Authorization
Mon Jan 19, 2015 06:51 pm
9
పెట్టుబడిదారీ సమాజం ఎప్పుడు?
'కౌలు రైతుల' సేవలు పొందే భూస్వాముల సమాజం ఉంటూ వుండగానే పెట్టుబడిదారుల సమాజం ప్రారంభమైంది.
'పెట్టుబడి' పెట్టేవాడు పెట్టుబడిదారుడు.
'పెట్టుబడి' అంటే 'కొంత డబ్బు' - అని పెట్టుబడిదారుడు అనుకుంటాడు. అతని ఆజ్ఞలతో శ్రమలు చేసే శ్రామికులే కార్మికులు. కార్మికులు కూడా అలాగే అనుకుంటారు. కానీ నిజమైన అర్ధం 'పెట్టుబడి' అంటే 'ఉత్పత్తి సాధనాలు'. 'భూమి' కూడా ఉత్పత్తి సాధనమే. కానీ భూమి 'పెట్టుబడి'లో భాగం కాదు.
దుస్తుల 'పరిశ్రమ'ని పెట్టదలిచిన పెట్టుబడి దారుడు 'కొంత డబ్బు'ని 'పని స్థలం'లో నేల మీద జిమ్మితే, దుస్తులు తయారవుతాయా? అలా జరగదు. ఆ 'పని స్థలం'లో 'దుస్తుల' తయారీకి అవసరమైన 'ఉత్పత్తి సాధనాలే' వుండాలి. అంతేగాక కుట్టు పనులు చేసే కార్మికులు (శ్రామికులు) కూడా ఉండాలి.
పెట్టుబడిదారీ విధానంలో కొత్త విషయం
పని స్థలంలో శ్రమలు చేసే కార్మికులకు యజమాని ఇచ్చేది డబ్బు రూపంలో వున్న 'జీతాలు'. ఈ డబ్బు జీతాల పద్ధతి గత కాలంలో లేదు. గత కాలాల్లో బానిసలకు యజమానులు ఇచ్చినవి కొన్ని 'తిండి' పదార్థాలు, కొన్ని గుడ్డలు, గుడిసెలు.
బానిసలు చేసే శ్రమల విలువలు గానీ, వారికి అందే పోషణల విలువలు గానీ, ఏవి ఎంతెంత విలువలతో ఉంటాయో బానిసలకూ తెలీవు, యజమానులకూ తెలీవు.
ఏ శ్రమలైనా బానిసలే చేస్తారు, యజమానులు చెయ్యరు.
కౌలు రైతులే చేస్తారు, భూస్వాములు చెయ్యరు.
పెట్టుబడిదారీ విధానంలో కూడా శ్రమలన్నీ కార్మికులే చేస్తారు, యజమానులు చెయ్యరు.
పెట్టుబడిదారీ విధానంలో ప్రారంభమైన కొత్త విషయం కార్మికులకు 'డబ్బు జీతాలే'. అసలు 'జీతం' అనే పేరు ప్రారంభమైనది పెట్టుబడిదారీ విధానంలోనే.
శ్రమలు చెయ్యని పెట్టుబడిదారుడు కార్మికుల శ్రమలలో నుంచి అందుకున్న భాగంతోనే తన సిరి సంపదల జీవితం గడుపుతాడు. దీని పేరే 'శ్రమ దోపిడీ'. కార్మికుల శ్రమ విలువలో నుంచి అత్యధిక భాగాన్ని దోచడం ఇది. ఈ దోపిడీ విధానం బానిస యజమానుల కాలం నుంచి ప్రారంభమైనదే.
మార్క్సు ఎంగెల్సులు కనిపెట్టిన సరికొత్త విషయం ఈ 'శ్రమ దోపిడీ' గురించే.
ఈ 'శ్రమ దోపిడీ' అనేది బానిస యజమానుల కాలంలో ప్రారంభమై, ఆ నాటి నుంచి ఈ నాటికి కూడా యజమానుల వర్గం ద్వారా ఇంకా జరుగుతూనే వుంది. యజమానుల వర్గం ఇంకా ఎంత కాలం దాకా చెక్కు చెదర కుండా స్థిర పడి వుంటుందో ఆ నాటి దాకా అది ఇలా సాగుతూ వుండేదే. 'యజమాని వర్గం' అనేది ఎప్పటికీ అంతరించక పోతే 'శ్రమ దోపిడీ' అనేది కూడా ఎప్పటికీ అంతరించదు. ఎందుకంటే యజమాని వర్గం జీవించేది 'శ్రమ దోపిడీ' మీదే కాబట్టి.
ప్రకృతిలో కాలాలైతే అవి మారిపోతూ వుంటాయి. వేసం కాలం, శీతా కాలం, వర్షా కాలం - అవే మారతాయి. అమావాస్యా, పౌర్ణమీ రాత్రి, పగలు - ఇలా అవే మారుతూ వుంటాయి. కానీ సమాజంలో మార్పులు అటువంటి సహజత్వాలు కావు.
ఒక ప్రశ్న:
'శ్రమ దోపిడీ' ఆగిపోతే యజమాని వర్గం అంతరిస్తుందా, లేకపోతే యజమాని వర్గం అంతరిస్తే 'శ్రమ దోపిడీ' ఆగిపోతుందా? - ఏది దేని మీద, ఆధారపడి వుంటుంది?
ఈ ప్రశ్నకు జవాబు దొరకాలంటే 'శ్రమ దోపిడీ' అనేది ఎలా జరుగుతూ వుంటుందో మొదట తెలియాలి. దీన్ని బట్టి సమాజంలో వున్న మిగతా విషయాలన్నీ తెలుస్తాయి.
ఏదో ఒక పెట్టుబడిదారీ 'పరిశ్రమ'తో ప్రారంభించాలి. 'దుస్తుల్ని' కుట్టు శ్రమలతో తయారు చేయించే పరిశ్రమని. ఈ దుస్తులు, పెట్టుబడిదారుడి స్వంత కుటుంబంలో వారి అవసరాల కోసం కాదు, పూర్తిగా 'అమ్మకాల' కోసమే.
అమ్మకాల కోసం తయారయ్యే ఉత్పత్తిని 'సరుకు' అనాలి. అమ్మకాలు జరిగిపోతే ఆ సరుకు పేరు మామూలు వస్తువే, మామూలు ఉత్పత్తే.
పెట్టుబడిదారుడు తయారు చేయించే 'సరుకు' దుస్తులే కాబట్టి వాటిలో నించి పెట్టుబడిదారుడి కుటుంబం ఒక్క 'దుస్తుని' అయినా వాడదని కాదు. ఆ పరిశ్రమలో నెలకి వెయ్యి సరుకులు తయారవుతూ వుంటే, ఆ కుటుంబం తమ స్వంతానికి ఒక నెలలో ఆ 'వెయ్యి'లో నించి ఎన్ని వాడుతుంది? ప్రతి నెలా 100 దుస్తుల్ని తీసుకున్నా, మిగిలిన 900 దుస్తుల్ని అమ్మవలిసిందే కదా? ఇలాగే ఏ 'పరిశ్రమ' అయినా అమ్మకం కోసమే సరుకుని తయారు చేయిస్తుంది.
'అమ్మకాల' కోసం సరుకుని తయారు చేసే కార్మికులకు 'ఉత్పాదక కార్మికులు' అనే పేరు వుంటుంది. వారి శ్రమ 'ఉత్పాదక శ్రమ'. ఇది పెట్టుబడిదారీ విధానంలో వుండే పేరు.
ఉదాహరణ తేలికగా వుండడం కోసం ఒకే ఒక 'ఉత్పత్తిని' తీసుకుందాం. ఆ ఉత్పత్తి 'ఒక చొక్కా'. ఈ చొక్కాని మనం దుస్తుల్ని అమ్మే షాపులో కొన్నాం. ఏ ఉత్పత్తిని కొనాలన్నా దానికి ఒక 'ధర' ఉంటుంది కదా? మనం కొన్న చొక్కా ధర 120 రూపాయలు - అనుకుందాం. ఆ డబ్బు ఇచ్చి ఆ చొక్కాని తళ తళ మెరిసే కవరుతో సహా కొన్నాం. ఆ కవరుని చేసిన ఖర్చు కూడా ఆ 120 ధరలో వుంటుంది. కొన్న వస్తువుని ఆ షాపు నుంచి ఇంటికి తెచ్చుకునే 'రవాణా శ్రమ' మనదే. ఏ సరుకుని అయినా మన ఇంటి ముందే కొన్నామంటే? కూరగాయల్నో, చీపుళ్ళనో ఇంటి ముందే కొన్నా మనుకోండీ. ఆ సరుకులు ఎక్కడో చేలో పెరిగి, అక్కడి నుంచి మన ఇంటి ముందుకు వచ్చాయంటే ఆ రవాణా శ్రమ, ఆ సరుకుల్ని తెచ్చి అమ్మిన మనిషిదే.
'ధర' ఎలా ఏర్పడుతుంది?
షాపులో మనం కొన్న చొక్కా ధర 120 రూపాయలు కదా? ఈ ఉత్పత్తికి ఈ 'ధర' ఎలా ఏర్పడింది? - ఈ సంగతి ఆ చొక్కాని అమ్మిన వాళ్ళకీ తెలియదు. దాన్ని కొన్న మనకీ తెలియదు. కొనే సరుకుకి 'ధర' ఎంత వుంటే అంతనీ చెల్లించి దాని తీసుకుంటాం అంతే.
'చొక్కా'కి 120 ధర ఉన్నదంటే అది ఎలా ఏర్పడినట్టు? షాపు వర్తకుడు ఆ చొక్కాకి తన కిష్టమైన ధరని నిర్ణయించాడనా?
సరుకు 'ధర' గురించి తెలుసుకుంటే 'ఆర్ధిక శాస్త్రాన్ని అంతా' తెలుసుకున్నట్టే.
చొక్కా ధరని తెలుసు కోవాలంటే, ఆ ఉత్పత్తి ఏ యే ఉత్పత్తి సాధనాల తోడ్పాటుతో తయారైందో మొదట చూడాలి.
మనం దుస్తుల 'పరిశ్రమ'ని తీసుకున్నాం. 'చొక్కా'ని కుట్టి తయారు చెయ్యాలంటే దాని కోసం ఏ యే ఉత్పత్తి సాధనాలు కావాలి? - బట్ట, దారము, గుండీలు - ఇవి చొక్కాగా మారే ముడి పదార్థాలు. కత్తెరా, సూదితో వున్న కుట్టు మిషనూ, పని స్థలంగా వుండే భవనము - ఇవి పనిముట్లు. 'కుట్టు మిషన్' కదలడానికి అవసరమయ్యే కరెంటు - ఇది ఒక సహాయక పదార్థం.
ఈ ఉత్పత్తి సాధనాలన్నీ 'కుట్టు పని' జరిగే 'పని స్థలం'లో సిద్ధంగా వుండాలి. ఈ సాధనాలన్నీ 'పని స్థలం'లో వుంటేనే అక్కడికి కుట్టు శ్రమ చేసే కార్మికులు వస్తారు.
'చొక్కా'ని కుట్ట వలిసిన కార్మికుడు (లేదా కార్మికురాలు) పని స్థలంలో వున్న బట్టని కత్తెరతో కత్తిరిస్తు తన శ్రమ మొదలు పెడతాడు. తర్వాత కుట్టు పని చేస్తూ బట్టని చొక్కాగా తయారు చేస్తాడు. చిట్ట చివరికి, చొక్కాకి గుండీలు కుట్టడంతో చొక్కా పని ముగుస్తుంది. (ఇంకా ఉంది)
రంగనాయకమ్మ