Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు ఆగుతుందో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించగా, కోట్లాది మంది ప్రజలు ఈ వైరస్ భయంతో అల్లాడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్కు విరుగుడు మందు కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలు నిమగం అయ్యాయి, మరికొన్ని దేశాలు చేతులెత్తేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన కేసుల్లో 80శాతం కేసులు ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా, ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులకే కరోనా పాజిటివ్ రావడం గమనిస్తే ఈ వైరస్ ప్రభావం ఎంత తీవ్రంగా, ఎన్ని రకాలుగా ఉందో అర్థమవుతుంది. అంతేగాక ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైనదో కూడా అర్థమవుతుంది. ఈ విధంగా ఎటువంటి లక్షణాలులేకుండా కరోనా సోకడం, వారిని గుర్తించడం అత్యంత కష్టమైన పని. ముఖ్యంగా కరోనా టెస్టులు ఎవరికి చేయాలి? ఎవరికి అవసరం లేదు అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమైన పని. ఇదే విషయంలో కేంద్ర బందం ముందు రాష్ట్ర నిపుణుల బందం కూడా సందేహాన్ని లేవనెత్తింది. వారు కూడా సరైన సూచనలు చేయలేకపోవడంతో దీనిని ఏవిధంగా కట్టడి చేయాలి అనేది పెద్ద చిక్కుగా మారింది. ఇక వ్యాక్సిన్ వచ్చేవరకు దీంతో కలిసి సహజీవనం చేయడం తప్పని పరిస్థితి అయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెబుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధన విధించినా, ఎక్కువకాలం దాన్ని కొనసాగించలేని పరిస్థితి ఉంది. ఇక జనాలు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ, జనాల్లో తిరగకుండా సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగతశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అవకాశం ఉంటుంది. దాదాపు వాక్సిన్ వచ్చేందుకు ఒక సంవత్సర కాలం పట్టే అవకాశం ఉండటంతో దీనిపై అవగాహన పెంచుకుని కరోనాతో కలిసి జీవించేందుకు మానసికంగా సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. రాబోవు రోజుల్లో లాక్డౌన్ దేశవ్యాప్తంగా పాక్షిక సడలింపు కానుంది. లాక్డౌన్ సడలించినంతమాత్రాన కరోనా ప్రమాదం తొలగినట్లు కాదు. అందుకే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) సూచనలు పాటిస్తూ వ్యాక్సిన్ వచ్చేంతవరకు రక్షణతో కూడిన జీవితాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో, ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ మన నిత్య జీవనం కొనసాగించాలో అందరూ తెల్సుకుని, పాటిస్తూ కరోనా బారిన పడకుండా ఉండాలి. ఆయా జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. కొంతకాలం విదేశాలకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం, బయట ఆహారం తినకుండా ఉండటం, అనవసరమైన వేడుకలకు వెళ్లకూడదు, అనవసరమైన ప్రయాణ యాత్రలు చేయకూడదు. కనీసం ఏడాది పాటు రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లకూడదు. సామాజిక దూరం నిబంధనలను పూర్తిగా పాటించాలి. దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి. ఫేస్ మాస్క్ను అన్ని వేళలా ధరించాలి. చుట్టూ జరుగుతున్న కరొనా అనుకూల క్రియలను అందుకు కారణమైన వ్యక్తుల గురించి తక్షణం ప్రభుత్వ అధికారులకి తెలియజేయాలి. పౌర సమాజాన్ని బలోపేతం చేసుకుని ప్రజలని చైతన్యపరిచి కరోనా పట్ల అవగాహనను పెంపొందించాలి. ముఖ్యంగా అభద్రతతో కూడిన రోడ్సైడ్ ఆహార పదార్థాలను తినకూడదు. వీలైనంత వరకూ ఇంటి వంటనే కార్యాలయాలకు తీసుకెళ్లడం మంచిది. సినిమా, మాల్, క్రౌడ్ మార్కెట్కు వెళ్ళడం మానాలి. బార్బర్ షాపులో లేదా బ్యూటీ సేలోన్, పార్లర్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన సమావేశాలకు దూరంగా ఉండాలి. సామాజిక దూరాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు లోహపు వస్తువులను వీలైనంతవరకు ధరించకూడదు. బెల్ట్, రింగులు, రిస్ట్ వాచ్ ధరించవద్దు. వాచ్ అవసరం లేదు. చేతి కర్చీఫ్, శానిటైజర్, టిష్యు పేపర్లని తీసుకువెళ్ళాలి. ఇంటి లోపలకి బూట్లు, చెప్పులు తీసుకురావద్దు. వాటిని బయట వదిలివేయాలి. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు మీ చేతులు, కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి. ఆలస్యం లేకుండా సబ్బుతో స్నానం చేయాలి. అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చారని మీకు అనిపించినప్పుడు పూర్తిగా స్నానం చేయాలి. ఆరోగ్య సేతు యాప్ని మీ మొబైల్లో లోడ్ చేసి మీ చుట్టుపక్కల కరోనా వ్యాధి తీవ్రతను ఎప్పటికప్పుడు గమనించాలి. వ్యాయామం, వేడి నీళ్లు తాగడం జీవితంలో అలవాటు చేసుకోవాలి. శానిటైజర్తో ప్రతి ముప్ఫై నిమిషాలకు చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైతే ప్రతి గంటకు సోప్తో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలు పాఠశాలకు, కళాశాలలకు, బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరి జాగ్రత్తలు చెప్పి చైతన్యాన్ని పెంచాలి.
ఆఫీస్, కార్యాలయంలో పనిచేసే ప్రతి వ్యక్తి సబ్బు, శానిటైజర్ వాడాలి. ఒకరితో మరొకరు చేతులు కలుపకూడదు. కండ్లు, ముక్కు, నోరు తాకకుండా ఉండాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు టిష్యు లేదా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. రద్దీ ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే చోటికి వెళ్లకూడదు. క్యాంటీన్లో గుంపులుగా చేరి కబుర్లాడవద్దు. కార్యాలయం నుంచి బయలుదేరే సమయంలో ఇంటికి వస్తున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఇంటి గుమ్మం ముందు సర్ఫ్ లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్ల బకెట్ ఉంచమనాలి. ఆ తలుపు తెరిచి ఉండడం వల్ల మీరు కాలింగ్ బెల్ కొట్టాల్సిన అవసరం ఉండదు. డోర్ హ్యాండ్ కూడా ముట్టుకోకుండా ఉండొచ్చు. కారు లేదా బైక్ తాళాలు, పెన్, ఫోన్, వాలెట్, శానిటైజర్ సీసా, ఇంటి బయట ఉన్న డబ్బాలో ఉంచాలి. బకెట్లోని సబ్బు నీళ్లలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం వాటర్లో కొద్ది సేపు నిలబడాలి. అదే సమయంలో డబ్బాలో పెట్టిన వస్తువులకు టిష్యుతో శానిటైజర్ రుద్దాలి. ఆ చేతులు మరోసారి కడుక్కోవాలి. తర్వాత ఏ వస్తువులు తాకకుండా ఇంట్లోకి వెళ్ళాలి. తలుపు తెరిచి ఉంచమని చెప్పి నేరుగా బాత్రూమ్లోకి వెళ్లాలి. అంతకుముందే డిటర్జెంట్ కలిపిన నీళ్లను బకెట్లో ఉంచమని చెప్పాలి. ఇన్నర్లతో సహా దుస్తులు బకెట్లో పెట్టాలి. షాంపు, సబ్బుతో తలస్నానం చేయాలి. అనంతరం బకెట్లోని దుస్తులను వాషింగ్ మిషన్లో ఉంచి అత్యధిక ఉష్ణోగ్రత ఉండేలా ఆన్ చేయాలి. వాషింగ్ మిషన్ లేకుంటే దుస్తులు ఉతికిన అనంతరం స్నానం చేయాలి. ఉతికిన దుస్తులను ఎండలో ఆరేయాలి.
వాసిలి సురేష్
సెల్ :9494615360