Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మానవ పరిణామ క్రమంలో పశువు నుంచి మనిషిని వేరుచేసింది కళ'' - ఏంగెల్స్
అంటే మానవ జీవన చరిత్ర అంతా మానవ కళా చరిత్రే అని మనం వ్యాఖ్యానించుకోవచ్చు.
ఇక్కడ కళ అంటే మనిషి మానసిక జీవనం అని అర్థం చేసుకోవాలి.
అనుభవాలు అనుభూతులు స్పందనలు, కలలు, భావాలు.. అంతిమంగా జ్ఞానం.
- ఇత్యాదివన్నీ మనస్సులో కలిగేవే. నైరూప్యాలు.
జీవితం నవరస భరితం అన్నారు పెద్దలు.
రౌద్రం, వీర, శృంగార, హస్య, భయ, భీభత్స, కరుణ, శాంత, అద్భుత
ఈ నవరసాలు మనిషి జీవితంలో ఉన్నవే.
మనిషి భౌతికంగా జీవించడం ఎంత వాస్తవమో
మానసికంగా జీవించడం కూడా అంతే వాస్తవం.
అయితే పశుపక్షాదులకు ఈ మానసికజీవితం ఉండదా..?
అని ప్రశ్నేస్తే.. తరతమ స్థాయిల్లో వాటి పరిణామాన్ని అనుసరించి ఉంటుంది.
ఏనుగు మెదడుకన్నా మనిషి మెదడే పెద్దది.
కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం- ఈ పంచేద్రియాలను మెదడు సమన్వయ పరుస్తుంది. ఇంద్రియాల ద్వారా జ్ఞనం లభిస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియాలు అని అన్నారు.
మనిషికి ఇంతటి శక్తివంతమైన మెదడు ఎలా ఏర్పడింది?
ఈ ప్రశ్నకు జవాబు కూడా ఏంగెల్స్ వివరించాడు. ''వానరుడు నరుడుగా మారిన క్రమంలో శ్రమ పాత్ర.''
మైదానాల నుంచి కొండలు ఎక్కే క్రమంలో ముందరికాళ్ళు చేతులుగా మారాయని, చేతుల్లో పట్టు ఏర్పడేందుకు నాలుగు వేళ్ళకు అభిముఖంగా బొటన వ్రేలు ఏర్పడిందని ఈ బొటన వ్రేలు చేతులు మెదడుతో ఏర్పడిన నాడీమండల వ్యవస్థ నానాటికి శక్తివంతమై మనిషిగా, ఓ అజేయమైన, అద్భుతమైన ప్రాణిగా అవతరించాడని తెలిపారు.
తన రక్షణ కోసం ఆదిమానవుడు తొలిగా ఓ మొనకలిగిన రాయిని పట్టుకుని వేల లక్షల సంవత్సరాలు తిరిగినట్టు చారిత్రక చిత్రాలు చెపుతున్నాయి. అదే తొలి ఆయుధం, సాధనం, పనిముట్టు.
అవసరం నుంచి భావం. భావం నుంచి రూపం (ఉత్పత్తి పరికరం) అవతరించినట్టు తెలుస్తున్నది. తొలుత భావం (ఆలోచన) అని గమనించాలి. ఆలోచన నుంచి ఆచరణ (క్రియ) సాధ్యమైంది. ఇలా అవసరం - భావం (ఆలోచన) - ఆచరణ (రూపం, క్రియ, ఫలితం) గొలుసుకట్టుగా మనిషి నిత్య దైనందిన జీవితంలో భాగమైంది.
మనిషి మాత్రమే తనకు కావాల్సిన సాధనాలను, ఆయుధాలను, పనిముట్లను తయారుచేసుకోగలడు. ఉపయోగించుకోగలడు. మెరుగైన జీవనం కోసం ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జీవితంలో అనివార్యమైంది. ఎప్పటికప్పుడు రుజువు అవుతున్న జ్ఞానంగా నిక్షిప్తమైంది.
ఎవరి అనుభవాలు వారికే గాక, మరొకరికి జ్ఞానంగా పరిణమించాయి. చరిత్రగా మారాయి. ఈ పారంపర్యత విస్తరణ అంతా కూడా కళాజీవితం (మానసికజీవితం)తో ముడిపడి ఉన్నది. ఆహార అన్వేషణలో, ఆవాసం, దుస్తులు వంటి ప్రాథమిక సౌకర్యాలు సమకూర్చుకోవడంలో జ్ఞానం అంతర్భాగమైంది.
ప్రకృతి రహస్యాలను ఛేదించడంలో, లోబరుచుకోవడంలో తనకు భౌతికంగా వశమయింది ప్రతిదీ విజ్ఞానంగా మారింది. తక్కినదంతా అజ్ఞానంగా మిగిలిపోయింది.
భౌతికవాదానికి విజ్ఞానం (నిరూపితమైన శాస్త్రజ్ఞానం) ప్రాతిపదిక అయితే భావవాదానికి అజ్ఞానం (కేవలం నమ్మకం) ప్రాతిపదిక అయింది.
విశ్వం అంతమా? అనంతమా?
ఈ ప్రశ్నకు సమాధానం మనిషికి ఇంకా దొరకలేదు. దొరుకుతుందా? లేదా? తెలియదు. అందుకే భావవాదం చాలా బలంగా మనిషిలో ఇప్పటికీ నాటుకుని ఉంటుంది. దీనికి ఆధ్యాత్మిక, ధార్మికత పేర్లు ఏవైనాగాని, మనిషికి అదో ఊరట. సాంత్వన.. ఓ బలం చేకూరింది.
ఓ అతీతమైన శక్తి (దైవం) ఏదో ఈ విశ్వాన్ని (లోకాన్ని) కాపాడుతుందనేది భావవాదం. ప్రతి మతానికి ఈ భావవాదమే పునాది.
పురాణ జ్ఞానమంతా ఏ దేశంలోనైనా ఇలాంటి నమ్మకాలు విశ్వాసాలు, కల్పనలతో (భావవాదంతో) మిళితమై ఉంటుంది. ఈ విశ్వాన్ని తమను కాపాడుతున్నదన్న ఆ అతీతమైన శక్తి (దైవం) చుట్టూ అల్లుకుని పోతుంది. మానవ సంబంధాలు, ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లుతో పాటు ఈ ధార్మిక (నైతిక) సూత్రాలు క్రతువులుగా, పూజావిధానాలుగా మారి సంస్కృతిగా చలామణి అవుతుంది.
ఇక అప్పుడు అది ఆ తెగ (జాతి - సమూహం) సంస్కృతిగా ఆకాలంలో స్థిరపడుతుంది. వ్యక్తం చేసే ఆలోచనలు, సంజ్ఞలు భాషగా అవతరిస్తుంది.
ఈ సంస్కృతిక పరిణామంలో నిత్యజీవితంలో ఆలోచనలు, భావాలు సింహభాగం ఆక్రమిస్తున్న విషయం కాదనలేని సత్యం.
అయితే ఆకలి తీరని అన్నార్తులకు, గర్భదరిద్రులకు, బాధితులకు, బానిసలకు, స్వేచ్ఛాయుతమైన కనీస అవసరాలు తీరే ఆరోగ్యకరమైన బతుకు చుట్టూ ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి.
ఇప్పటికీ కోట్లాది మంది అడవి బిడ్డలకు (ఆదివాసులకు) నగరజీవనంతో గాని, రాజ్యంతోగాని పెద్దగా సంబంధం ఉండదు. అందుకే ఇలా పాడుకుంటారు.
''అడవి తల్లికి దండాలో / మా తల్లి అడవికి దండాలో..
అడవి చల్లంగుంటే అన్నానికి లోటేలేదు
పంటలు ఇంటికి వస్తే.. పండుగ జేసుకుంటాము.''
ఇందులో జీవన సత్యం ఉంది. కాలానుగుణంగా ప్రకృతి శోభిల్లితే, వారి బతుకులూ పరిడవిల్లుతాయి. ఆరోగ్యానికి ఆనందానికి కొదవే ఉండదు. ప్రకృతి చల్లంగా ఉండాలనే భావన. చల్లంగా ఉంటేనే మనమూ చల్లంగా ఉంటామనే సత్యంతో కూడిన ఓ మానవీయ సార్వత్రిక భావన ఇది.
ఆఫ్రికా అడవుల్లో ఆదివాసికి ఎవరైన ఓ అపరిచితవ్యక్తి కనిపిస్తే చిరునవ్వుతో ముందుగా.. నేనున్నాను నీకు తోడుగా (ఉబంటూ) అని అంటాడు. అంటే అతని రక్షణ బాధ్యత ఈ ఆదివాసి తీసుకుంటున్నట్టు అర్థం. మనం అనుకునే 'బావున్నారా..' అనే చిన్న పలకరింపు వంటిది ఇది. అయితే ఇందులో మనిషిని మనిషి పట్టించుకునే తత్వం. మనిషి కోసం మనిషి నిలబడాలనే మనిషితనం అన్నీ గోచరమవుతాయి.మరి ఈ ఆదివాసుల (మూలవాసుల) సంస్కృతి మనకు ఏం పాఠం నేర్పుతుంది. ప్రకృతిని కాపాడుకోవాలని మనిషిని పట్టించుకోవాలని చెపుతుంది. కాగా, మరో ప్రక్క మనిషిలో వికృత స్వార్థం మొలుస్తూనే ఉన్నది. దోపిడీ, పీడన పద్ధతులను మార్చుకుంటూ మానవజాతిని బలి తీసుకుంటూనే ఉన్నది. ప్రకృతిని ధ్వంసం చేయడం, యుద్ధాలు, మారణహౌమాలు సృష్టించి మానవ హననానికి పాల్పడటం మనం గమనిస్తూనే ఉన్నాం.
భూముల కోసం, దేశాల కోసం, ఆధిపత్యం కోసం, లాభాల కోసం, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు, కష్టజీవులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ బాధలను అనుభవిస్తూనే ఉన్నారు. అయితే ఇందుకు ప్రతిగా రెండో ప్రక్క మనిషి (బానిస, బాధితుడు) తన విముక్తి కోసం, రక్షణ కోసం, హక్కుల కోసం సంఘటిత సమరశీల పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. మనుషులందరూ సమానమే. ఎవరూ ఎక్కువకాదు, ఎవరూ తక్కువకాదు అని గొంతెత్తి దిక్కులు పిక్కటిల్లేటట్టు నినదిస్తున్నాడు. స్థూలంగా చూస్తే.. ఘర్షణ ఇక్కడే కేంద్రీకృతం అయినట్టు కనిపిస్తుంది. ఒక మనిషి ఆధిపత్యం, ఆక్రమణ, వ్యక్తిగత స్వార్థంవైపు నిలబడితే అందుకు ప్రతిగా మరోమనిషి మానవజాతి విముక్తి రక్షణ, సమానత్వం కోసం నిలబడుతున్నాడు. అనాదిగా భావజాల ఘర్షణలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ 19వ శతాబ్దం ద్వితీయార్థంలో సంభవించిన మేడే చారిత్రక పోరాటం మనిషి జీవనానికి ఒక అర్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నించింది. భావవాద పరమైన తాత్విక దృక్పథాన్ని బ్రద్దలు కొట్టింది. క్రియాశీలతలేని ఆధ్యాత్మిక మెట్టవేదాంతాలను తుత్తునియలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వాదాన్ని పూర్తిగా పూర్వపక్షం చేసింది.
మనిషి బానిసకాడు. పశువు అంతకన్నా కాదు. గొడ్డూలా చాకిరి చేయడానికి రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాడు. ఎనిమిది గంటలు నిద్ర. మరో ఎనిమిది గంటలు బంధుమిత్రులతో, పిల్లలతో సంతోషంగా గడపాలి. అలా తనదైన జీవన ప్రస్థానం నిర్మించుకున్నాడు. తన సొంత (భావనా, మానసిక) ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించడానికి మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. మానవ వికాసానికి బాటలు పరుచుకున్నాడు. మనిషి యంత్రాలకు, పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. మనిషి యాంత్రీకరణ కావడానికి వ్యతిరేకం అని స్పష్టంగా తెలుసుకున్నాడు. స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటేనే ఉత్సాహంగా పనిచేస్తాడు. ఉత్పాదక శక్తిని పెంచుకోగలడు అని రుజువు చేశాడు. ఆధునిక వ్యవస్థలు, రాజ్యాలు ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి నడుం కట్టాలి. ప్రజలు ఆనందంగా భాగం పంచుకునే ప్రజాస్వామ్యం అంటే ఇదే.. అని తేల్చిచెప్పాలి.
ఆధునిక తాత్విక లక్ష్యం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దైవం స్థానంలో మానవుడు అవతరించాడు. కళా సాహిత్యాలకు మనిషే కేంద్రబిందువయ్యాడు. 'స్వార్థంతో ఎవడి లాభం వాడు చూసుకోవడం, పెత్తనం చెలాయించడం అన్నది నిన్నటి నీతి. అది బాగా గబ్బుపట్టి మళ్ళీ కంపు వాసనకొడుతుంది. శాంతి - సమభావం - సమిష్టి క్షేమం అనేది నేటి (ఆధునిక) నీతి. కవులు, కళాకారులు, రచయితలు ఈ ఆధునిక నీతిని పాదుకొల్పేందుకు పాటుపడాలి' అని మహాకవి శ్రీశ్రీ 70ఏండ్ల క్రితమే పిలుపు యిచ్చాడు. ఆ మార్గంలో నడిచి మార్గదర్శకుడయ్యాడు.
అభ్యుదయ కళాకారులకు, సంస్కృతిక ఉద్యమ కార్యకర్తలకు, ప్రజాస్వామ్యవాదులకు, కమ్యూనిస్టులకు విశ్వమానవ దృక్పథం అలవడింది. శిరోధార్యమైంది. విశ్వంలో ఎక్కడ పుట్టినా, పెరిగినా, మనుషులందరూ సమానమే. జాతి, మతం, కులం, వర్ణం, ప్రాంతం, లింగం, భాషా మొదలగు వైషమ్యాలు అసలు ఉండకూడదు. వాటికి అతీతంగా మానవీయంగా వ్యవహరించాలి. స్వార్థపూరిత సంకుచిత చట్రాల్లో బంధీకాకూడదు. భావజాలంగా ముందు తాను (కళాకారుడు / కార్యకర్త) విముక్తి అయితేనే ప్రజలను సకల వివక్షతల నుంచి విముక్తి చేసే మహా ప్రస్థానంలోకి ప్రవేశించగలడు. అలాకాని పక్షంలో ఏదో ఒక దుందుడుకు తనానికి, ఉన్మాదానికి, వివేచన,పునరాలోచన లేని మూర్ఖత్వానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేడు.
భౌతిక ప్రపంచంలో మార్పు తీసుకు రావాల్సినవారు ముందుగా భావజాల రంగంలో మార్పు తీసుకువచ్చేందుకు ఘర్షణపడాలి. ఈ ఘర్షణ తనలో ఉండాలి. బయటా ఉండాలి. రోజు రోజుకి సంక్లిష్టమవుతున్న ఈ ప్రాపంచిక సమాజంలో ఎవరు ఎలా అడుగిడుతున్నారు. ప్రజల్ని దోపిడీతో, పీడనతో, యుద్ధాలతో, మారణహౌమాలతో, హింసతో అగాధంలో నెడుతున్నది ఎవరు? ప్రజల హక్కుల్ని గౌరవిస్తూ, అందరూ సమానమనే ప్రజాస్వామ్య భావాలతో బాధితులకు రక్షణ కల్పిస్తున్నది ఎవరు? స్థూలంగా చూడాలి. సూక్ష్మంగా చూడాలి. తనలో కూడా చూసుకోవాలి (ఆత్మవిమర్శ). లోపాలుంటే సరిచేసుకోవాలి. చెప్పేదానికి చేసేదానికి వైరుద్యం ఉండకూడదు. అప్పుడే ప్రజలతో కలిసిమెలిసి పనిచేసే ఉన్నత ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటుంది. సంస్కృతిక వాతావరణం అనేది ప్రజల దైనందిన అలవాటుగా మారాలి. ఆ దిశగా మన ఆలోచన ఆచరణ ఉండాలి.
కె. శాంతారావు
సెల్: 9959745723