Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనా వస్తువులను బహిష్కరించడం అంత సులభం కాదు. ఎందుకంటే రెండు ఆర్ధిక వ్యవస్థలూ ఒకదానికి ఒకటి ముడిపడి వున్నాయి. ఇప్పుడు 'మేడ్ ఇన్ చైనా' వస్తువులను బహిష్కరించాలని కొందరు పిలుపునిస్తున్నారు. చైనా ఉత్పత్తులను భారత్ బహిష్కరిస్తే ఏమవుతుంది? చైనా ఆసియాలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ. ప్రపంచ జీడీపీలో 13.6 ట్రిలియన్ డాలర్లుతో ప్రపంచంలో అతిపెద్ద రెండవ ఆర్ధిక వ్యవస్థ. భారతదేశం ఆసియాలో 2.7 ట్రిలియన్ డాలర్లుతో 3వ స్థానంలో ఉంది. చైనా భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారతదేశం చైనాకి ఎగుమతి చేసే దానికంటే దిగుమతి ఎక్కువగా చేసుకుంటున్నది. ఒకేసారి చైనాతో వాణిజ్యం ఆపివేస్తే అవే వస్తువులను ఇంకొక దేశం నుంచి దిగుమతి చేసుకోవలసి వుంటుంది. ఇప్పుడు చైనా వస్తువులు చవకగా దొరుకుతున్నాయి. అవే వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటే ధరలు పెరుగుతాయి. చైనా నుంచి 85 బిలియన్ డాలర్లకు (6 లక్షల కోట్లు పైన) పైగా దిగుమతి చేసుకుంటోంది. చైనాకు 29 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్నది. అంటే ఎగుమతుల కంటే దిగుమతుల ఎక్కువ. మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, వ్యవసాయానికి అవసరమైన ఉపకరణాలు, ఆటోమొబైల్ ఇండిస్టీకి అవసరమైన ముఖ్యమైన భాగాల కోసం మనం చైనా దిగుమతుల పైనే అధారపడుతున్నాము. ఈ దిగుమతుల్లో 20శాతం ఆటోమొబైల్ భాగాలు, 70శాతం ఎలక్ట్రానిక్ భాగాలు చైనా నుంచి వస్తున్నాయి. మనం రోజువారీ ఉపయోగించే వస్తువులలో 45శాతం కన్స్యూమర్ డ్యూరబుల్స్, 70శాతం ఫార్మా, 40 శాతం తోలు వస్తువులు చైనాకు చెందినవి. భారతదేశానికి మొత్తం చైనా ఎగుమతులలో కేవలం 3.3శాతం మాత్రమే ఉన్నాయి. కాబట్టి చైనా వస్తువులన్నింటినీ భారతీయులు బహిష్కరించినా చైనాపై పెద్దగా ప్రభావం చూపదు.
ప్రపంచీకరణకు ఇటీవల అనేక ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ ఒకదేశంతో ఇంకో దేశానికి వున్న వాణిజ్య సంబంధాలు విడదీయలేనివి. అటువంటి ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. భారతీయ సంస్థలు తయారుచేసిన ఉత్పత్తులలో చైనా నుంచి వచ్చిన భాగాలు ఉంటాయి లేదా వాటిని తయారు చేయడానికి చైనీస్ యంత్రాలను ఉపయోగిస్తాం. కరోనా మహమ్మారి-ప్రేరిత లాక్డౌన్ల నేపథ్యంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నష్టం నుండి బయట పడడానికి తక్కువ ఖర్చుతో కూడిన చైనా యంత్రాలు, ముడి సరుకులను విస్తతంగా ఉపయోగిస్తున్నాయి. ఆ దేశం నుంచి అనేక తుది ఉత్పత్తులలో వ్యాపారం చేయడమే కాకుండా 30శాతం చైనా దిగుమతులను భర్తీ చేయాలనే లక్ష్యంతో ఆత్మ-నిర్భర్ భారత్తో వెళ్లాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. చైనా నుంచి మనము దిగుమతి చేసుకునే ఉత్పత్తులు చౌకగా ఉంటాయి. దీని ద్వారా అనేక పరిశ్రమలు లాభంపొందుతున్నాయి. ఇప్పుడు మహమ్మారి సమయంలో, ముడి పదార్థాలను బహిష్కరించాలని నిర్ణయించుకుంటే, ఉత్పత్తి, తయారీ రంగం నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా ఉత్పత్తి పడిపోయి కార్మికులను తొలగిస్తారు, దేశం ఆర్ధికంగా నష్టపోతుంది. మందుల తయారీ రంగంలో కుడా ముడి పదార్ధాల కోసం చైనా పైనే ఆధారపడుతున్నాం. మన మందుల దిగుమతులలో కూడా 80శాతం చైనా నుంచి వస్తున్నాయి. వాణిజ్య యుద్ధం ప్రకటిస్తే ఇది మొత్తం ఆరోగ్య రంగాన్నే కుదిపేస్తుంది. టెలికం సెక్టార్లో కుడా 66శాతం స్మార్ట్ ఫోన్స్, టేబ్లెట్లు, కంప్యూటర్లు, ఫోన్లో వాడే సిమ్లు, కంపోనేంట్స్ కూడా చైనాలో తయారయినవే.
చైనా దిగుమతుల్లో మూడింట ఒక వంతు వస్తువులు తక్కువ సాంకేతికతవి అని అంచనాలు సూచిస్తున్నాయి. ఇవి అంతకుముందు భారతీయులచే తయారు చేయబడ్డాయి, లేదా ఇప్పటికీ తయారు చేయబడుతున్నాయి. కాని తక్కువ పరిమాణంలో చేస్తున్నారు. స్థానిక ఉత్పత్తులు, బ్రాండ్ల ప్రోత్సహించవడం ద్వారా అటువంటి వస్తువుల దిగుమతులు తగ్గించవచ్చు. ప్రభుత్వం మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కు రుణాలు అందించడానికి పరిమితం కాకుండా ఉత్పత్తులకు మార్కెటింగ్ సహాయం చేయాలి. ఎంఎస్ఎంఇ రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా మన స్వంత ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చు. మనం తాయారు చేసుకోకపోతే చైనా కాకపోతే ఇంకో దేశం తన వస్తువులను మన దేశంలోకి డంప్ చేస్తుంది. మనం స్వయం సమృద్ధి సాధించే విధానాలు మన దగ్గరలేవు. ఆత్మనిర్భర్ నినాదం చేస్తున్న బీజేపీ విదేశీ పెట్టుబడులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 2019-20 ఆర్థిక సంవత్సరంలో 13శాతం పెరిగి 49.97 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంటే మనం ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుపైన అధారపడుతున్నాం. స్మార్ట్ఫోన్లు, వినియోగదారుల ఉపకరణాలు, నిర్మాణ పరికరాలు, పవర్ గేర్, ఆటోమొబైల్స్, ఆప్టికల్ ఫైబర్, రసాయనాల కోసం విదేశాలపైనే అధారపడుతున్నాం. తయారుచేయగలిగే అవకాశం వున్నా తయారు చేయడం లేదు. దేశీయ మార్కెట్లో సుమారు 800ల చైనా కంపెనీలు ఉన్నాయి. భారతదేశం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 480 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది, అంటే ఇది 2015 నుంచి 22.8శాతం పెరిగింది.
భారత రూపాయి మారక విలువ యుఎస్ డాలర్తో పోలిస్తే 2015 నుంచి 9.8శాతం క్షీణించింది. ఒక్క 2018 నుంచి 2019లో 3శాతం తగ్గింది. బలహీనమైన మన రూపాయితో బలమైన యూ.ఎస్. డాలర్లలో దిగుమతులకు చెల్లించాలి. ఇది ఆర్థిక వ్యవస్థపై భారం పడేలా చేసింది. చైనా ఉత్పత్తులను బహిష్కరించడమే దీనికి పరిష్కారం అయితే మనం కేవలం ప్రచారానికే మిగిలిపోతాం. భారత దేశంలో పేదవారు చౌకగా దొరికే వస్తువులు వాడుతారు. ఉదాహరణకి చైనా ఫోన్లు ఆపేస్తే ఖరీదైన జపాన్ వంటి దేశాల ఫోన్లు వస్తే అందరూ కొనుక్కోలేరు. మధ్యతరగతి ఉన్నత తరగతి వారు మాత్రమే ఈ నిషేధాన్ని తట్టుకోగలరు. భారతదేశ ఆర్థిక వృద్ధి దేశీయ డిమాండ్తో నడిపించాలి, ఎక్కువ ఎగుమతి చేయాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి చౌకైన చైనీస్ ఉత్పత్తులపై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీ మరియు కౌంటర్వైలింగ్ సుంకాన్ని విధించవచ్చు. ఈ రెండు విధులను విధించిన తరువాత చైనా ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి, అందువల్ల భారత తయారీదారులు ఈ ఉత్పత్తులను భారత గడ్డపై ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఇది భారతదేశంలో ఉపాధిని సృష్టిస్తుంది. మన వస్తువుల కోసం మన దేశీయ డిమాండ్ను పెంచుకోవచ్చు. మనం ఎక్కువ ఎగుమతి చేయవచ్చు. ఈ రంగాలను అభివృద్ధి చేయడంలో, ఎంఎస్ఎంఈలకు నిబంధనలు ఇవ్వడం, దేశీయ వినియోగాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ అవేమీ చేయకుండా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టడం వల్ల వారి రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయేమో గానీ దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి.
బి. గౌతమ్
సెల్:9705734416