Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రైయివేట్ టీచర్ల పరేషాన్...
- వేతనాలు లేక వెతలు...
- ఆత్మహత్యలే శరణ్యం
- మోడల్ స్కూల్ టీచర్లకు అందని వేతనం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రయివేట్ పాఠశాలల ఉపాధ్యాయులు రోడ్డున పడిండ్రు. ఏడు మాసాలుగా వేతనాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతుండ్రు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన పోతు కిషోర్ అనే ప్రయివేట్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకుండు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తుండ్రు. జీఓ నెంబర్ 45 చట్టం 1897 వేతనాలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. బుధవారం జనగామలో బతుకమ్మ ఆటలాడి నిరసన తెలిపారు. ఇక మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సైతం వేతనాలు ఇవ్వకపోవడం లేదు. వారు సైతం రోడ్డున పడిన పరిస్థితి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వేలకు పైగా ప్రయివేట్ పాఠశాలలు ఉన్నాయి. 10వేలమందికి పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మార్చి 21 నుంచి లాక్డౌన్ కావడంతో పాఠశాలు మూత పడ్డాయి. ఏప్రిల్ నుంచి వేతనాలకు ఇబ్బంది తలెత్తింది. ఏడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో పూటగడవని పరిస్థితి. దీంతో కుటుబపోషణకు అప్పులు చేశారు. ఆత్మహత్య చేసుకున్న కిషోర్ సైతం అప్పులు చేసి తీర్చలేదు. అప్పుల బాధలు భరించలేకనే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. తమ గోడు పట్టించుకోవాలని వివిధ రూపాల్లో ఆందోళనలు చేయగా ఇటీవల మంత్రి కేటీఆర్ స్పందించారు. పాఠశాలల యాజమాన్యాలు మానవతాదృక్పథంగా పరిగణించి వేతనాలు ఇవ్వాలని సూచిం చారు. అయినా ఏ ఒక్క యాజమాన్యం స్పందించలేదు. ప్రభుత్వం సైతం ఆదుకోలేదు.
ఇతర పనుల్లో ఉపాధ్యాయులు
ప్రయివేట్ పాఠశాలల్లోనూ అధిక వేతనాలు పొందే ఉపాధ్యా యులు ఉన్నారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ చెప్పే ఉపాధ్యాయులకు రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు ఉన్నాయి. డివిజన్ కేంద్రాల్లో నిర్వహించే పాఠశాలల్లో సైతం రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వేతనాలు పొందే ఉపాధ్యా యులు ఉన్నారు. మార్చిలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో రెండు నెలలు చూశారు. ఇతర పనుల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి రావడంతో కొందరు కిరాణం కొట్లు పెట్టగా కొందరు కూరగాయలు అమ్మారు. కొందరు అల్లం వెల్లిగడ్డ వంటివి సైతం అమ్మిన పరిస్థితి. జనగామలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో పనిచేసే క్రాంతికుమార్ అనే మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడు కిరాణం షాపు పెట్టారు. ఓ పీఈటీ కూరగాయలు విక్రయిస్తున్న పరిస్థితి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పనిచేసుకుంటూ జీవిస్తున్నా పూట గడవని పరిస్థితి.
వివిధ రూపాల్లో ఆందోళనలు
ప్రయివేట్ పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఇటీవల ఏకశిలా పార్కులో ధర్నాలు చేశారు. కలెక్టర్ ముందు నిరసన తెలిపారు. రాస్తారోకోలు చేశారు. చివరకు మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి కేటీఆర్ స్పందించి యాజమాన్యాలతో మాట్లాడినా స్పందన లేకపోవడంతో ఏమీ చేయలేక మళ్లీ ఆందోళన బాట పట్టిన పరిస్థితి. వివిధ వృత్తుల్లో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకుంటోంది. అదే విధంగా ఉపాధ్యాయులు విజ్ఞానాన్ని పంచేవారు. ఏడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నందున కొంత మేరకైనా స్పందించి ఆర్థిక సాయమందిస్తే బాగుంటుందని వివిధ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
మోడల్ స్కూల్ విద్యార్థులకు అందని వేతనం
ప్రయివేట్ టీచర్లకు వేతనాలు యాజమాన్యాలు ఇవ్వాల్సి ఉండగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వమే ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు కస్తూర్బా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, నాన్ స్టాఫ్ సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారు. మోడల్ స్కూళ్లు నడవకపోయినప్పటికీ ప్రభుత్వ పరిధిలోనే పనిచేసే ఉపాధ్యాయులు కావడంతో వేత నాలు ఇవాల్సి ఉన్నా ఇవ్వట్లేదు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాల యాలతోపాటు, విద్యాశాఖ కార్యాలయాల ముందు ఆందోళనలు చేసి నిరసనలు తెలిపిన పరిస్థితి.
ప్రయివేట్ ఉపాధ్యాయుల్ని ఆదుకోవాలి : క్రాంతికుమార్
ప్రయివేట్ ఉపాధ్యాయుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రైయివేట్ ఉపాధ్యాయులు సంఘం నాయకుడు క్రాంతికుమార్ కోరారు. పాఠశాలు లేకపోవడం ఒక విపత్తుగానే ప్రభుత్వం భావించాలన్నారు. కేవలం విజ్ఞానాన్ని పంచడమే వృత్తిగా పనిచేస్తున్నామన్నారు. అనేక రకాల విపత్తులకు ప్రభుత్వం ఆర్ధికంగా సహాయం చేస్తుందన్నారు. తమను సైతం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏడు నెలలుగా అవస్థలు పడుతూ పూటగడవని స్థితిలో ప్రయివేట్ ఉపాధ్యాయ కుటుంబాలు ఉన్నాయన్నారు.