Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభివద్ధి చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగాన్ని డిజిటలైజేషన్ వైపు తీసుకుని పోతోంది. ఇప్పుడు కరోనా ప్రభావంతో వచ్చిన మార్పుల్లో భాగంగా విద్యా రంగం ఆన్లైన్ తరగతులు, వర్చువల్ సమావేశాల వైపు వేగంగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. భవిష్యత్తులోనూ ఆన్లైన్ విద్య కొనసాగించేందుకు భారతదేశంలోనే గాక, ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు సిద్ధపడుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 191 దేశాల్లోని 158కోట్ల విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీన్ని అధిగమించడానికి ఇప్పటికే పలు విద్యా సంస్థలు ప్రత్యామ్నాయ బోధన విధానానికి చర్యలు చేపడుతున్నాయి. మన దేశంలోనూ సంప్రదాయ డిగ్రీలు కాకుండా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాయి. ప్రయివేటు కార్పొరేట్ విద్యా సంస్థలైతే పాఠశాల విద్యలో ఈ ఆన్లైన్ తరగతుల కోసం జూమ్ లాంటి మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి విర్చువల్ తరగతులు ఏర్పాటు చేసి, ఆన్లైన్ విద్యావిధానం అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలోనూ విద్యార్థుల కోసం టీవీ ఛానళ్ల ద్వారా, రేడియో కార్యక్రమాల ద్వారా ఆన్లైన్లో పాఠాలు అందించడానికి పలు చర్యలు తీసుకున్నారు. మనదేశంలో దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యలో ఒక ప్రత్యేక విధానం ఉండాలనే ఆలోచనతో కేంద్రం 'భారత్ పఢే' పేరుతో దేశంలో ఈ-లెర్నింగ్ విద్యా విధానం ఉండాల్సిన తీరుపై విద్యావేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్ల తప్పనిసరి చేస్తున్న ఆన్లైన్ లెర్నింగ్కు భారత ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు సిద్ధంగా లేవని క్వాక్వెరెల్లి సైమండ్స్ (క్యూఎస్) నివేదించింది. ఆన్లైన్ తరగతులు స్ట్రీమింగ్ కావాలంటే మెరుగైన బ్రాడ్ బ్యాండ్ రీచ్, నిరంతర విద్యుత్ సరఫరా అవసరం అని ఒక సర్వే ద్వారా కనుగొన్నారు. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేటప్పుడు విద్యార్థులు ఎదుర్కొంటున్న కనెక్టివిటీ, సిగల్ సమస్యలని నివేదిక ఎత్తి చూపింది. భారతదేశంలో దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం పరంగా మౌలిక సదుపాయాలు నాణ్యమైన స్థితిని సాధించలేదని సర్వే సూచించింది. తగినంత విద్యుత్ సరఫరాను అందించడంలో, సమర్థవంతమైన డేటా కనెక్టివిటీ అందించడంలో వెనుకబడి ఉందని ఈ నివేదిక తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా, తరగతుల పంపిణీ విధానంగా సాంప్రదాయ ఫేస్ టు ఫేస్ (ఖీ2ఖీ) నుంచి ఆన్లైన్ ప్లాట్ఫారమ్కు ప్రపంచం భారీగా మారిపోయింది. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల, ఉపన్యాసాల పంపిణీ కోసం ఆన్లైన్ ప్లాట్ఫారమ్పై పూర్తిగా ఆధారపడటం సుదూర కల అనిపిస్తుంది. హౌమ్ బ్రాడ్ బ్యాండ్ను ఉపయోగించిన వారిలో, 3శాతం మంది కేబుల్ కోత సమస్యలను, 53శాతం మంది పూర్ కనెక్టివిటీని, 11.47శాతం విద్యుత్ సమస్యలను, 32శాతం సిగల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొబైల్ హాట్ స్పాట్ విషయానికి వస్తే, 40.18శాతం పూర్ కనెక్టివిటీని, 3.19శాతం విద్యుత్ సమస్యలను, 56.63శాతం సిగల్ సమస్యలను ఎదుర్కొం టున్నారు. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించే ముందు దేశంలోని పాఠశాలలు, కళాశాలలు మూసివేయ బడ్డాయి. లాక్డౌన్ ఇప్పుడు మే 17వరకు పొడిగించారు. కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బలంగా దెబ్బ తిన్న రంగాలలో విద్యారంగం ఒకటి. ఇటువంటి సమయంలో, ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యా లయాలు, విద్యా సంస్థలు ఆశ్రయిస్తున్న ఏకైకమార్గం ఆన్లైన్లో పనిచేయడం మాత్రమే అని నివేదిక తెలిపింది. డిగ్రీ కోర్సులను కూడా ఆన్లైన్లో నిర్వహించాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యూనివర్సిటీస్ ఇన్ 2030 పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలకు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థులతో మాట్లాడినట్టు పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలేమిటంటే ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు 2030 నాటికి ఆన్లైన్లో పూర్తిస్థాయి డిగ్రీ కోర్సులు ప్రవేశపెడతాయని అంగీకరీస్తారా అని ప్రశ్నించగా, 5శాతం మంది అసలే అంగీకరించబోమని చెప్పగా, 13శాతం మంది అలా కుదరకపోవచ్చని పేర్కొన్నారు. 19శాతం మంది ఏమీ చెప్పకపోగా, 45శాతం మంది అవునని, 18శాతం మంది కచ్చితంగా అవునని స్పష్టం చేశారు. పూర్తి స్థాయి డిగ్రీ కోర్సులను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు ఆన్లైన్లో ప్రవేశ పెడతాయని చెప్పిన వారిలో యూరప్లో 54శాతం మంది ఉండగా, ఉత్తర అమెరికాలో 79శాతం మంది ఉన్నారు. ఆసియా దేశాల్లో 53శాతం మంది, ఆస్ట్రేలియాలో 71శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. డిగ్రీ కోర్సుల్లో ప్రత్యక్ష బోధన కంటే ఆన్లైన్ బోధన మెరుగ్గా ఉంటుందా అన్న ప్రశ్నకు ప్రత్యక్ష బోధన కంటే ఆన్లైన్ బోధన మెరుగ్గా ఉండదని అత్యధిక శాతం మంది స్పష్టం చేశారు. 53శాతం మంది మెరుగ్గా ఉండదన్న సమాధానమే చెప్పారు. యూరోప్లో 62శాతం మంది, ఉత్తర అమెరికాలో 57శాతం మంది, ఆసియాలో 37శాతం మంది ఇదే విషయాన్ని చెప్పారు. ఆస్ట్రేలియాలో మాత్రం 54శాతం మంది ప్రత్యక్ష బోధన కంటే ఆన్లైన్ బోధన మెరుగ్గా ఉంటుందని చెప్పడం గమనార్హం. అందులో 12శాతం మంది అయితే ఆన్లైన్ బోధనే కచ్చితంగా మెరుగైందని పేర్కొన్నారు. ప్రత్యక్ష విద్యా సంబంధ సమావేశాల స్థానంలో ఆన్లైన్లో వర్చువల్ అకడమిక్ కాన్ఫరెన్స్ లు వస్తాయా అంటే 10 శాతం అసలే రావని చెప్పగా, 44శాతం మంది రావని చెప్పారు. 22శాతం మంది వస్తాయని వెల్లడించగా, 4శాతం మంది కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. 20శాతం మంది తెలియదని పేర్కొన్నారు.
కరోనా ప్రభావంతో వచ్చే విద్యా సంవత్సరంలో బోధన, అభ్యాసన, తరగతి గదుల్లో అసాధారణ మార్పులు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా జూన్లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావాలి. కరోనా కారణంగా ఈ పరిస్థితి కన్పించడం లేదు. కొంత ఆలస్యంగా తరగతులు ప్రారంభమైనా కరోనా నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తరగతి గది, వసతి గహాల్లో విద్యార్థుల మధ్య వ్యక్తిగత దూరం పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్కూళ్ళలో ఒక్కో తరగతి గదిలో 30-45వరకు విద్యార్థులు, జూనియర్ కళాశాలలకు వచ్చే సరికి 50-80, ఉన్నత విద్యా సంస్థల్లో 60మందికి పైనే ఉంటున్నారు. విద్యార్థుల మధ్య దూరం పాటించాల్సి వస్తే ప్రస్తుత మౌలికసదుపాయాలు సరిపోవు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆన్లైన్, విడతల వారీ తరగతులే పరిష్కారం చూపుతాయి. విద్యార్థులందరూ ఒకేతరగతి గదిలో పాఠాలు వినడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ఎక్కువ విద్యా సంస్థలు ఆన్లైన్కే ప్రాధాన్యం ఇస్తాయి. ఇంతవరకు నేరుగా పాఠాలు విన్న విద్యార్థులు ఆన్లైన్కు అలవాటు పడాల్సి ఉంటుంది. ఆన్లైన్ తరగతులు ఉన్నత విద్య వరకు బాగానే ఉన్నా, పాఠశాల స్థాయిలో కష్టంతో కూడుకున్న విషయం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాల కొరతతో ఇబ్బందులు తప్పవు. విడత(షిఫ్టులు)ల వారీగా తరగతులు నిర్వహించడం ద్వారా నేరుగా పాఠాలు బోధించేందుకు అవకాశం ఉంటుంది. ఉదయం కొన్ని తరగతులు, సెక్షన్లకు, మధ్యాహ్నం నుంచి మరి కొంతమందికి తరగతులు నిర్వహించవచ్చు. ఒక తరగతిలో నేరుగా ఉపాధ్యాయుడితో బోధిస్తూ మరో తరగతిలో తెరపై ప్రదర్శనలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. విద్యా సంస్థల్లో షిఫ్టు విధానం వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. తరగతి గదిలో వ్యక్తిగత దూరం పాటించినా వసతి గహాల్లో అమలు చేయడం కష్టం. ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వమే ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెల్: వాసిలి సురేష్
9494615360