Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఎన్నికల ముందు దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు భూక్య సమ్మయ్య విమర్శించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయబ్ తహసీల్ధార్ వివేక్కు వినతిపత్రం అందజేశారు. సమ్మయ్య మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడున్నరేండ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందని దుయ్యబట్టారు. దేశంలో అ శాంతి పెంచుతూ దళిత, మైనార్టీలపై దాడులకు పాల్పడున్నదని విమర్శించారు. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల ధనాన్ని తెప్పిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాకపోగా పెద్ద నోట్ల రద్దుతో దేశాన్ని అతలాకుతలం చేశారని విమర్శించారు. యేడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదాత్తం చేశారని దుయ్యపట్టారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నదని అన్నారు. గోరక్ష దళాలను పెంచిపోషిస్తూ దళితులు, మైనార్టీ వర్గాలపై దాడులను చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ సంజీవ, బుర్రి ఆంజనేయులు, బెంబరి మల్హాల్రావు, పెండ్యాల సారయ్య, దేశిని రాములు, జినుకల చంద్రమౌళి, బస్తి మొగిలి, సాంబశివరెడ్డి, రాజు తదితరులున్నారు.