Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ల వేతనం పెంపునకు ప్రతిపాదనలు
- మున్సిపల్ కార్మికులకు రూ.12, 500లకు వేతనం పెంచుతూ నిర్ణయం
- సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) ధర్నా
- వాడీవేడిగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-కార్పొరేషన్
నగరపాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. కార్పొరేటర్ల వాదాలు, ప్రతివాదాలు, ఆరోపణల మధ్య ప్రజా సమస్యలు పక్కదారి పట్టాయి. ఈ క్రమంలో 5వ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది.
సమావేశంలో కమిషనర్ శృతి ఓజా, ఎక్స్అఫిషియో సభ్యులు వరంగల్ తూర్పు నియోకవర్గం ఎమ్యెల్యే కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజక వర్గం ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్ పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశం గంట ఆలస్యంతో ప్రారంభమయ్యింది.
మృతి చెందిన కార్పొరేటర్లకు, నేతలకు నివాళి
ఇటీవల మృతి చెందిన కార్పొరేటర్ అనిశెట్టి మురళి, అనారోగ్యంతో మృతి చెందిన నాగేశ్వర్ రావు, మాజీ మంత్రి బొచ్చు సమ్మయ్య, మాజీ ఎమ్యెల్యే రాజయ్య, మాజీ కార్పొరేటర భూపతి రాజీరమ్మ మృతికి మౌనం పాటించి సంతాపం తెలిపారు. వారి సేవలను ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కొనియాడారు. అనంతరం అధికారులు సహకరించడం లేదని, తమ తమ డివిజన్లలో అభివృద్ధి పనులు జరగడం లేదని కార్పొరేటర్లు వాపోయారు.
సమస్యలు పరిష్కరించాలి : కార్పొరేటర్లు స్వాతి రెడ్డి, భాగ్యలక్ష్మి
డివిజన్లలోని సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కొర్పొరేటర్లు స్వాతిరెడ్డి, భాగ్యలక్ష్మి అన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని నోటికి నల్ల రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు.
మేయర్ మాట్లాడుతూ ఎజెండా తరువాతనే డివిజన్ సమస్యలు మాట్లాడాలని అన్నారు. మొదటగా గత కౌన్సిల్ సమావేశం తీర్మాణాల ఆమోదం, అకౌంటెంట్ జాకీర్ ఉస్సేన్ ప్రమోషన్, ఉద్యానవన విభాగం 2017-18 సంవత్సరానికి 10 లక్షల మొక్కలకు రూ.65 లక్షల 62 వేల మంజూరు, ఇంజనీరింగ్ విభాగం క్రాప్ మెటిరీయల్ కోసం పబ్లిక్ ఓపెన్ యాక్షన్ టెండర్కు సభ ఆమోదం తెలిపింది.
నగరపాలక సంస్థ ప్రభుత్వ వాహనాలకు సూపర్బజార్ ద్వారా పెట్రోల్ సరఫరా చేసేలా సభ్యులు ఆమోదం తెలపాలని ఎమ్మెల్యే వినరు భాస్కర్ కోరారు. దాంతో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
అన్నపూర్ణ పథకంపై తనిఖీలు చేయాలని ఎమ్యెల్యే కొండా సురేఖ సూచించారు. నగరంలో అమలవుతున్న అన్నపూర్ణ పథకం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా వినరు భాస్కర్ మాట్లాడుతూ అన్నపూర్ణ సెంటర్లను పెంచాలని కోరారు. అన్నపూర్ణ పథకం అమలుకు కార్పొరేటర్ చైర్మన్గా, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో కమిటీ వేయాలని మేయర్ సూచించగా సభ ఆమోదం తెలిపింది.
పారిశుధ్యం కార్మికుల జీతాలు పెంపు
నగరంలో పనిచేస్తున్న పారిశుధ్యం కార్మికుల జీతాలు రూ.8,300 నుంచి రూ.12,500లకు పెంపుతూ తీర్మాణం చేయగా కార్పొరేటర్లు దేవేందర్, బయ్య స్వామి, బోడ డిన్నా, జోరిక రమేష్, మాధవి, చింతల యాదగిరి, దామోదర్ యాదవ్, స్వాతిరెడ్డితో పలువురు కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు రెండుసార్లు జీతాలు పెంచారని వేముల శ్రీనివాస్ అనగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు బయ్య స్వామి, బోడ డిన్నా, చింతల యాదగిరిలకు.. కాంగ్రెస్ కార్పొరేటర్ రాజు నాయక్ల మధ్య వాగ్వివాదం జరిగింది.
కార్పొరేటర్లుకు జీతాలు పెంచాలి
కార్పొరేటర్లుకు రూ. 50 వేలకు జీతం పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు పంపాలని కార్పొరేటర్లు నిర్ణయించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు ఆనందం వ్యక్తం చేశారు.
కార్పొరేటర్లు చెప్పిన సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని బీజేపీ కార్పొరేటర్ స్వాతి రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. వినయభాస్కర్ కల్పించుకొని సమస్యలు పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు.
నగరంతో పాటు విలీన గ్రామాలకు ఒకే ఇంజనీరింగ్ అధికారులు ఉండడం వలన సమస్యలు ఉత్పన్న మవుతున్నాయని ఎమ్యెల్యే సురేఖ తెలిపారు. మరొకొంతమందిని నియమించాలని కోరారు.
సమస్యలు పరిష్కారానికి సీపీఐ(ఎం) పట్టు
నగరంలోని 27వ డివిజన్లోని ఓఎస్నగర్లో గల డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలు తీర్చాలని సీపీఐ(ఎం) అర్బన్ జిల్లా కమిటీ సభ్యులు సింగారపు బాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డివిజన్ సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ శృతిఓజాకు వినతి పత్రం అందించారు. ధర్నాలో పార్టీ నాయకులు బషీర్, విజయ, తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, ఇన్చార్జి ఎస్ఈ భిక్ష్షపతి సిటీ ప్లానర్ చంద్రిక, ఎంఎచ్వో రాజారెడ్డి పాల్గొన్నారు.