Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత రెండు మూడు నెలలుగా రోడ్లపై కొత్త చెత్త పోగవుతోంది.. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు తదితర వ్యర్థాలతో పాటు దార్ల వెంట ఫేస్ మాస్కులు దర్శణ మిస్తున్నాయి..
మాస్క్లను ఉపయోగించటమే కాదు వాటిని జాగ్రత్త చేయటంలో కొందరి నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది.. గతంలో చేతి రుమాలు కిందపడితే కొద్ది దూరం వెనక్కు వెళ్ళాల్సొచ్చినా సరే వెళ్ళి దానిని తిరిగి తీసుకొనేవాళ్ళం.. అంటిన దుమ్ము దులిపి వినియోగించుకునే వాళ్ళం.. కానీ ఇప్పుడు మాస్క్లుగా పిలుస్తున్న, ఉపయోగిస్తున్న గుడ్డలకు ఆమాత్రం విలువివ్వటం లేదు.. తక్కువ ఖరీదు తొడుగులు కావటం వల్లనో, కొన్నవి కాకపోవటాన్నో, మాస్కులకు విలువివ్వటంలేదు.. పోతే పోనీరు అనుకొనే ధోరణి వల్ల పోగొట్టుకున్నవారు నష్టపోయేది ఉన్నా లేకపోయినా ఇతరులు కరోనా కాటుకు బలయ్యే దుస్థితి ఉంది..
నిర్లక్ష్యాన పారేసినవో, ఏమరుపాటుతో పోగొట్టుకున్నవైనా రోడ్లపై అక్కడక్కడా కనిపిస్తున్న మాస్క్లు కరోనా వ్యాప్తి భయాన్ని కలిగిస్తున్నాయి.. రోడ్లపైనే కాక కాలువలు, చెత్త దిబ్బల్లోనూ పేరుకుపోతున్న మాస్క్లు వైరస్ వ్యాప్తి కారకాలయ్యే అవకాశముంది.. మాస్క్ల భధ్రతపై భరోసాతోనే ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులనిచ్చింది.. మాస్కులు ధరించి కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలని సూచించింది.. కానీ ఈ మాస్క్ల వినియోగంలో నిబంధనలు పాటించని కారణంగా వైరస్ మహమ్మారి కోరలు సాచే ప్రమాదముంది..
మాస్క్ వినియోగం, భద్రపరచటం వంటి విషయాలలో తగిన అవగాహన కొరవడిన వారు ఇతరుల భయానికి కారణమవుతున్నారు.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో చెవులకు తగిలించుకున్న మాస్క్ గాలి వేగానికి తొలగి కిందపడిపోతున్నా చాలామంది గమనించటం లేదు.. కొందరు గుర్తించినప్పటికీ వాహనాన్ని వెనక్కు తిప్పుకొని వెళ్లి తెచ్చుకునేందుకు ప్రాధాన్యమివ్వటం లేదు.. ఇంకొందరు ఒకరోజు ఉపయోగించి ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు..
ఎన్-95 వంటి ఖరీదైన మాస్కులు వినియోగించే వారికి వాటిని సంరక్షించుకునే ఆలోచన ఉంటుంది. పొరపాటున ఎక్కడైనా పడితే వెతుక్కొని తెచ్చుకుంటారు. కానీ గుడ్డతో కుట్టినవి, ఒకరోజుకే పరిమితమయ్యే మెడికల్ మాస్క్ల వినియోగం వల్ల రోడ్లపై ఇవి ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటున్నాయి.. రోడ్లపై పడి ఉండే మాస్క్ల్లో ఏవైనా కరోనా రోగులు ఉపయోగించినవైతే నడిచి వెళ్ళేవారు వైరస్కు గురికాక తప్పదు.. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్లకు వెళ్ళోచ్చేవారు చూడక ఈమాస్క్లపై అడుగేస్తే వైరస్ను అంటించుకోక తప్పదు.. మనుషులతోపాటు నోరులేని మూగ జీవాలు, వాటి ద్వారా మనుషులు కరోనా కాటుకు గురయ్యే పరిస్థితి ఉంది.. కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఈ మాస్క్లను తాకినప్పుడు వాటిల్లో వైరస్ క్రిమి దాగి ఉంటే ఆయా జంతువులతోపాటు వాటి పెంపకం దార్లకూ వైరస్ సంక్రమించక మానదు...
మాస్క్లను ధరిస్తున్న వారు మాస్క్లను వాటి ధర పరంగా కాక వాటిని బాధ్యతారహితాన పారేస్తుండటం వల్ల కలిగే దుష్ఫలితాలను ఊహించాలి.. సమాజానికి మేలు చేయకున్నా ఫర్వాలేదు చేటు కలిగించే చేష్టలకు ఆస్కారమివ్వద్దు.. ఇది మహమ్మారి కరోనా కాలం. ప్రతి ఒక్కరిలో అప్రమత్తత అవసరం.. మాస్క్ వినియోగంలోనే కాదు, వాటిని పారవేసే చర్యల్లోనూ నిబంధనలు పాటించాల్సిందే.
- కె.శ్రీనివాస్, సెల్: 9346611455