Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండ నాల్కకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టుంది ప్రధాని మోడీ పనితీరు. కరోనా దెబ్బకు ప్రపంచం కకావికలం అవుతుంటే నివారణ మార్గాలను తూచ: తప్పకుండా అమలు జరిపేలా చర్యలు తీసుకోవాల్సిన పాలకులు అర్థం లేని నమ్మకాలను ప్రజల్లో బలంగా జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 22న మొదటి రోజు లాక్ డౌన్ పాటించి కరోనా కట్టడికోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి చప్పట్లతో మద్దతు తెలపాలని కోరినప్పుడు దేశం మొత్తం తారతమ్య భేదం లేకుంగా స్వాగతించింది. లాక్డౌన్ను ఏప్రిల్ 14 వరకు పొడిగించినా ప్రజలు నిబద్దతతో ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసరమై రోడ్డెక్కితే సామాజిక దూరం పాటిస్తూ వ్యాధి కట్టడికి తమవంతు పాత్రను పోషిస్తున్నారు. ఇదే అదునుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతారని అర్థం లేని విశ్వాసాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు ఏలికలు! దీపాలు వెలిగిస్తే రోగాలు పోతాయంటే ఆస్పత్రులెందుకు? వైద్యులెందుకు? ఈ సామాజిక దూరమెందుకు? భక్తి, విశ్వాసాలు వ్యక్తిగతం... దాన్నెవరూ ప్రశ్నించడం లేదిప్పుడు! ఓ భయానకమైన సమస్యతో పోరాడుతున్న సమయంలో అధికారంలో ఉన్న పాలకులు మూఢ భక్తిని, మూఢ విశ్వాసాలను ప్రజలు పాటించాలని చెప్పడం దేశ హితానికి మంచిది కాదు.
-ఊరగొండ మల్లేశం