Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుప్పుపట్టి విరిగిన పెద్దతూము షెట్టర్ రాడ్
- ఆందోళనలో ఆయకట్టు రైతులు
నవతెలంగాణ-నర్సంపేట
మాధన్నపేట పెద్దచెరువుకు ప్రమాదం పొంచి ఉంది. శిథిలావస్థలో ఉన్న పెద్దతూము షెట్టర్ రాడ్ ఉన్న ఫలంగా విరిగిపోయింది. దీంతో షెట్టర్ తూము కింది భాగంలో కుదించుకుపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులోకి 16.10 అడుగుల నీరు చేరుకుంది. ఖరీఫ్, రబీ పంటలు పండేందుకు ఢోకా లేదని రైతులు సంతోషపడుతున్న ప్రస్తుత తరుణంలో తూము రాడ్ విరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం షెట్టర్కు రాడ్ను తిరిగి బిగించడం సవాలుగానే నిలు స్తోందని చెప్పక తప్పదు. 17 అడుగుల లోతులోని తూము అడుగు భాగం లో బిగుసుకుపోయిన షెట్టర్కు రాడ్ను బిగించే విషయమై సాధ్యా సాధ్యాలపై ఇంజనీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మర మ్మతుల కోసం హైరానా పడుతున్న పరిస్థితి నెలకొంది. సాధ్యంకాని పక్షం లో ఖరీఫ్లో ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం ప్రశ్నార్థకంగానే నిలువనుంది. మరో ఇంచున్నరకు నీరు చేరితే అలుగుపడుతుంది. ఆపై వర్షాలకు వచ్చే నీటిఉధృత్తి పెరిగితే అనివార్యంగా తూము షెట్టర్ లేపక తప్పదు. లేకపోతే చెరువును రక్షించుకోవడం సాధ్యం కాదు. ఈ షెట్టర్ రాడ్ విరిగి పోయిన క్రమంలో ప్రస్తుతం నీటి అడుగుభాగంలో బిగిసి పోయిన షెట్టర్ను లేపడం సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థి తుల్లో చెరువు ప్రమాదగడియల అంచుకు చేరిపోయే అవకాశం ఉంది.
శిథిలమైనా పట్టింపు కరువు..
కొన్నేళ్లుగా పెద్దతూము శిథిలావస్థలో ఉన్నా ఐబీ ఇంజనీర్ల పట్టింపు కొరవడింది. కొన్నేళ్లుగా తూముకు మరమ్మతు చేయాలని రైతులు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. రెండో విడత మిషన్ కాకతీయలో రూ.7.5 కోట్ల నిధులు మంజూరు కాగా రైతులు చెరువుకు పూర్వవైభవం వస్తుందని ఆశించారు. గత వేసవిలో కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టినా అసంపూర్తిగానే నిలిచాయి. కేవలం కట్టపనులు, నామమాత్రంగా పూడికతీత పనులు చేపట్టారు. ప్రమాదం పొంచి ఉన్నట్లు సూచికలు తెలియజేస్తున్నా పెద్దతూము నిర్మాణ పనులు చేపట్టకుండా వదిలేశారు. తూముకు రాతి గోడలు పగిలిపోయి కూలే దశలో ఒంగిపోయి కన్పిస్తున్నా ఏనాడు మరమ్మతు చేసిన దాఖల్లాలేవు. ఇసుకబస్తాలతో తాత్కాలికంగా మరమ్మతు చేసి చేతులు దులిపేసుకున్నా రన్న విమర్శలున్నాయి. అనేక యేండ్ల క్రితం అమర్చిన తూము షెట్టర్ శిథిలమై ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు చేయలేదు. షెట్టర్ కింది భాగం నుంచి పెద్దఎత్తున నీరు లీకై వృథాగా పోతున్నా చర్యలు చేపట్టలేదు. ఇంతకాలం ఇలా ఉంటే మిషన్ కాకతీయలో ముందు చేపట్టాల్సిన పనులకు ప్రాధాన్యతివ్వకుండా లాభసాటి పనులు చేసి వది లేశారనే విమర్శలు రైతుల నుంచి వెలువడుతున్నాయి. కాంక్రీట్తో నిర్మిం చాల్సిన తూము వదిలి మట్టి పనులే చేసి జేబులు నింపుకున్నారనే విమ ర్శలూ ఉన్నాయి. ఇంజనీర్ల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఫలితంగా నేడు ఖరీఫ్ పంట సాగు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పక తప్పదు. ఖరీఫ్లో చెరువు కింద 3200 ఎకరాల ఆయకట్టులో రైతులు వరి సాగు చేశారు. మరి కొద్ది రోజులకు వరి పంటకు తూము నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తూము అడుగు భాగంలోని షెట్టర్కు రాడ్ బిగించి లేపడమనేది సవాళ్లతో కూడుకున్న పని. గజ ఈతగాళ్ల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. గంటల తరబడి నీళ్లలో ఉండి కొత్త రాడ్ బిగించాల్సి ఉంది. సాధ్యం కాని పరిస్థితుల్లో చెరువులో నీరు బయటకు పంపిస్తే తప్ప తూము షెట్టర్ మరమ్మతు సవ్యంగా సాగే అవకాశం లేదని రైతులు తెలిపారు. మరమ్మతు పనుల్లో అధికారులు నిమగమైనప్పటికీ ఏమేరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సిందే.