Authorization
Mon Jan 19, 2015 06:51 pm
8
శ్రమలలో శారీరక - మేధా శ్రమల తేడాల్నీ, వాటి మారకం విలువల్లో తక్కువ - ఎక్కువల్నీ, 'శ్రమని దోచడం' అనే ఘోరాన్నీ, దానికి కారణాన్నీ మార్క్సు - ఎంగెల్సులు వివరించే వరకూ ఆ వివరాలు బైటికి రాలేదు.
ఈ విషయాల్ని గ్రహించాలని కొందరు మేథావులు, వందల సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే వున్నా, ఆ మేథావు లెవ్వరూ వాటిని వివరించలేక పోయారు. దీనికి సరైన కారణాలు వున్నాయి.
ఆ కారణం ఏమిటంటే.. మార్క్సు - ఎంగెల్సులు పెట్టుబడిదారీ విధానపు ప్రారంభకాలంలో వున్న మేథావులు. ఆ కాలంలో ఆ ఇద్దరే తప్ప ఇతర మేథావులెవ్వరూ లేరనికాదు. అయినా ఆ ఇతర మేథావుల వల్ల జరగని విషయాలు మార్క్సు - ఎంగెల్సుల వల్లనే జరిగాయి. అది ఆ ఇద్దరి విశేష కృషి ఫలితమూ, వారి హేతుబద్ధ అవగాహనా విధానమూ కావచ్చు.
ఒక విషయం చూడండి! ఈ మార్క్సు - ఎంగెల్సు లిద్దరూ బానిస యజమానుల కాలంలోనే వుండి వుంటే, అంటే పెట్టుబడిదారీ విధానపు కాలం కన్నా వెనకటి కాలంలోనే వుండి వుంటే వీరి వల్ల కూడా ఏ కొత్త గ్రహింపులు జరిగేవి కావు. ఈ మేథావులు కూడా గత కాలపు మేథావుల కోవలోకే కలిసి పోయేవారు.
మార్క్సు - ఎంగెల్సులు గ్రహించిన 'శ్రమ దోపిడీ' అంటే ఏమిటో తర్వాత వివరంగానే చూస్తాం. కానీ, మొదట ఇక్కడ చెప్పుకోవలిసింది ఏమిటంటే.. 'శ్రమ దోపిడీ' అనేది బానిస యజమానుల సమాజంలోనే ప్రారంభమైంది. అయితే ఆ విషయాన్ని గ్రహించడం 'పెట్టుబడిదారీ విధానం' ప్రారంభమయ్యే దాకా ఎందుకు జరగ లేదు? - ఇదీ స్పష్టంగా తెలుసు కోవలిసిన విషయం.
'శ్రమ దోపిడీ' అనేది యజమానుల ద్వారా జరుగుతుందని తెలియాలి. మానవుల మధ్య ఏ తేడాలు లేని సమాజంలో 'యజమానులూ × శ్రామికులూ' అనే తేడాలు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయో మొదట తెలియాలి. అనేక వేల సంవత్సరాలకు పూర్వం వెనకటి కాలంలో మానవులు 'తెగలు, తెగలు'గా జీవించేవారు. ఆ మానవులు వృక్షాలు - జంతువులు - నీళ్ళ మడుగులు - వంటి ప్రకృతి వనరుల కోసం జంతు స్థాయి కొట్లాటలతో గడిపేవారు. గెలిచిన తెగ వారు ఓడిన తెగ వారిని చంపివెయ్యడమో, లేకపోతే వారిని తమ తెగలోకి చేర్చుకోవడమో ఏదో ఒకటి జరిగేది. కొన్ని వేల సంవత్సరాల పాటు అదే జరిగిన తర్వాత, మళ్ళీ మళ్ళీ జరిగే తెగల కొట్లాటల్లో గెలిచిన తెగల వారికి కొత్త 'తెలివి' ప్రారంభ మైంది. అదేమిటంటే ఓడిన తెగ వారిని చంపెయ్యడమో, తమతో సమానులుగా తమ తెగ సభ్యులుగా చేర్చు కోవడమో ఏదీ కాదు. ఓడిన తెగ వారిని గెలిచిన తెగ కోసం అవసరమైన పనులన్నీ చేసే వారిగా వుంచుకోవచ్చుననే 'తెలివి' గెలిచిన వారికి ప్రారంభమైంది. దాని వల్ల గెలిచిన తెగ వారు 'యజమానులు'గా మారితే, ఓడిన తెగ వారు 'బానిసలు'గా మారారు. ఆ రకంగా మానవుల్లో యజమాని - బానిసల 'వర్గాలు' ప్రారంభమయ్యాయి. ఆ గెలిచిన తెగకంతటికీ కావలిసిన వ్యవసాయం శ్రమలు. వడ్రగం వంటి చేతి పనులు యజమానుల కుటుంబాలకు అవసరమైన ఇళ్ళ శ్రమలు - సమస్త శ్రమలు చెయ్య వలిసిన బాధ్యతలన్నీ బానిస స్త్రీ, పురుషులవే. బానిసల శ్రమలు, రాత్రింబవళ్ళు జరగ వలిసిందే. యజమానులకు కోపాలు వస్తే బానిసల్ని చంపివేసే హక్కు, యజమానులకు వుంటుంది.
ఎన్నడూ లేని రాజ్యాంగం ప్రారంభం
సమాజంలో ఆ నాటి వరకులేని 'రాజ్యాంగం' అనేది యజమానుల వర్గ ప్రయోజనాల కోసం, అందుకు అవసరం అయిన నిబంధనలతో ఏర్పడింది. ఆ నిబంధనలన్నీ బానిస మానవులు, యజమానుల పాదాల దగ్గిర వినయ విధేయతలతో జీవించాలని ఆజ్ఞాపించేవే.
(బానిసల జీవితాల్ని తెలుసు కోవడానికి 'స్పార్టకస్' అనే బానిస వీరుడి పేరుతో వున్న కథల్ని చదివితే చాలు. ఈ విషయాలు ఇక్కడ ఇంతకన్నా ఎక్కువగా చెప్పుకోలేము.) ఇక్కడ ప్రధానంగా తెలుసు కోవలిసింది మార్క్సు - ఎంగెల్సులు గ్రహించిన 'శ్రమ దోపిడీ' సంగతి.
'శ్రమ దోపిడీ' అనేది ఎలా జరుగుతుందో తెలియాలంటే ప్రధానంగా 3 విషయాలు తెలియాలి.
(1) ఒక సంవత్సర కాలంలో బానిస వర్గ జనం చేసిన 'శ్రమల' విలువల మొత్తం ఎంత? (2) బానిసలు చేసిన 'శ్రమల' మొత్తంలోనుంచి ఆ శ్రమలు చేసిన బానిసల పోషణకు అందేది ఎంత? (3) బానిసల పోషణకు అందగా మిగిలేది ఎంత?
ఈ మూడు విషయాలు లెక్కలతో సహా తెలిస్తేనే 'శ్రమ దోపిడీ జరుగుతోంది' - అనే రహస్యం బైట పడుతుంది. పెట్టుబడిదారీ విధానానికి పూర్వం మొదటి విషయం కొంతయినా తెలిసినా రెండో విషయం ఏ మాత్రమూ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే బానిసలు గానీ, కౌలు రైతులు గానీ చేసే 'శ్రమల విలువల'లో నుంచి తిరిగి వారికి చేరే పోషణకు ఏ లెక్కలూ ఉండవు. ఇక అలాంటప్పుడు మూడో విషయం తెలిసే అవకాశం అసలే వుండదు. ఈ లెక్కలు పెట్టుబడిదారీ విధానంలోనే ప్రారంభమవుతాయి. ఏ విధంగా నంటే.. శ్రామికులకు అందే 'డబ్బుతో ఇచ్చే జీతాల' పద్ధతి వల్ల.
'జీతం' అనేది 'డబ్బు'గా వుంటే?
ఉదాహరణ: ఒక సంవత్సర కాలంలో శ్రామిక వర్గ జనం అంతా చేసిన శ్రమల విలువల మొత్తాన్ని 100 రూపాయలు అనుకుందాం. శ్రామిక జనం చేసిన 'శ్రమల విలువ' అలా వుండగా అంత శ్రమ చేసిన వారికి వారి శ్రమ లోనుంచి అందే విలువ 20 అనుకుందాం. అంటే శ్రామికులకు తమ శ్రమలలో నుంచి తమకు అందకుండా పోయిన భాగం 80.
శ్రామికులకు అందని భాగం ఎవరికి పోతుంది? శ్రామికుల యజమానులకే కాక ఇంకెవరికి?
పెట్టుబడిదారీ విధానంలోనే యజమాని దగ్గర శ్రమలు చేసే శ్రామికులకు యజమాని నుంచి అందేదానికి 'జీతం' అనే పేరు వుంటుంది.
పెట్టుబడిదారీ విధానానికి పూర్వం బానిసలకు గానీ, కౌలు రైతులకు గానీ వారి శ్రమలో నుంచి వారికి అందేదానికి ఏ పేరూ ఉండదు. బానిసలు శ్రమలు చెయ్యడానికి రోజూ బతికి వుండాలి. కాబట్టి వారి పోషణ కోసం యజమానుల నుంచి కొన్ని ఉత్పత్తులు, పదార్థాలు వారికి అందుతూ వుంటాయి. ఆ అందేది 'డబ్బు' రూపంలో కాదు! కడుపు నిండా తిండీ, ఒంటి నిండా చాలీ చాలని గుడ్డలు, నిటారుగా లేచి నిలబడి తిరగలేని గుడిసెలు - ఇవీ, ఆ శ్రామికులకు దొరికే పోషణలు! పోషణ కోసం ఎదురు తిరిగితే 'కుక్కలతో పీకించడాలు!' తాము చేసే శ్రమ విలువ అంతా తమకు అందడంలేదనీ, తమకు అందేది అత్యల్పమని, తమ శ్రమల్లో రోజూ అత్యధికభాగం యజమానులకే పోతూ వుంటుందనీ - ఈ ముఖ్య విషయాలు శ్రామికులకు ఈ నాటికీ తెలియవు కదా? అలాంటప్పుడు బానిసలకు, కౌలు రైతులకు ఈ విషయాలు తెలియడం ఎలా సాధ్యం? అది అసలే అసాధ్యమైన విషయం. పూట పూటా కడుపులు నిండా తిండిలేని శ్రామికులు అది తమ 'దురదృష్టం' అని నమ్ముతారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. తమ దురదృష్టాలకు యజమానులే కారణం - అని ఆ అమాయకులకు ఆ నాడు తెలిసే మార్గం లేదు. ఆ అమాయకులు యజమానులకు వినయ విధేయతలతో, భయ భక్తులతో సేవలు చేస్తూ వుంటారు.
సంతల్లో మనుషుల అమ్మకాలు!
బానిసల్ని యజమానులు సంతల్లో నిలబెట్టి అమ్మే - కొనే సమాజం ఈనాడు లేదు. అది బానిసల పోరాటాల వల్లనే గతించింది. ''టామ్ మామ ఇల్లు'' అనే నవలా పరిచయంలో ఈ విషయాలెన్నో తెలుస్తాయి.
(ఇంకా వుంది)
రంగనాయకమ్మ