Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంటలు వేయడం ప్రారంభమై 45రోజులు గడిచిన తరువాత ఎట్టకేలకు 2020-21 సంవత్సరానికి 'పంటల రుణ ప్రణాళిక' జూలై 6న ప్రకటించింది ప్రభుత్వం. ప్రకటించే నాటికే రైతులు 65లక్షల ఎకరాలలో పంటలు వేశారు. మరో 45లక్షల ఎకరాలలో వరి వేయాల్సివుంది. ప్రభుత్వం ప్రకటించిన 'రుణ ప్రణాళిక' రైతుల పెట్టుబడులకు అనుకులంగా లేదు. రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా ఆదేశాల ప్రకారం బ్యాంక్ వ్యాపార ధనంలో 18శాతం పంట రుణాలు ఇవ్వాలి. మరో 22శాతం వ్యవసాయ అనుబంధ రంగాలకు, మైక్రో రుణాలకు ఇవ్వాలి. ప్రస్తుతం తెలంగాణ బ్యాంకులలో మార్చి 2020 నాటికి రూ.4,84, 440కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. రుణ ప్రణాళిక పంట రుణాల క్రింద రూ.53,222.51 కోట్లు, దీర్ఘకాలిక రుణాల క్రింద రూ.12,061కోట్లు మాత్రమే ప్రకటించింది. అనగా రుణ ప్రణాళిక బ్యాంకు వ్యాపార ధనంలో దీర్ఘకాలిక రుణాలతో కలిపి పరిశీలించగా 13.47శాతం మాత్రమే కేటాయించారు. ఒక పంట రుణాలను పరిగణనకు తీసుకుంటే 11శాతం మాత్రమే కేటాయించారు. ఈ విధంగా రుణ కేటాయింపులు తగ్గించారు. 2019-20 సంవత్సరంలో రూ.48,740 కోట్ల పంట రుణాలకు గాను రూ.37,109కోట్లు మాత్రమే (76శాతం) ఇచ్చారు. దీర్ఘకాలిక రుణాలకు కేటాయించిన రూ.11,445కోట్లకు రూ.3,430కోట్లు మాత్రమే ఇచ్చారు. ప్రకటించిన రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వడంలేదు. పైగా సకాలంలో రుణాలు ఇవ్వకపోవడం వలన రైతులు అధిక వడ్డీకి ప్రయివేట్ రుణాలు తెచ్చి వ్యవసాయం సాగిస్తున్నారు. ప్రయివేట్ వడ్డీ భారం భరించలేక ఏటా 700మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 59లక్షల మంది రైతులున్నారు. బ్యాంకులు 2014నుండి 2020 వరకు 32లక్షల మందికి మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. మిగిలిన 27లక్షల మందికి రుణాల లభ్యత లేదు. వానాకాలం, యాసంగి కలిపి ఖాతాలు లేక్క వేయగా 47-49లక్షల రైతులకు మించడంలేదు. అందువల్ల దాదాపు సగం మంది రైతులు నేటికి బ్యాంకు గడప తొక్కడంలేదు. రైతులందరికి రుణాలు ఇస్తున్నామని ప్రకటిస్తున్న మోసాన్ని ఈ అంకేలే బట్టబయలు చేస్తున్నాయి. పైగా రుణాలు ఇవ్వాడానికి 'స్కేల్ ఆఫ్ పైనాన్స్' పద్దతి అనుసరించడం లేదు. అసలు స్కేల్ ఆఫ్ పైనాన్స్ను బ్యాంకులు ఏనాడూ గుర్తించడంలేదు. ఎన్ని ఎకరాలు తాకట్టు పెట్టినా 25 వేల నుంచి 3లక్షల లోపు మాత్రమే రుణాలు ఇస్తున్నారు. 25లక్షల లోపు రుణాలు పొందినవారు 5.83లక్షల మంది కాగా, 50వేల లోపు రుణాలు పొందిన వారు మరో 8.14లక్షల మంది ఉన్నారు. వీరు కాక 50 వేల నుంచి లక్ష లోపు రుణాలు పొందిన వారు 16లక్షల మంది ఉన్నారు. అనగా 30లక్షల మందికి లక్ష రూపాయలలోపు రుణాలు ఇస్తున్నారు. ఈ రుణాలు 2ఎకరాల పెట్టుబడికి కూడా సరిపోవు. బ్యాంక్లు రుణాలు ఇచ్చినప్పటికి వారు కూడా ప్రయివేట్ రుణాల వైపు వెళ్ళాల్సివస్తున్నది. ఇప్పటికి రైతు సంఘం సర్వే ప్రకారం 22వేల కోట్ల ప్రయివేట్ రుణాలలో రైతులు కూరుకుపోయారు. వడ్డీ రూ.100కు సంవత్సరానికి రూ.36 రూపాయాల నుంచి రూ.45 చెల్లించాలి. ఆదిలాబాద్లోని 'దలాల్' వ్యవస్థ ఇందుకు మంచి ఉదాహరణగా ఉంది. ఈ వడ్డీ విధానం ప్రభుత్వానికి తెలియనిది కాదు. అయినా వ్యవసాయశాఖ మంత్రి, ఆర్థిక మంత్రి తాము రుణ ప్రణాళిక ద్వారా రైతుల పెట్టుబడికి నిధులు సమకురుస్తున్నామని ఆపోహ పడుతున్నారు. బ్యాంకులు ఇస్తున్నది రుణాలే తప్ప రాయితీలు కాదు. తిరిగి రైతులు వడ్డీతో సహ చెల్లించాల్సిందే. ఆయినా రిజర్వు బ్యాంకు ఆదేశాల అమలు లేదు.
రైతులకు బ్యాంకులు ఇస్తున్న రుణాలపై వడ్డీ 9శాతం నిర్ణయించి అందులో 4శాతం కేంద్ర ప్రభుత్వం, 2శాతం రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించిన వారికి రాయితీ ఇస్తున్నవి. మిగిలిన 3శాతం రైతు చెల్లించాలి. ప్రభుత్వాలు బడ్జెట్లలో కేటాయింపులు చూపినప్పటికిని సకాలంలో బ్యాంకులకు విడుదల చేయకపోవడం వలన, బ్యాంకులు రైతుల నుంచి బలవంతంగా వడ్డీ వసూళ్ళ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా 12వేల నుంచి 15 వేల కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.250కోట్ల వరకు కేటాయింపులు చేస్తున్నది. అయినా సకాలంలో బ్యాంకులకు చెల్లించడంలేదు. రైతాంగం ఆందోళన చేస్తే తప్ప నిధులు విడుదల కావు. ఏటా వడ్డీ మాఫీ నిధుల రాబాడికి ఆందోళనలు కోనసాగించాల్సి వస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రుణ ప్రణాళిక ప్రకటించి అమలు చేయకపోవడం వలన రైతులు పంటల బీమాకు నష్టపోతున్నారు. మెట్ట పంటలకు జూలై 31 వరకు, వరి పంటకు ఆగష్టు 30 వరకు ప్రీమియం చెల్లించాలి. ప్రస్థుతం రుణం పోందిన వారినుండి మాత్రమే బీమా ప్రీమియం వసూళ్ళ చేస్తున్నారు. రాష్ట్రంలో 2018-19 వానాకాలం సాగులో 6లక్షల మంది, యాసంగిలో 2.16లక్షలమంది మాత్రమే ప్రీమియం చెల్లించారు. రుణం పోందనివారు పంటల బీమా పరిహారం వస్తుందన్న నమ్మకంలేక ప్రీమియం చెల్లించడంలేదు. ఏటా ప్రకృతి వైపరిత్యాల వలన కనీసం 320మండలాలలో రూ.4-5వేల కోట్ల పంటలు నష్టపోతున్నారు. అయినా పరిహారం రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగానికి సంబందించి సమగ్ర ప్రణాళిక, రుణ ప్రణాళిక సకాలంలో ప్రకటించి, అమలు జరపాలన్న లక్ష్యశుద్దిలేదు. మే 15 నాటికే ప్రణాళికలన్ని విడుదల చేయాలి. నాణ్యతగల విత్తనాలను అందుబాటులోకి పెట్టాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం, బలహీన విధానాల వలన ఏటా 30 వేల క్వింటాల నాణ్యత లేని విత్తనాలు విజిలెన్స్ శాఖ పట్టుకుంటుంది. ఇంతవరకు ఒక్కరికి శిక్ష పడలేదు. ప్రభుత్వ అండ వారికి ఉండడమే ప్రధాన కారణం.
అప్పులు ఇప్పించడంలో నాబార్డు కీలక పాత్ర పోషించాలి. గ్రామ స్థాయి వ్యవసాయ సహకార సంఘాలకు రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకుల నుండి అప్పులు ఇప్పించాలి. రాష్ట్రంలో 907 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. 15 లక్షల మంది సభ్యులున్నా వారికి అప్పు రావడంలేదు. సహకార వ్యవస్థ చిన్నా, బిన్నం కావడానికి రాజకీయాల ప్రవేశం ఎక్కువగా కారణమవుతోంది. దానిని తగ్గించడంలో నాబార్డు, రాష్ట్ర సహకార బ్యాంకు శ్రద్ధ చూపడంలేదు.
ప్రభుత్వం స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం రైతులందరికీ రుణాలు ఇవ్వాలి. రుణ మాఫీని తన ఖాతాలో వేసుకోవాలి. అందరికీ పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. రుణ ప్రణాళికను మే 15లోపు తీసుకురావాలి. కౌలు రైతులతో పాటు, హర్టికల్చర్ రైతులకు, కూరగాయాల రైతులకు, పాడి రైతులకు రుణాలు ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్షలోనూ, జిల్లా కమిటీ సమీక్షలోనూ బ్యాంకుల రుణ పంపిణీపై వివరమైన నివేదిక రుపొందిచాలి. రైతు బంధు సమన్వయ కమిటీలలో ఈ నివేదికను చర్చకు పెట్టాలి. రుణ మాఫీ కమీషన్కు ఈ నివేదిక ఇవ్వాలి. కనీసం రుణమాఫీ కమీషన్ రుణాల పంపిణీలో బాధ్యత తీసుకోని బ్యాంకులు అనుసరిస్తున్న తప్పడు విధానాలను అరికట్టి, రైతులందరికీ రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునేవిధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. పంటల బీమా పథకాన్ని మొత్తం రైతులకు ఉపయోగపడేవిధంగా అమలు జరపాలి. అప్పడే ఈ రుణ ప్రణాళిక ప్రకటించడం సార్థకం అవుతుంది. రైతులను ప్రయివేట్ రుణాలవైపు వెళ్ళకుండా నివారించి వారి ప్రయివేట్ రుణాలను సంస్థగత రుణాలుగా మార్చడానికి ప్రణాళిక రుపొందించి అమలు చేయాలి.
ఎం. శోబన్ నాయక్
సెల్: 9949725951