్ఞానాన్ని ఎక్కించే పనికి పూనుకుంటుంది. అప్పుడు మతానికి రాజ్యం దన్నుగా నిలబడుతుంది. రాజ్యానికి మతం దన్నుగా నిలబడుతుంది.
కరోనా వైరస్ సంధర్భంగా ప్రధానంగా జరుగుతున్న చర్చ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ గురించే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు ఎంత నష్టం జరుగుతున్నది? ఎంత జరగవచ్చు? లాంటి విషయాల మీదనే చర్చ జరుగుతున్నది. ఈ మహమ్మారి కారణంగా జరిగే ఆర్థిక నష్టాన్ని ఎంత కాలంలొ పూడ్చగలరో అంచనాలు వేస్తున్నారు. కొందరు ఆర్థికవేత్తలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించాడానికి ఏమేమి చేయాలో సూచనలు ఇస్తున్నారు. కానీ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి కరోనా వైరస్కు ఉన్న సంబంధం గురించి విశ్లేషించడం లేదు. రాజకీయ అర్ధ శాస్త్రం మాత్రమే ఆ విషయం చెప్పగలదు. కరోనా కట్టడి విషయంలో మతం, దేవుళ్ళు విఫలం అయ్యారని ప్రాచారం జరుగుతున్నది. కానీ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం విఫలం అయ్యిందని చర్చ జరగడం లేదు. కరోనా వైరస్ విజృంభణకు, పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానికి ఎటువంటి సంబంధం లేదనుకోవడమే అందుకు కారణం. పెట్టుబడిదారి విధానం సైన్స్పై ఆధారపడి, కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించడం కూడా అందుకు కారణం. నిజానికి మతమూ, పెట్టుబడిదారి విధానమూ రెండూ కూడా సైన్స్ను తమ స్వార్ధ ప్రయోజనాల కొరకు వాడుకునేవే. సైన్స్ సాధించిన ప్రతి కొత్త ఆవిష్కరణను మతము తన తత్వశాస్త్రానికి అణుగుణంగా చెప్పుకుంటుంది. సైన్స్ సాధించిన ప్రతి కొత్త ఆవిష్కరణను పెట్టుబడిదారి విధానం తన అపార లాభాల కోసం వాడుకుంటుంది. ఇవి రెండూ ప్రజల ప్రయోజనాలను దెబ్బ తీసేవే.
''సమాజం విషయంలో మాదిరిగానే ప్రకృతి విషయంలో కూడా, ప్రస్థుత ఉత్పత్తి విధానం ప్రధానంగా తక్షణ, మిక్కిలి ప్రత్యక్ష ఫలితాన్ని గురించి మాత్రమే పట్టించుకుంటుంది'' ఏంగెల్స్. (వానరుడు మానవుడిగా మారే క్రమంలో శ్రమ నిర్వహించిన పాత్ర). సైన్స్ను ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తే, మానవ సమాజానికి ప్రకృతికి మధ్య సమతుల్యత సులువుగా సాధించవచ్చు. కానీ పెట్టుబడిదారి వర్గం తన అపార లాభాల కోసం సైన్స్ను ఆశపోతుతనంతో ఉపయోగిస్తే ప్రకృతి విధ్వంసం తప్పదు. అప్పుడు మానవ సమాజానికి ప్రకృతికి మధ్య సమతుల్యత సమన్వయం అసంభవం అవుతుంది. ప్రస్థుతం అదే జరుగుతున్నది. ఈ విషయంలో కొందరు పర్యావరణవేత్తలు, పర్యావరణ రక్షణ కార్యకర్తలు, ప్రకృతి విధ్వంసానికి పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానానికి ఉన్న సంబంధాన్ని గుర్తించ గలుగుతున్నారు. అయితే వీరు చట్టబద్ధ ఆందోళనలతో పర్యవరణ రక్షణ కోసం చట్టాలు చేయిస్తే చాలు అనుకుంటారు. అయితే ఇప్పటికే ఎన్నో పర్యావరణ చట్టాలు ఉన్నప్పటికి వాటన్నింటిని తుంగలో తొక్కుతున్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణలు చేస్తున్నారు. బూటకపు సైన్స్తో, అబద్దాలతో పర్యావరణంపైనే దాడులకు పాల్పడుతున్నది పెట్టుబడిదారి వర్గం.
పెట్టూబడిదారీ ఉత్పత్తి విధానం ప్రకృతి వనరులను ఒక ప్రణాళిక ప్రకారం, అవసరం అయిన మేరకు కాకుండా, తన అపార లాభాల కోసం ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. ప్రతి పెట్టుబడిదారుడు భూమిని తవ్వేస్తుంటాడు. అడవులను నరికేస్తుంటాడు. భూమిలోకి గొట్టాలు దించి ఆయిలు, నీళ్ళు లాగేస్తుంటాడు. ఒక ప్రణాళిక, ఒక లెక్క ఉండదు. ఏది ఎంత అవసరమో అంతకు పరిమితిఉండదు. తన అత్యాశకు మొత్తం మానవ సమాజం భవిష్యత్తును ఫణంగా పెడుతూ, కేవలం తన లాభాల కోసం మొత్తం మానవ సమాజానికి చెందిన వనరులను ధ్వంసం చేస్తున్నది. ఈ క్రమంలోనే వివిధ పర్యావరణ సమస్యలకు, వివిధ వైరస్ల విజృంభణకు కారణమవుతున్నది. కరోనా వైరస్ విజృంభణ పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం యొక్క చెడు ఫలితం మాత్రమే. సంక్షోభాలను చావులను కూడా లాభసాటి వ్యాపారంగా మార్చుకునే పెట్టుబడిదారి వర్గం, రేపు కరోనా వైరస్కు మందు కనిపెట్టినా దానితో కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుంది, అంతే కాని పర్యావరణ రక్షణకు పూనుకోదు. ముందు గాలిని కలుషితం చేస్తుంది తరువాత ఆక్సిజన్ను అమ్ముతుంది. కరోనా వైరస్కు మందు కనిపెట్టినా పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం ఉన్నంత కాలం కరోనా వైరస్లకు జేజమ్మల లాంటి వైరస్లు పుడుతూనే ఉంటాయి. పెట్టుబడిదారి ఉత్పత్తివిధానమూ దాని రాజకీయ అధికారమూ అంతం అయినప్పుడే పర్యావరణ సమస్యలూ, కరోనా వంటి వైరస్లూ అంతం అవుతాయి. ప్రకృతి నియమాలకు అనుకూలంగా, వ్యక్తిగత లాభాలకు తావులేకుండా, ప్రజల ప్రయోజనాలే కేంద్ర బిందువుగా సాగే ప్రాణాళికాబద్ద ఉత్పత్తివిధానమే, మానవ సమాజానికి ప్రకృతికి మధ్య సమతుల్యతను సాధించ గలుగుతుంది. అందుకే కరోనా వైరస్ మౌలికంగా రాజకీయ సమస్యే. అంతిమంగా రాజకీయ పరిష్కారమే పర్యావరణ సమస్యలనూ, వాటితో వచ్చే వ్యాధులనూ నివారించగలదు.
లంకా పాపిరెడ్డి
సెల్:8465053792