Authorization
Mon Jan 19, 2015 06:51 pm
7
'కుండ' వల్ల ఉపయోగమా, 'చెప్పుల' వల్ల ఉపయోగమా - అంటే, అది తప్పు ప్రశ్న. దేని ఉపయోగం దానిదే. కుండ కావలిసినప్పుడు కుండ దొరకకుండా ఇంకో ఉత్పత్తి ఏది దొరికినా దానితో ఏం ప్రయోజనం? 'దాహం' కోసం మంచి నీళ్ళు కావలిసి వుంటే, బంగారం దొరికితే ఏం ప్రయోజనం? ఉపయోగాల విషయంలో 'ఇదా, అదా' అనే పోలికలు పనికి రావు.
కాకపోతే, ఒకేరకం ఉత్పత్తి వల్ల వుండే ఉపయోగాల్లో తక్కువ, ఎక్కువ ఉండవచ్చు. బియ్యాన్ని తీసుకుంటే తక్కువ బియ్యం వల్ల ఉపయోగం తక్కువా, ఎక్కువ బియ్యం వల్ల ఉపయోగం ఎక్కువా కావచ్చు. అయినా, ఇది కూడా సరైనది కాదు. 'బియ్యం వల్ల ఉపయోగం ఏమిటి?' అన్నప్పుడు, ఆ 'పదార్థం' వల్ల ఉపయోగం ఏమిటో చూస్తాం గానీ, దాని ఉపయోగాన్ని, దాని సైజుని బట్టి చూడటం కాదు. వస్తువుల సైజుల్ని తీసుకుంటే వాటి వల్ల ఉప్రయోగాలు తక్కువ - ఎక్కువలు గానే, తేడాలు గానే వుంటాయి.
చిన్న సైజు చెప్పుల వల్ల ఉపయోగం, చిన్న పిల్లలకీ, పెద్ద సైజు చెప్పుల వల్ల ఉపయోగం పెద్ద వాళ్ళకీ. ఇది సైజుల విషయం. అసలు 'చెప్పుల' వల్ల ఉపయోగం ఏమిటి? - అన్నప్పుడు దాన్ని సైజుల ప్రసక్తితో చూడడం కాదు.
సహజ పదార్థము + శ్రమ = ఉత్పత్తి
సమాజంలో ఏ రకం ఉత్పత్తి అయినా, ఏదో ఒక 'సహజ పదార్థం' మీద శ్రమలు జరగడం వల్లనే తయారవుతుంది. ఏ శ్రమా జరగకుండానే తయారయ్యేది ప్రకృతి సహజంగా తయారయ్యేదే. 'సహజ పదార్థం' మీద కొంత శ్రమ జరిగితే అది 'ముడి పదార్థం' అవుతుంది. దాని మీద ఇంకా కొన్ని శ్రమలు జరిగితేనే అది వాడకానికి సిద్ధం అవుతుంది.
'శ్రమలూ, శ్రమ కాలాలూ' అన్నప్పుడు వాటి గురించి ప్రధానమైన విషయాలు తెలుసుకోవాలి. అవి శారీరక - మేథా శ్రమల్లో తేడాలు.
కొన్ని శ్రమలు 'శారీరక శ్రమలు' గానే వుంటాయి. భూమిని దున్నడం, మొక్కల్ని పాతడం వంటి వ్యవసాయ శ్రమలన్నీ శారీరక శ్రమలే. లెక్కల్నీ, సైన్సుల్నీ నేర్పే పని 'మేథా శ్రమ' అవుతుంది.
'బియ్యం' అనే ఉత్పత్తి ఎలా తయారవుతుంది? - 'బియ్యం' రావాలంటే 'ఒడ్లు' అనే ధాన్యం రావాలి. ఆ ధాన్యం రావాలంటే భూమి మీద 'వరి నారు' కోసం వరి విత్తనాల్ని నాటే పని దగ్గిర్నించీ ప్రారంభం కావాలి. భూమి, ప్రకృతి సహజ పదార్థం. దాని మీద రకరకాల 'వ్యవసాయ శ్రమలు' జరుగుతూ పోతే 'ఒడ్లు' తయారవుతాయి. ఈ ధాన్యం పండడానికి 'భూమి' అనే సహజ పదార్థం మొదటి 'ఉత్పత్తి సాధనం'గా అత్యవసరమే. కానీ, భూమిపై పండే పంటల 'విలువల్లో' భూమి పాత్ర ఏదీ వుండదు. అయితే, భూమినుంచి కొంత మట్టిని తవ్వి తీసి, ఆ మట్టిలో కొన్ని నీళ్ళు పోసి, మట్టిని ముద్దగా చేసి, ఆ ముద్దని ఒక 'మూకుడు'గా చేసి ఎండబెడితే అది ఒక 'వస్తువు'. కట్టెలతో మంటని మండించి, ఆ మంటలో మట్టి మూకుడుని కొంత కాల్చితే అది మరొక వస్తువు. ఈ వస్తువులు ఎలా తయారైనట్టు?
మట్టీ, నీళ్ళూ అనే సహజ పదార్థాలు + మానవ శ్రమలు = మట్టి మూకుడు
ఏ వస్తువు గానీ, ఏ పదార్థం గానీ, ఎలా తయారయ్యాయో తెలుసు కోవాలంటే 'భూమి'తోనే ప్రారంభించవలిసి వస్తుంది. భూమి సహజ పదార్థమే అయినా, భూమి వల్ల 'ఉపయోగపు విలువే' వుంటుంది. కానీ, భూమి నుంచి చేరే 'మారకం విలువ' ఏదీ వుండదు. ఎందుకు? 'భూమి' అనేది మానవ శ్రమలతో తయారైనది కాదు కాబట్టి. భూమి మీద రకరకాల శ్రమలు జరిగితేనే, రకరకాల ఉత్పత్తులు, పదార్థాలు తయారవుతాయి. భూమి మీద వ్యవసాయమే కాదు. భూమి మీద ఇళ్ళు కట్ట వచ్చు. రోడ్లు వేయవచ్చు. ఇంకా ఎన్నో.
ఒక 'చెక్కకుర్చీ' తయారీని చూద్దాం..
ఆ 'చెక్క'కి కారణం అడవిలో చెట్టు అయితే, అది సహజంగా వున్న చెట్టు. దాని కొమ్మల్ని విరగ్గొట్టి, ఆ చెక్కని కిందకి తెస్తే, ఆ చెక్క కొంత శ్రమతో తయారైన ముడిపదార్థం. చెక్క ముక్కల్ని అతకడానికి 'మేకులు' కావాలి. మేకుల్ని తయారు చేయడానికి ఏదైనా లోహం కావాలంటే గనుల్ని తవ్వాలి. 'తవ్వడం' ఒక శ్రమ. గనుల్లో ఉన్నది సహజ పదార్థం. దాని మీద శ్రమ జరిగితే అది ముడి పదార్థం. ఆ పదార్థాన్ని మేకులుగా తయారు చేసినది కూడా శ్రమే.
చెక్కా, మేకులు + కొంత శ్రమ = చెక్క కుర్చీ
చెక్కా, మేకులు, ముడి పదార్థాలే. అవి కొన్ని శ్రమలతో తయారైన వస్తువులు. ఆ వస్తువుల మీద కొన్ని శ్రమలు జరిగితేనే 'కుర్చీ' తయారైంది.
'శ్రమ' అనేది గాలిలో జరగదు. శూన్యంలో జరగదు. భూమి మీద ప్రారంభమైతేనే, శ్రమల ఫలితాలు కనపడతాయి.
ఒక 'పెన్సిల్' ఎలా తయారైందో, ఒక 'మంచం' ఎలా తయారైందో, ఒక 'ఇల్లు' ఎలా తయారైందో, ఒక 'పుస్తకం' ఎలా తయారైందో, 'పంట' ఎలా పండిందో - ఇలా దేని తయారీని తీసుకున్నా ప్రారంభంలో 'భూమి' పాత్రే వుంటుంది. కానీ, ఆ వస్తువుకి 'భూమి' వల్ల చేరే శ్రమ విలువ ఏదీ వుండదు.
వస్తువు తయారీకి మార్కు ్స గ్రహించిన సూత్రం
మేటర్ + లేబర్ = తింగ్.
పదార్థమూ + శ్రమా = వస్తువు
భూమిని దున్నడం గానీ, తవ్వడం గానీ, చదును చెయ్యడం గానీ, లేదా ఇంకే రకం శ్రమ చెయ్యడం గానీ, ఏది జరిగినా ఆ శ్రమ కోసమే కొంత 'విలువ' గానీ, సహజంగా వున్న భూమికి వున్న విలువ అవదు అది.
అయితే, భూముల్ని అమ్మడాలూ కొనడాలూ జరుగుతాయి. ఇవి ఎలా సాధ్యం? - సమాజంలో అనేక 'తప్పులు' జరుగుతున్నాయి. దానికి మార్క్సు చెప్పిన కారణం, మానవుల మధ్య ఏర్పడ్డ తప్పుడు సామాజిక సంబంధాలు (ఫాల్టీ సోషల్ రెలేషన్స్) వల్ల అని. - ఆ తప్పుడు సంబంధాలు ఏవి? - క్రమంగా చూస్తాం.
'విలువ' అనేది శ్రమల వల్ల వుంటుంది అనే విషయం ఈ నాడు ఎంతో కొంత తెలిసినా ప్రారంభ కాలాల్లో ఏ మాత్రమూ తెలియదు.
భూమి, మానవశ్రమతో తయారైనది కాదు కాబట్టి, దానికి విలువ వుండదు. అటువంటి భూమిని మానవులందరూ తాము జీవించే సహజ అవసరాలకు వాడుకోవచ్చు అనే అవగాహన మానవులకు ఈ నాటికీ లేదు.
మానవులు జీవించే ప్రతీ అవసరానికీ భూమి ఉపయోగపడుతోంది కాబట్టి, ఆ భూమిని, తమ స్వాధీనం చేసుకోవడమే. అంటే భూమిని తమ 'ఆస్తి'గా చేసుకోవడమే వెనకటి కాలం నుంచీ మానవుల లక్ష్యం అయింది. 'ఆస్తి' అనేది తప్పుడు లక్ష్యం.
భూమి మీద వున్న పళ్ళ వృక్షాలు, భూమి మీద తిరిగే జంతువులు, భూమి మీద ప్రవహించే మహా నదులు, భూమి మీద దొరికే అనేక అవకాశాలు - ఇన్నిటిని ఇచ్చే భూమి కోసం, బతుకుదెరువు కోసం మించిన అత్యాశ, 'బానిస యజమానుల' కాలం నుంచీ ప్రారంభమైంది.
శ్రమలలో కొన్ని, ప్రధానంగా శారీరక శ్రమలు. కొన్ని, ప్రధానంగా మేధా శ్రమలు. ఏ శ్రమలలో అయినా, నైపుణ్యాలు వుండేవీ వున్నాయి. అవి లేనివీ వున్నాయి. శ్రమలు జరిగే కాలాలు కూడా తక్కువలు - ఎక్కువలుగా వున్నాయి.
మురికితో నిండిన నేలని చీపురుతో ఊడ్చే శ్రమలో ఆ నేలే ముడిపదార్థం. ఆ చీపురు పనిముట్టు. ఆ నేలని నీళ్ళతో కడిగితే ఆ నీళ్ళు సహాయక పదార్థం. ఆ శారీరక శ్రమ జరగడానికి ఆ సాధనాలు అత్యవసరం.
విద్యలు బోధించడం, వైద్యాలు చెయ్యడం - వంటి మేథా శ్రమల్ని మొదట నేర్చుకోవడానికి ఎక్కువ కాలము, ఎక్కువ ఖర్చులు అవుతాయి. నేర్చుకున్న ఆ మేథా శ్రమల్ని చెయ్యడానికి కూడా ఎక్కువ కాలము, ఎక్కువ ఖర్చూ అవక తప్పదు. 'ఖర్చు' అంటే శ్రమల ఖర్చే. 'డబ్బు ఖర్చు' అంటే కూడా శ్రమల ఖర్చే.
రంగనాయకమ్మ
(ఇంకా వుంది)