Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ అనుమతి లేకుండా ట్రాక్టర్ యాజమానులతో దందా..
- ఒక్క రోజే వందల ట్రిప్పుల అక్రమ రవాణా !
- కమలాపరం, మంగపేటలో డంప్
నవతెలంగాణ-మంగపేట
రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ విధుల్లో లేని రోజులను ఆసరా చేసుకుని ఓ వీఆర్ఏ మండలంలోని ఇసుక సిండికేటుతో చేతులు కలిపి మంగపేట గౌరారం వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు ఇసుక సిండికేటు ట్రాక్టర్ యజమానులకు సహాకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మండలంలోని మిర్చీ రైతులకు కల్లాల్లో ఇసుకను ఉచితంగా తోలుకునేందుకు తహసీల్దార్ అనుమతించారు. కొన్ని రోజులుగా స్వంత ట్రాక్టర్లున్న రైతులు ఇసుక తోలు కుంటుండగా ట్రాక్టర్లు లేని రైతులు సిండికేటు ట్రాక్టర్ యజమానులను సంప్రదిస్తున్నారు. దీంతో రైతు పేరుతో పది ట్రాక్టర్లు తోలి మరో పది ట్రాక్టర్లను ఎలాంటి డీడీలు లేకుండా కమర్షియల్ పనులకు, ప్రైవేటు ఇండ్ల నిర్మాణాలకు, సిమెంట్ ఇటుక తయారీ యజమానులకు తోలుతూ సిండికేట్లు క్యాష్ చేసుకుంటు న్నారు. ఇసుక సిండికేటు ట్రాక్టర్ యజమానులకు వీఆర్ఏ సహాకరించడంతోనే సిండికేటు యజమానులు ఇసుకను యదేశ్చగా గౌరాంవాగును తోడేస్తున్నరనే ఆరోపణలున్నాయి. ఒక ట్రాక్టర్ ఇసుకకు ప్రభుత్వానికి రూ.954 డీడీ తీసి ప్రయివేటు వ్యక్తులకు తోలితే మండలంలోని దూరాన్ని బట్టి రూ.2 వేల నుండి రూ.25 వందలు యజమానులు తీసుకుంటున్నారు. కాగా పత్రికల్లో వస్తున్న వరుస కథనాలతో తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ కేవలం రైతులకు మాత్రమే పట్టా బుక్కులపై ఉచితంగా కల్లాలకు ఇసుక తోలుకు నేందుకు వెసులుబాటు కల్పించారు. దీంతో ఇసుక సిండికేటు ట్రాక్టర్ యజమానులు కొన్ని రోజులుగా తహసీల్దార్ విధుల్లో ఉండగా గౌరారం వాగు వంక చూడలేదు. మిర్చీ రైతులను ఆసరా చేసుకున్న ఇసుక సిండికేటు ట్రాక్టర్ యజమానులు వీఆర్ఏను మచ్చిక చేసుకుని కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిసింది. రైతుల పేరుతో ధరఖాస్తు చేస్తూ వారి అవసరాల మేరకు 5 నుండి 10 ట్రాక్టర్ల ఇసుకను వారికి తోలి మధ్యలో మరో 20 ట్రిప్పులు ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి డీడీలు ప్రభుత్వానికి చెల్లించకుండా దందాను యదేశ్చగా కొనసాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బుధవారం స్థానిక తహసీల్దార్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ కు వెళ్లగా ఉదయం నుండి వందల ట్రిప్పులు ఇసుకను యదేశ్చగా మండలంలోని మంగపేట, కమలాపురంలలో పలు చోట్ల డంప్ చేశారు. తహసీల్దార్ లేకుండా ఇసుక ఎలా తోలుతున్నారనే అనుమానంతో వేబిల్ చూడగా 2021 జనవరి 9న తీసుకున్న దాన్ని చూపి వీఆర్ఏ తోలుకోమన్నాడంటూ సమాధానమిస్తున్న పరిస్థితి. కమలాపురంలోని ఓ వాడలో సీసీ రోడ్డు కొరకు మండల కేంద్రంలోని గౌరారంవాగు నుంచి 2 ట్రిప్పులకు మాత్రమే డీడీ తీయగా తహసీల్దార్ అనుమతించారు. ఆ వేబిల్ తో అప్పుడే ఇసుక తోలుకున్న కాంట్రాక్టర్ తాజాగా బుధవారం అదే వేబిల్లుతో మండల కేంద్రానికి చెందిన ఓ సిండికేటు ట్రాక్టర్ యజమానికి చెందిన 2 ట్రాక్టర్లతో సుమారు 50 ట్రిప్పులకు పైగా ఇసుకను పెట్రోల్ బంక్ సమీపంలో ప్రధాన రహదారిపై డంప్ చేశారు. మండలంలో జరుగుతున్న ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి ఇసుకాసురుల భరతం పట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.