Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1903 మార్చి 1న మహద్ తాలూకాలోని ''లాడావ్లి'' అనే ఊర్లో.. నిమ్నకులంగా పిలవబడే మహర్ కుటుంబంలో జన్మించిన మోరే.. చిన్ననాటి నుంచే అంటరానితనం బాధ లన్నీ అనుభవించాడు. చదువు లలో ఎంతో ప్రతిభ చూపిన ప్పటికీ.. మహద్ హైస్కూల్లో ప్రవేశం దక్కలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని సహించలేని మోరె జిల్లాకలెక్టర్కి వినతి పత్రం రాసి.. కిందిస్థాయి అధికారుల మెడలు వంచి మహద్ హైస్కూల్లో ప్రవేశం దక్కించుకున్నాడు. మనువాదానికి వ్యతిరేకంగా ఆయన సాధించిన మొదటి విజయం అది. ఆ ప్రాంతంలోని బహుజన శ్రేణుల్లో ఈ సంఘటన కొత్త ఉత్సాహాన్ని రగిలించింది.
సాంఘిక సంస్కర్త సి.కె. బోలే చొరవతో.. నాటి బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ 1923లో.. అన్ని చెరువులు, బావులు, ధర్మశాలలు బహిరంగ స్థలాలన్నింటినీ కులమతాలకు అతీతంగా అందరూ వాడుకోవచ్చని తీర్మానం చేసింది. దాంతో కార్యరంగంలోకి దూకిన మోరె.. తను నివసిస్తున్న ఊరు ''దస్గాం''లోని క్రాఫర్డు చెరువు నీళ్లపై తమ హక్కుల్ని నిలబెట్టుకోవడానికి 1926 డిసెంబర్ 4న దళితులని సమీకరించి, దండుకట్టి విజయం సాధించాడు. ఈ వార్త రాయగడ్జిల్లా అంతటా దావానలం సష్టించింది. మిగతా ప్రాంతాల్లోనూ ఈ తరహా పోరాటాలని కొనసాగించడానికి.. ''కొంకణస్థ మహర్ సేవా సంఫ్ు'' స్థాపించబడింది. ఆ సంఘానికి తొలి ప్రధాన కార్యదర్శిగా మోరె ఎన్నుకోబడ్డాడు.
ఈ సంఘం ఆధ్వర్యంలో మహద్ పట్టణంలో 1927 మార్చి 19న ''బహిష్కతుల సదస్సు'' అనే సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు ఐదువేల మంది దళితులు హాజరైన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ అంబేద్కర్ని పిలిచారు. సమావేశ కర్త అయిన మోరే.. డాక్టర్ అంబేద్కర్, అనంతరావు చిత్రే, బాపూ సహస్రబుద్ధెలను సభికులకు పరిచయం చేశాడు. సభా వేదిక నుంచి డా. అంబేద్కర్ ఇచ్చిన ఉపన్యాసం హాజరైన వారినందరినీ ఉత్తేజితులను చేసింది. ఆ మరుసటి రోజు.. మార్చి 20న అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది దళితులు చావదార్ చెరువు వరకు పాదయాత్ర చేసి.. చెరువు నీళ్ళు తాగి.. తరతరాల దాస్య శంఖలాలను తెంచి వేశారు. వేల సంవత్సరాల కట్టుబాట్లు తమ కండ్ల ముందే మట్టి కరవడం చూసి సహించలేని కుల దురహంకారులు.. దళిత ఉద్యమకారులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దళితుల ఇండ్లను తగల బెట్టారు. మహద్ పట్టణంలో దళితులు చేసిన తిరుగుబాటు.. కుల దురహంకారుల ప్రతి దాడుల వార్తలు దేశమంతటా వ్యాపించి.. అగ్గిని పుట్టించాయి. అంబేద్కర్ పేరు జాతీయ స్థాయిలో పతాక శీర్షికల కెక్కింది. ఇక తన జీవితాంతం.. నిమ్న వర్గాల విముక్తి కోసమే కేటాయిస్తానని ఆ క్షణాననే అంబేద్కర్ ప్రతిన పూనాడు.
అన్యాయాలు ఏ రూపంలో ఉన్నా ప్రతిఘటించాలనే సంస్కతిని అలవర్చుకున్న రామచంద్ర మోరె.. నాటి బొంబాయి రాష్ట్రంలోని దళితులతోపాటు శ్రమజీవులందరినీ సంఘటిత పరిచి.. న్యాయమైన హక్కుల కోసం మిలిటెంటు పోరాటాలని కొనసాగించాడు. బొంబాయి పట్టణంలోని టెక్స్టైల్స్ మిల్లు కార్మికులందరినీ ఐక్యం చేసి ''గిర్ని కామ్గార్ యూనియన్''ను స్థాపించి.. నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి, మిల్లు యజమానులైన భారతీయ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటాల రూపకల్పన చేశాడు. కొంకణ్ ప్రాంతంలోని రైతాంగానికి శాపంగా పరిణమించిన ఖోటీ వ్యవస్థ (వెట్టిచాకిరి)కు వ్యతిరేకంగా రైతులను పోరాట పథంలో నడిపించాడు. క్రమక్రమంగా శ్రామిక వర్గ దక్పథాన్ని సంతరించుకున్న మోరె.. మార్క్సిజాన్ని ఒంటబట్టించుకుని కమ్యూనిస్టుగా మారాడు. దళితులతో సహా శ్రామిక జనావళి సమస్తం ఎదుర్కొంటున్న.. సాంఘిక, ఆర్థిక, రాజకీయ దోపిడీలను నిర్మూలించాలంటే.. సమసమాజ స్థాపనయే సరైన మార్గమని నిర్ధారించుకుని.. ఆ దిశలో అడుగులు వేశాడు. ఆ క్రమంలోనే.. 1930లో నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో మోరె సభ్యుడిగా చేరాడు.
కమ్యూనిస్టు పార్టీలో చేరిన తర్వాత సైతం మోరేకు అంబేద్కర్కూ మధ్యనున్న స్నేహం యధావిధిగా కొనసాగింది. అంబేద్కర్ కొనసాగిస్తున్న సామాజిక న్యాయ పోరాటం పట్ల మోరె పూర్తి మద్దతు తెలిపేవాడు. కమ్యూనిస్టు పార్టీ కొనసాగిస్తున్న వర్గపోరాటం.. అంబేద్కరిస్టుల సామాజిక న్యాయపోరాటం కలిసి కొనసాగాలని చెబుతుండేవాడు. 1930లో లండన్లో జరుగనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ బయలు దేరుతున్నప్పుడు మహారాష్ట్రలోని దళితులందరి తరఫున అంబేద్కర్కి పౌరసన్మానం ఏర్పాటు చేయించాడు. 1932లో నాసిక్లోని కాలారామ్ దేవాలయ ప్రవేశం కోసం దళితులు ఉద్యమం చేస్తున్నప్పుడు కమ్యూనిస్టుపార్టీ తరఫున ఆ ఉద్యమానికి మద్దతు తెలపడమే కాకుండా.. పార్టీ కార్యకర్తలను సైతం ఈ ఉద్యమంలో భాగస్వాములను చేశాడు. 1937, 1946లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరఫున పోటీ చేయాలని అంబేద్కర్ మోరెను ఆహ్వానించాడు. ఆ ప్రతిపాదనను మోరె సున్నితంగా తిరస్కరించాడు. అంబేద్కర్ సంపాదకత్వంలో కొనసాగిన ''బహిష్కత భారత్'', ''సమతా'', ''జనతా'' పత్రికలకు మోరే వ్యాసాలను రాస్తుండే వాడు. జనతా పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా మోరెను అంబేద్కర్ నామినేట్ చేసాడు. ఒక కమ్యూనిస్టుకి అంబేద్కర్ అంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని అప్పుడు చాలా మంది ఆశ్చర్యంతో చూసేవారు. అంబేద్కర్ బౌద్ధమతాన్ని సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని సైతం మోరే బలపరిచాడు. మనువాద దక్పధాన్ని ఓడించడానికి.. భౌతికవాద శక్తులను బలోపేతం చేయడానికి అంబేద్కర్ నిర్ణయం సహకరిస్తుందని తన వ్యాసాలలో ఆయన వాదించేవాడు.
కొంకణ్ ప్రాంతంలోని రైతులను వెట్టిచాకిరీ గురిచేస్తున్న ఖోటీ వ్యవస్థ రద్దు కోసం 1938లో అంబేద్కర్ నాయకత్వంలోని ఇండిపెండెంట్ లేబర్పార్టీ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు.. కమ్యూనిస్టు పార్టీ తరఫున ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు మోరె. కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలు అంబేద్కరిస్టులతో భుజం భుజం కలిపి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ఆ ఐక్య పోరాటం కారణంగానే ఖోటీ వ్యవస్థ రద్దు చేయబడింది. 1938లోనే మహారాష్ట్రలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కార్మిక హక్కులను కాలరాసే నిరంకుశ చట్టాలను తీసుకొచ్చినప్పుడు.. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు సంయుక్తంగా ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. మహత్తర సోవియట్ సోషలిస్ట్ విప్లవ దినమైన 1938 నవంబర్ 7న ఈ రెండు పార్టీల ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని కార్మికవర్గం చారిత్రాత్మక సమ్మె చేసింది. లాల్ - నీల్ ఐక్యత ముందు తలవంచిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచి.. ఆ నిరంకుశ చట్టాలను విరమించుకున్నది.
1945లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) సమావేశం ప్యారిస్లో జరిగినప్పుడు.. భారతదేశ కార్మికవర్గ ప్రతినిధిగా మోరె హాజరయ్యాడు. నాటి కేంద్ర కార్మికశాఖ మంత్రిగా అంబేద్కర్.. భారత ప్రతినిధిగా మోరెను పంపించడంలో కీలకపాత్ర పోషించాడు. పారిస్ సమావేశంలో.. భారతదేశ కార్మికులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను వివరించడంతో పాటు.. నిమ్న వర్గాల కార్మికులు ఎదుర్కొంటున్న వివక్షను సైతం మోరె ప్రస్తావించాడు. కులం పేరుతో నిమ్నవర్గాలకు పని ప్రదేశాలలో ఎదురవుతున్న అవమానాలను అంతర్జాతీయ సమాజం ముందు ఏకరువు పెట్టాడు. దళిత వర్గాల అభ్యున్నతి జరగాలంటే.. ఉపాధి అవకాశాలలో ప్రత్యేక రిజర్వేషన్ అందించాలని ఆ సమావేశంలోనే మోరె ప్రతిపాదించాడు. నిమ్నవర్గాల గొంతును అంతర్జాతీయ వేదిక మీద బలంగా వినిపించిన మోరే.. భారతదేశానికి తిరిగివచ్చిన రోజున.. అంబేద్కర్ నాయకత్వంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, కమ్యూనిస్టు పార్టీలు సంయుక్తంగా బొంబాయి పట్టణంలో పౌర సన్మానం ఏర్పాటు చేశాయి.
1964లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు.. మోరె సీపీఐ(ఎం) వైపు నిలిచాడు. సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మోరె సంపాదకత్వంలో 1965 ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి రోజు)న సీపీఐ(ఎం) పార్టీ మహారాష్ట్ర కమిటీ అధికార పత్రిక ''జీవన్మార్గ్''ను ప్రారంభించారు. ఆ పత్రిక ఈ నాటికి కొనసాగుతున్నది. అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను గ్రంథస్థం చేస్తూ దత్తా కేల్కర్ రాసిన ''ఆత్మశోధ్'' అనే పుస్తకంలో.. అంబేద్కర్, మోరెల అనుబంధాన్ని తెలియజేసే ఒక సంఘటన వర్ణించబడింది. వైస్రారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత అంబేద్కర్కి బొంబాయిలో ఒక సన్మానసభ ఏర్పాటు చేయబడింది. వేదికపై నుంచి ప్రసంగిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్.. గుంపులో ఒక మూల నిలుచుండి కార్యక్రమాలను చూస్తున్న మోరెను గమనించి.. వేదికపైకి రావాలంటూ ఆహ్వానించాడు. మోరే సున్నితంగా తిరస్కరించి.. అక్కడే నిలుచుండి పోయాడు. బాబాసాహెబ్ కార్యకర్తల్ని ఆదేశించి మోరెని బలవంతంగా వేదిక పైకి రప్పించి.. సభికులకు పరిచయం చేసాడు: ''కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన నా మిత్రుడు మోరె.. చాలా గొప్ప వ్యక్తి. నేను సామాజిక - రాజకీయ కార్యాచరణను ప్రారంభించడానికి కారకులైన వారిలో ఈ మోరే ఒకరు..!'' అని చెప్పడంతో సభికులందరూ చప్పట్లతో అభినందించారు.
శ్రామిక జన సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు నెరపిన మోరె.. 1972 మే 11న కన్నుమూసాడు. బొంబాయిలో ఏర్పాటుచేసిన మోరె సంతాప సభకు రిపబ్లికన్ పార్టీ నాయకుడు.. అంబేద్కర్ కుమారుడైన.. భయ్యాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షత వహించగా.. సీపీఐ(ఎం) జాతీయ నాయకుడు బి.టి. రణదివే ముఖ్యవక్తగా హాజరయ్యాడు. భారతదేశంలో కుల నిర్మూలన కోసం.. సమసమాజ స్థాపన కోసం.. నేడు మరింత దఢంగా కొన సాగాల్సిన ఐక్యపోరాట పంథాకి.. ఆనాడే బీజం వేసిన అమరజీవి రామచంద్ర బాబాజీ మోరే! ఆ అమరుడి స్మతికి లాల్ సలాం!!
ఆర్ రాజేశమ్
సెల్ : 9440443183