Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రపంచ మంతా ఏనోట బట్టినా కరోనా కరోనా కరోనా. ఎక్కడో చైనాలో పుట్టి ఖండాలు, సముద్రాలు దాటి ప్రపంచమంతటా విస్తరించి ప్రజల ప్రాణాలు బలిగొంటున్న మహ మ్మారి కరోనా.దీనిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు, వార్తలు పత్రికలూ, టీవీ చానళ్లలో వస్తున్నాయి. ఇది ఆరంభం కాదు.. అంతం కాదు. గతంలోనూ ఇలాంటి మహమ్మారి రోగాలు వచ్చాయి - భవిష్యత్లో రావని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. అయితే మహమ్మారి ప్రభావం, మోతాదులో తేడాలుండొచ్చు. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవాలు. అది సైన్స్ నిర్ధారణకు ఎంతమాత్రం నిలబడవని తెలిసి కూడా రావడం అత్యంత గర్హనీయం. ఒక వైపున మహమ్మారి బెంబేలెత్తిస్తుంటే జాగ్రత్తలు చెబుతూనే ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని నింపాల్సిన తరుణంలో ఇలాంటి కథనాలు రావడం ఎంత మాత్రం సరైనది కాదు. చేతిలో కలం, నోటి వాగ్ధాటి ఉన్నాయని విర్రవీగి కథనాలు రాసేవారు ఎవరి ప్రయోజనం కోసం అలా చేస్తున్నారో ఆలోచించాలి. అలా ఆలోచించని వారిని ఏమిచేయాలో పాఠకులు, ప్రేక్షకులే ఆలోచించాలి తప్ప వాటిలో పడిపోవద్దని సవినయంగా విజ్ఞప్తి.చికిత్స కంటే నివారణే ముఖ్యం అనేది కొత్తది కాదు. కానీ దాని ఆచరణలో పాలకుల అంతులేని నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. మా చిన్నప్పటి స్కూల్ పుస్తకాల్లోని దీర్ఘ దర్శి, దీర్ఘ సూత్రుడు ప్రాప్త కాలజ్ఞుడు కథ గుర్తొస్తున్నది. రానున్న ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం - ప్రమాదం దరికి చేరినప్పుడైనా వెంటనే తగు చర్యలు తీసుకోవడం, ప్రమాదం ముంచెత్తితే బెంబేలెత్తి పోయి చేతులెత్తేయడం ఆ కథ సారాంశం. నేటి కరోనా పట్ల వివిధ దేశాధినేతల వైఖరి ఆ కథను గుర్తుకు తెస్తున్నది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే తక్షణ నివారణ, వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకున్న చైనా, వియాత్నం, క్యూబా, దక్షి ణ కొరియా దేశాలు ఒక వైపు ఉండగా, అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాలు అలా చేయని కారణంగా గడగడ లాడుతు న్నాయి. ఇప్పటికీ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వ వైఖరితో ఆ దేశ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ వాస్తవాలను మరచి చైనాపై విషం గక్కడాన్ని ఏమనాలి? ప్రపంచంలోని వివిధ దేశాలలలో వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నాయి. భారతదేశంలో మినహా మిగతా ప్రపంచంలో శాఖాహారం దొరకడం అత్యంత కష్టం (భారత్ రెస్టారంట్లలో మినహా). ప్రపంచం సంగతెందుకు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే అలవాట్లు ఉన్నయా? కేరళ, తమిళనాడు ప్రజలు సాంబారులో కూరలు తింటారు. ఏపీ, తెలంగాణా లలో ఆలా తింటారా? ఒకరి అలవాట్లను ప్రశ్నిం చే అధికారం మరొకరికి ఎక్కడిది? ఇటీవల దేశం లోని ప్రజలు ఏమితినాలో, ఏ బట్టలు వేసుకోవాలో కాషాయీయులు నిర్ణయిస్తామంటున్నారు. ఇప్పుడు చైనా అలవాట్లను విమర్శించే వారు కూడా కాషాయీయులేనా?
ప్రజలందరికి తిండి, బట్ట, నివాసం, ఉపాధి కల్పించి ప్రజల జీవన పరిస్థితులను మెరుగుచేయ డమే సోషలిస్ట్ దేశాల లక్ష్యం తప్ప ప్రజలకు కీడు, ప్రాణహాని తలెపెట డం లాంటి వినాశకర చర్యలకు ఒడిగట్టిన చరిత్ర ప్రపంచంలో సోషలిస్టు దేశాలకు లేదు. ఉండబోదు. అలా ఉంటే అది సోషలిస్ట్ దేశమే కాదు. తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు కంటే గొప్పగా ప్రేమ, అభిమానం, వాత్సల్యం పంచె విశాల దృక్పథానికి ప్రతీకే ''కామ్రేడ్'' అనే పదం. అలాంటి కమ్మూనిస్టులపై నిందా రోపణలు చేయడం సూర్యుడిపై ఉమ్మి వేయడమే అవుతుంది. ప్రతీదాన్ని స్వంత లాభాపేక్షతో చేయడం పెట్టుబడిదారీ సమాజ సహజ లక్షణం. ఇందుకు అవసరమైతే ప్రజల ప్రాణాలను సహితం పణంగా పెట్టడానికి వెనుకాడదు. సంక్షోభాన్ని ఆదాయ వన రుగా మలుచుకో వడంపై దాడి చేయడం అవసరం కాదా? ఈ సంక్షోభ కాలంలో మాస్క్లు, శానిటై జర్స్, ఇతర క్రిమి సంహారక వస్తువులు అత్యవసరం. దాన్ని అవకాశంగా తీసుకోని అనేక రెట్లు ధరలకు అమ్మి జనాన్ని కొల్లగొడుతున్న దుర్మార్గుల చర్యలపై చైనాపై దాడి చేసే మేథావులు తమ కత్తులను ఎక్కు పెట్టాలి. వారిని చీల్చి చెండాడేటట్టు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. నేటి పరిస్థితుల్లో ప్రజలకు కావలసింది ఇదే. అయితే కేంద్ర ప్రభుత్వమే ఇందులో ప్రధమ ముద్దాయి. కరోనా ప్రమాద సమ యంలో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు సగానికి పడిపోతే మన భారత ప్రభుత్వం సుంకాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచి ప్రజలను కొల్లగొట్టి తన ఖజానాను నింపుకుంది. ఇది అత్యంత కిరాతక చర్య. ప్రభుత్వమే ఇంతటి కిరాతకానికి పాల్పడితే తాను ఇతరులను కట్టడిచేసే నైతిక ధైర్యం ఎక్కడనుంచి వస్తుంది. కొన్ని పెట్టుబడి దారి దేశాలు సహితం ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో ధరల నియం త్రణలకు చర్యలు తీసుకున్నాయి. కానీ అందుకు భిన్నంగా దేశంలో అడ్డగోలుగా ధరలను కృత్రిమంగా పెంచుతున్న వారికి వ్యతిరేకంగా ప్రజలను మేలుకొ ల్పాలే తప్ప ప్రజలను పక్కదారి మళ్లించడానికి చేసే చర్యలు కిరాతకులకు మరింత ఊపు నిస్తాయని గుర్తించాలి. ప్రణాళికా బద్ధ చర్యలు: ఏ పనికైనా ముంద స్తు ప్రణాళిక అత్యంత ఆవశ్యకం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇందులో చెప్పలేనంత నిర్లక్ష్యం వహిం చింది. ఉన్న ఫళంగా 21 రోజులు లాక్డౌన్ ప్రక టించింది. దీంతో దినసరి, వలస కార్మికుల అవస్థలు వర్ణనాతీతం. పత్రికల్లో వస్తున్న కథనాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వారి బాధలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఎంత మంది వలస కార్మికులున్నారో కనీసం ప్రభుత్వం వద్ద లెక్కలు కూడా లేవని నేటి ఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన ఘనాపాటీలకు ప్రణాళికలు ఎక్కడనుంచి వస్తాయి? కేరళ రాష్ట్ర ప్రభుత్వం నేటి కరోనాకు మునుపే వలస కార్మికులకు శాశ్వత నివాసాలలో పాటు వారిని లెక్కించి వారికి కొన్ని హక్కులను ఇచ్చింది. వారిని కూడా తమ రాష్ట్ర పౌరులలాగే పరిగణించింది. కానీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయో నేటి ఘటనలు తెలియజేస్తున్నాయి. కనీసం ప్రాణా లను ఫణంగా పెట్టి నేడు సేవలందిస్తున్న వైద్య, పారిశుధ్య, రవాణ తదితర ఉద్యోగులు, కార్మికులకు రక్షణ పరికరాలు అందించడం, రవాణా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటే ఇంతకంటే పాశవిక చర్య మరొకటి ఉండదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరవాలి. బాధ్యతగా వ్యవహరిం చాలి. రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకోవడం నేరపూరిత చర్య అవుతుంది. క్రింది తక్షణ, శాశ్వత చర్యలు చేపట్టాలి.
తక్షణ చర్యలు: 1. అత్యవసర సేవలందించే వారికి తగిన రక్షణ సామాగ్రిని అవసరమైన మేరకు సమకూర్చాలి. 2. దినసరి, వలస కార్మికులకు భోజన వసతి ఏర్పాట్లు చేయాలి. ఇందుకు కళాశాలలు, పాఠశాలలు, కళ్యాణమండపాలు, పెద్ద పెద్ద ప్రాంగణాలు ఎక్కడ ఉంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసికోవాలి. సీపీఐ(ఎం) తెలంగాణ ాఖ ఈ పాటికే వారి కార్యాలయాలను వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేసి ఉంది. 3. నిత్యావసరాలతో పాటు అన్ని వినియోగ సరకుల ధరలను కనీసం జనవరి 2020 నాటి స్థితికి తీసుకురావాలి. 4. పేదలందరికీ మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులను ఉచితంగా సరఫరా చేయాలి. ఇందుకు క్యూలు కట్టి తోపులాటలకు అవకాశం లేకుండా ఇంటికే సరఫరా చేయాలి. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవాలి. వాలంటీర్ల సహకారం తీసికోవాలి. 5. కరోనా వైద్య పరీక్షలు అనుమానితులందరికి ఉచితంగా చేయడానికి అవసరమైన కిట్లు, సిబ్బంది, తదితర ఏర్పాట్లు చేయాలి. ఇందుకు ప్రయివేటు ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలి.
శాశ్వత చర్యలు: 1. రాష్ట్రాల వారి దినసరి, వలస, స్వయం ఉపాధి కార్మికుల లెక్కలు సేకరించాలి. 2. వారికి ఉపాధి, వైద్యం, పిల్లల చదువులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. 3. ఇందుకు అవసరం అయ్యే నిధుల కోసం స్వదేశీ, విదేశీ సంస్థల మిగులు (లాభాలు)పై పన్నును 50శాతం వంతున కనీసం 4 సంవత్సరాల పాటు వసూలు చేయాలి. 4. సాలీనా కోటి రూపాయల పైబడి ఆదాయం వచ్చే ధనవంతులపై పన్నును ఇప్పటికి రెట్టింపు చేసి రెండేండ్లపాటు వసూలు చేయాలి. 5. విపత్కర, ప్రమాదకర పరిస్థితులలో ప్రజల భద్రతకు తగిన ముందస్తు జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళికలను తయారుచేయాలి. ఇవి నేటి కరోనా మహమ్మారి నేర్పుతున్న పాఠాలు. వీటికోసం దేశం యావత్తు ఒక్కటై ముందుకు కదలాలి. పత్రికలు, టీవీ చానళ్లు, మేథావులు అందుకు అవసరమైన, ప్రోత్సాహం, మద్దతు, సహకారం అందించాలి. ఇదే నేడు మనందరి కర్తవ్యం కావాలి.
ఆర్. లక్ష్మయ్య
సెల్: 9971511954