Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్లోని లడఖ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చైనా బలగాలు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో భారతీయుల్లో చైనాపై అసహనం పెంచే ప్రయత్నం జరుగుతున్నది. చౌక వస్తువుల పేరుతో తమ ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకుంటూనే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి భారత్ పై కయ్యానికి వినియోగించాలనే చైనా చెడు ఆలోచనను భారతీయులు తెలుసుకోవాలని పిలుపునిస్తున్నారు. అంతటితో ఆగకుండా చైనా రిమూవ్ యాప్స్, బారుకాట్ చైనా ప్రొడక్ట్స్, అంటూ చైనా వస్తు బహిష్కరణ చేయాలన్న నినాదాలను తీసుకొస్తున్నారు. వాణిజ్య విప్లవం మొదలయ్యాక ప్రపంచ వ్యాప్తంగా చైనా వస్తువులు కనిపిస్తున్నాయి. తక్కువ ధరలో లభించడం, నాణ్యతతో కనిపించడం వల్ల చైనా వస్తువులకు గిరాకీ కూడా పెరుగుతూ వచ్చింది. అందువల్ల దీని విస్తరణ అన్ని రంగాలలోనూ జరిగింది. ఇంటర్నెట్ వినియోగంలో యూజర్లను ఆకట్టుకునేలా చైనా యాప్లు కూడా విరివిగా తయారయ్యాయి. కానీ ఇటీవల కాలంలో చైనా వస్తువులను నిషేధించాలనే ఆలోచనల నుండి ఓ యాప్ పుట్టుకొచ్చింది. ఇదే 'రిమూవ్ చైనా యాప్స్'. పేరుకు తగ్గట్టే ఫోన్లో ఉన్న చైనా యాప్ లను తొలగిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎక్కువగా డౌన్ లోడ్ అవుతున్న యాప్లలో ఒకటిగా చెప్పవచ్చు. యూజర్లు దీనికి 4.8 రేటింగ్ ఇచ్చారు. ఈ 'రిమూవ్ చైనా యాప్స్' యాప్ను డౌన్లోడ్ చేసుకోగానే ఎలాంటి రిజిస్ట్రేషన్, లాగిన్ అవసరం లేకుండా 'స్కాన్' అనే ఆప్షన్తో ఫోన్లో ఉన్న చైనీస్ యాప్స్ ను గుర్తించి డిలీట్ చేస్తుంది. ఇదే సందర్భంలో కొందరు చైనా ఉత్పత్తులను బారుకాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. చైనా ఫోన్లను, యాప్లను వదిలించుకోవాలని కోరుతున్నారు. చాలామంది 'రిమూవ్ చైనా యాప్స్' యాప్ను డౌన్లోడ్ చేసుకొని, వాడినట్లు స్క్రీన్ షాట్లను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. దీంతో దేశంలో బారు కాట్ చైనీస్ ప్రొడక్ట్స్, బారు కాట్ చైనా అనే హ్యాష్ ట్యాగులు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా వస్తువులను బహిష్కరించడం కుదరదని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అతి పెద్ద వ్యాపార భాగస్వాములుగా ఉన్న చైనా, భారత్లలో చైనా వాటా అధికంగా ఉంది. చైనాకు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువుల కంటే, చైనా నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువులే అధికంగా ఉంటున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ప్లాస్టిక్ వస్తువులు, వ్యవసాయ వస్తువులు, కార్లు, సోలార్ సెల్స్, ముఖ్యమైన ఔషధాలతోపాటు అనేక వస్తువులను భారతదేశం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. చైనాలోని ఇండియన్ ఎంబసీ లెక్కల ప్రకారం (జనవరి - నవంబర్ 2019 మధ్య కాలంలో) భారత్ నుండి చైనాకు 16.32 బిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులు ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో చైనా భారత్కు 68 బిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులు దిగుమతి అయ్యాయి. అంటే రెండు దేశాల మధ్య జరుగుతున్న వ్యాపారంలో భారత్ 51.68 బిలియన్ డాలర్ల వ్యాపార లోటును కలిగి ఉందని తెలుస్తున్నది. ఆసియా ఖండంలో బలమైన దేశాలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య 84.32 బిలియన్ల వ్యాపారం జరుగుతోంది. భారతదేశంలో ఉన్న చైనీస్ స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే, చైనా నుంచి భారత్లోకి 8 మిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో 51శాతం వాటాను షియోమీ, వివో, ఒప్పో, లెనోవోలు కలిగి ఉన్నాయి. అటు గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువుల్లో అరవై శాతం కంటే ఎక్కువ చైనా నుండే వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చైనా వస్తువులను మనం పూర్తిగా బహిష్కరించడం సాధ్యం కాదని అర్థమవుతున్నది. భారతీయుల దైనందిన జీవనంలో చైనా వస్తువుల పాత్ర విడదీయలేనంతగా ఉంది. ప్రస్తుతం చైనా వస్తువులను బహిష్కరించాలని పంపుతున్న మెసేజులను కూడా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్స్ ద్వారా పంపిస్తున్నారని గుర్తించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తు ఉత్పత్తి అనేది చాలా క్లిష్టంగా, ఒక దానితో మరొకటి కనెక్ట్ అయి ఉంటుంది. తయారైన ప్రతి వస్తువు వెనక చాలా క్లిష్టమైన చరిత్ర ఉంటుంది. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే అవి తయారు కావడానికి చైనా భూభాగాన్ని, మనుషులను వాడారని అనుకుందాం. కానీ ఆ కంపెనీలో పెట్టుబడులు అమెరికా నుండో లేదంటే యూరోపియన్ దేశం నుండో వస్తాయి. ఇక ఆ ఫోన్ల ఐడియా కొరియా నుండో లేదంటే జపాన్ నుండో వచ్చి ఉంటుంది. ఇక అందులో వాడే యాప్లు ఇండియాలో తయారై ఉండవచ్చు. దీన్నిబట్టి వస్తువులను మనం అనుకున్నంత సులభంగా పలానా అంటూ విభజించలేమని అర్థమవుతున్నది. వస్తువులను బహిష్కరించాలనే ఉద్యమాలు చాలా ప్రత్యేకంగా, ప్రభావ వంతంగా పని చేసినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వలన అలాంటివి చాలా వరకు విజయవంతం కాలేదు. ఉదాహరణకు 1930లో జపాన్ వస్తువులను బహిష్కరించాలని చైనా చూసింది. అలాగే ఫ్రాన్స్ నుంచి వచ్చే వస్తువులను బహిష్కరించాలని అమెరికా కూడా అనుకుంది. కానీ పరిస్థితులు అందుకు సహకరించలేదు. చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలంటే ముందుగా మార్కెట్లో ఉన్న చైనా వస్తువులకు బదులు ప్రత్యామ్నాయ స్వదేశీ వస్తువులు ఉండాలి. ప్రభుత్వం ముందు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టి తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మల్లించాలని చూస్తే ప్రయోజనం ఉండదు. భారతదేశం, చైనాల మధ్య జరుగుతున్న వ్యాపారంలో తేడా అతి తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చైనా వస్తువులను భారత్ బహిష్కరించగలుగుతుంది. స్మార్ట్ ఫోన్లో రిమూవ్ చైనా యాప్స్ ఉపయోగించి ఫోన్లో యాప్లను తిసేసినంత సులభంగా భారతీయుల దైనందిన జీవనంలో, వస్తు వినియోగంలో ముడిపడి ఉన్న చైనా వస్తువులను వెంటనే బహిష్కరించడం సాధ్యం కాదని గుర్తించాలి.
- వాసిలి సురేష్
సెల్:9494615360