Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమంటూ విమర్శలు
- రైతులకు కనీసం రూ.20 కోట్ల రుణాలివ్వని దైన్యం
- రూ.30 కోట్లు డిపాజిట్ల ఉపసంహరణ
నవతెలంగాణ-హన్మకొండ
జిల్లా కేంద్ర సహకార (డీసీసీ) బ్యాంకు నిర్వీర్యం దిశగా సాగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బ్యాంకు నుంచి ఖరీఫ్లో పంట పండించేందుకు అవసరమైన రుణాలు అందక రైతులు తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ అర్బన్ జిల్లాలోని డీసీసీ బ్యాంకు పరిధిలో 10 శాఖలు ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాల ఆరోపణలతో బ్యాంకు పాలకవర్గాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి మూడు సార్లు పాలకవర్గం రద్దైన, కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్న పరిణామాలు రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, కాంగ్రెస్ నాయకుడైన జంగా రాఘవరెడ్డి నడుమ రాజకీయ పోరులో భాగంగా బ్యాంకును వేదికగా చేసుకుంటున్నారంటూ రైతులు బహిరంగం గానే మండిపడుతున్నారు. ఏటా ఖరీఫ్ ప్రారంభంలో రైతులకు దాదాపు రూ.100 కోట్ల మేరకు పంట రుణాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ప్రభుత్వానికి, పాలకవర్గానికి నడుమ జరుగుతున్న పోరు కారణంగా ప్రస్తుత ఖరీఫ్లో రైతులకు కనీసం రూ.20 కోట్ల మేరకు కూడా రుణాలివ్వని దయనీయ స్థితి నెలకొందంటూ పేర్లు చెప్పడానికి ఇష్టపడని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే మరోవైపు బ్యాంకు పట్ల పలు రకాల అనుమానాలతో ఖాతాదార్లు డిపాజిట్ల ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దాదాపు రూ.30 కోట్ల మేరకు డిపాజిట్లు ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహాలో బ్యాంకు లావాదేవీలు కొనసాగితే త్వరలోనే బ్యాంకు నిర్వీర్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయని డైరెక్టర్లు, రైతులు వాపోతున్నారు. కేవలం ఇద్దరి వ్యక్తిగత రాజకీయ కక్షాకార్పణ్యాల కారణంగా వందేండ్ల చరిత్ర కలిగిన బ్యాంకును అభాసు పాల్జేయడం సరికాదని డిపాజిటర్లు, ఖాతాదార్లు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు ఎవరికి రుణాలివ్వాలో? ఎవరికి రుణాలివ్వొద్దో? తెలియని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో పహాణీల ఆధారంగా రైతులకు రుణాలు అందజేసే పరిస్థితి ఉండేది. మారిన పరిస్థితుల్లో వీఆర్వో నుంచి మొదలుకొని ఆర్డీఓ వరకు తనిఖీలు చేసి అనంతరం వ్యవసాయ అధికారి సిఫార్సుల మేరకు రుణాలు మంజూరు చేయాలన్న నిబంధన ముందుకు రావడంతో రైతులు కాళ్లకు చెప్పులు అరిగేలా ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా రుణాలు మంజూరు కావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక విచారణ చేపట్టి రుణాల మంజూరీలో మెరుగైన మార్గదర్శకాలిచ్చి రైతులను ప్రయివేటు ఫైనాన్సుల పాలు కాకుండా కాపాడాలని కోరుతున్నారు.