Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీవీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శేషు
- కాజీపేట చౌరస్తాలో కరపత్రం విడుదల
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట పట్టణానికి ప్రభుత్వం జూనియర్, డిగ్రీ కళాశాలలు మంజూరు చేయాలని తెలంగాణ విద్యార్థి సేన (టీవీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తిరుణహరి శేషు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని కాజీపేట చౌరస్తాలో గురువారం విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శేషు మాట్లాడారు. పట్టణంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం వల్ల కాజీపేటతోపాటు పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేయకపోవడంతో టేకులగూడెం, సోమిడి, తరాలపల్లి, కడిపికొండ, తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు పదో తరగతి అనంతరం దూర ప్రాంతాల్లోని కళాశాలల్లో విద్యను అభ్యసించడంలో ఇబ్బందులు ఎదుర్కోలేక చదువులకు దూరమౌతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. కాజీపేట రైల్వే జంక్షన్గా దశాబ్దాలుగా ప్రజల రాకపోకలకు కేంద్రంగా నిలవడమే కాకుండా పలు గ్రామాలకు పెద్దదిక్కుగా ఉందని చెప్పారు. సుమారు 20 గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతిరోజూ కాజీపేటకు వచ్చి వెళ్తారని, ఈ పరిస్థితుల్లో విద్యార్థుల అవసరాలు తీర్చేలా జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. స్వరాష్ట్రంలోనూ ప్రభుత్వం కాజీపేటలో జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు కోసం చొరవ చూపకపోవడం దారుణమన్నారు. వరంగల్, హన్మకొండలోని పదుల సంఖ్యలో కళాశాలలు ఉండగా కాజీపేటలో ఒక్కటీ ఏర్పాటు చేయలేదని తెలిపారు. కాజీపేటలో జూనియర్ కాలేజీ లేకపోవడం పాలకుల వివక్షకు నిదర్శనమన్నారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి పవన్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు రమాకాంత్, అనిల్, డానియెల్, రంజీత్, సంతోష్, వినరుచారి, శ్రీనివాస్, అజరు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.