Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారితో ఇప్పుడు ప్రపంచం అతలాకుతలమై పోతున్నది. దాని దెబ్బకు దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. మనదేశంలో ఒకవైపు లాక్డౌన్ పేరుతో ప్రజల్ని గుంపులుగా గుమికూడొద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో పగటిపూట అప్రకటిత, రాత్రి పూట ప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతున్నది. ఇంకోవైపు టీవీ ఛానళ్లలో ప్రముఖ గాయకులు కరోనాపై అవగాహన కోసం పాటలు రాసి, పాడటం ద్వారా జనాన్ని జాగృతం చేస్తున్నారు. పత్రికలు కరోనాపై వివిధ దేశాల్లో తీసుకుంటున్న నివారణా పద్ధతులను, అక్కడి పరిస్థితులను వివరిస్తూ వార్తలు, కథనాలు, వ్యాసాలను ప్రచురిస్తున్నాయి. సోషల్ మీడియా శరవేగంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని చేరవేస్తున్నది. కూరగాయలు, పాలు, నిత్యావసరాల వంటి వాటికి ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో ఉపాధి, వలస కూలీల గోస, పేదలు, యాచకుల ఆకలి బాధ.. అందర్నీ కలచి వేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో విచిత్రకమైన పరిస్థితి నెలకొన్నది. మద్యం ప్రియులు.. లాక్డౌన్ ప్రకటన నాటి నుంచి వైన్ షాపుల వైపు వెర్రి చూపులు చూస్తున్నారు. 'ఎన్నాళ్లో వేచిన ఉదయం..' అనే రీతిలో లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా..? ఎప్పుడు నాలుగు చుక్కలు నాలుక మీద పడతాయా..? అని దీనంగా ఎదురు చూస్తున్నారు. మందు దొరకటం లేదనే బాధతో నాలుగు రోజుల క్రితం ఖైరతాబాద్లో ఒకడు గొంతు కోసుకోవటం, శనివారం గాంధీనగర్లో వైన్షాపుకు కన్నం పెట్టి లక్షల కొద్దీ విలువైన మందు బాటిళ్లను దొంగిలించటం.. తదితరాంశాలు పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సురాపానం లేకపోతే బతకలేని తమ కోసం.. కేరళ తరహాలో మన దగ్గర కూడా ప్రత్యేక పాసులు జారీ చేసి, తమ నోట్లో గుక్కెడు మందు నీళ్లు పోయాలని ట్యాక్స్ పేయర్లు కోరు తున్నారు. తద్వారా తమ నిండైన జీవితాలను కాపాడాలంటూ వారు సర్కారుకు మొరపెట్టుకుంటున్నారు.
-బి.వి.యన్.పద్మరాజు