Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనాకు మానవులపై కరుణ లేదు. కండ్లకు కనిపించని ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఒక సూదిమొనపై సుమారు 10కోట్ల కరోనా జీవులు తిష్టవేయవచ్చని నిపుణుల చెపుతున్నారు. దీనిని బట్టి అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయో అంచనా వేయవచ్చు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వైరస్ ప్రపంచ మానవాళిని అష్టకష్టాలపాల్జేస్తున్నది. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రజలపై ఏ రూపంలో దాడి చేస్తోందో చెప్పలేం. మనిషికి మనిషి ఎడం (దూరం) పాటించడమే దీనికి నివారణ అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రకటించారు. కోట్లాది మంది ప్రజలను ఇండ్లకే పరిమితం చేశారు. స్వీయ గృహ నిర్బంధంలో ప్రజలు నివసిస్తున్నారు. మనం నివసిస్తున్నది ఆదిమ కాలం కాదు. సకల శాస్త్ర సాంకేతిక సౌకర్యాలతో ఆధునిక యుగంలో జీవిస్తున్నార. అయినప్పటికీ కరోనా వైరస్ను కంట్రోల్ చేయలేకపోతున్నాం. చైనాలోని వూహాన్ నగరంలో జనించిన ఈ వైరస్ శరవేగంతో 200 దేశాలకు విస్తరించింది. దీనికి కారణమేమిటి? ప్రపంచంలోని వివిధ దేశాలకు గంటల వ్యవధిలో ప్రయాణించడానికి వాయుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రజలు చాలా వేగంగా విమానాల్లో వెళుతున్నారు. కరోనా వైరస్ కూడా అంతే వేగంతో ప్రజలతో పాటే వివిధ దేశాలను చుట్టేసింది. ఆ దేశాలకు చెందిన కొంత మంది ప్రజల దేహాల్లో తిష్టవేసింది. మన దేశంలో కరోనా కేసులు కేరళ రాష్ట్రంలో మొదట కనిపించాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో పూర్తి శ్రద్ధ వహించింది. 26వేల కోట్ల రూపాయలను కరోనా కట్టడికి కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో కరోనా వ్యాధి పీడితుల సంఖ్య పెరగడానికి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఒక ప్రార్థనా మందిరంలో జరిగిన సమావేశానికి హాజరైన వారిలో కరోనా లక్షణాలు కనిపించాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో అతి ఎక్కువగా కరోనా వల్ల నష్టపోయిన దేశం ఇటలీ. ఇటలీకి చైనాలోని వూహాన్ నగరానికి అవినాభావ సంబంధముంది. వ్యాపార వాణిజ్య సంబంధాల వల్ల నిత్యం ఈ రెండు దేశాల మధ్య రాకపోకలు సాగేవి. దీని వల్లనే ఇటలీకి కరోనా వ్యాపించింది. చైనా పాలకులు వ్యాధి తీవ్రతను గుర్తించి ఆఘామేఘాలపై ప్రజలను మానసికంగా వ్యాధిని ఎదుర్కొనేందుకు సిద్ధం చేశారు. సైన్యాన్ని రంగంలోకి దింపారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే వేల పడకల ఆస్పత్రిని నిర్మించారు. ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నమోదైన కరోనా కేసులు 11,39,207. మరణాలు 60,874. ముందు ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మన దేశంలో ఇప్పటి వరకు 3,0727 కేసులు నమోద కాగా 75మంది మరణించారు. వివిధ దేశాల్లో కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలను మన ప్రభుత్వం సమీక్షించింది. కేంద్ర ఆరోగ్య మండలి సలహా మేరకు మార్చి 22న దేశ వ్యాపిత కర్ఫ్యూను అమలు చేసింది. ఆ తరువాత లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు పొడిగించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రానట్లయితే లాక్డౌన్ మరింత కాలం పొడిగించే అవకాశాలున్నాయి. కరోనా వల్ల ప్రపంచంలో కరచలనాలు బందయ్యాయి. దూరం నుంచే మన ప్రజలు అభివాదం చేసుకునే 'నమస్కారం' విశ్వ ప్రజలకు సంస్కారమైంది. వ్యాధి నివారణకు ఆచరణీయమైంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతనూ పాటించాలి. ఒక వ్యక్తికి మరో వ్యక్తి భౌతిక దూరాన్ని పాటించాలి. అయితే మన దేశంలోని కొంత మంది మత చాందస వాదులు లాక్డౌన్ నిబంధనలను పాటించడం లేదు. ప్రార్థనా స్థలాల్లో వందల సంఖ్యలో గుమిగూడుతున్నారు. తమకు ఏమి కాదనే అతి విశ్వాసంతో ఉన్నారు. ఈ అతి విశ్వాసమే కొంప ముంచుతుందనే విషయాన్ని వారు గ్రహించడంలేదు. అనేక దేశాల్లో కొంత పాలకుల నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తికి కారణమైంది. 60 సంవత్సరాలు పైబడిన వారు చిన్న పిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా కరోనా గట్టి దెబ్బ తీసింది. లక్షల కోట్లకు మించి ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతోంది. వేలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందువల్లనే ఐక్య రాజ్య సమితి దీనిని ప్రపంచ విపత్తుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ప్రపంచంపై పెత్తనం చేస్తున్న అమెరికా పాలకులు ముఖ్యంగా ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనాను ఖాతరు చేయని ఫలితాన్ని ఇప్పుడా దేశం అనుభవిస్తోంది.
కరోనా నివారణలో క్యూబా ఆదర్శం
కరోనాను కట్టడి చేసేందుకు అవసరమైన వైద్యులను వివిధ దేశాలకు పంపించడం ద్వారా చిన్న దేశం క్యూబా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల బ్రిటన్ నుంచి బయలు దేరిన ఓడను తమ దేశంలోకి అనుమతించడమే కాకుండా కరోనా సోకిన వారికి తమ ఆస్పత్రుల్లో చికిత్సనందించింది. ఆ ఓడలో 682 మంది ప్రయాణికులున్నారు. వారిలో ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకినట్టు గుర్తించారు. కరోనా నివారణ వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చాలా చురుకుగా సాగుతున్నాయి. అమెరికాలో జరుగుతున్న పరిశోధనకు 43ఏండ్ల జెన్నీఫర్ అనే మహిళ ముందుకు వచ్చింది. త్వరలోనే వ్యాక్సిన్ కనుగొనే అవకాశాలున్నాయి.
కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ వల్ల మన దేశంలో లక్షలాది మంది పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ ప్రకటించే ప్రభుత్వం పేద ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే బాగుండేది. కరోనా దేశంలోని లక్షలాది ప్రజలు నిరశ్రయులయ్యారు. ఉపాధి కోల్పోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో నెత్తిన మూటలు, సంకన పిల్లలతో కాలినడకన వందల మైళ్లు ప్రయాణిస్తున్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి కేంద్రం ప్రకటించిన లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ సరిపోదని, ఆ నిధులను పెంచాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు. ఏది ఏమైనా కరోనాపై కలిసి కట్టుగా యుద్ధం చేయడమే మన ముందున్న కర్తవ్యం. ఆ సమిష్టి యుద్ధమే మనలను మన పిల్లలను కాపాడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
జి.గంగాధర్ సిర్ప
సెల్: 8919668843