Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కానిరాని పీసీఈ విధానం శ్రీ సన్నగిల్లుతున్న సృజనాత్మకత
నవతెలంగాణ-పరకాల
ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మకత కొరవడుతోంది. బట్టి చదువులను ప్రయివేటు విద్యా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులు పాఠ్యాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తమ భావాలను రాతలు, మాటల్లో వ్యక్తీకరించేలా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (పీసీఈ) విధానం ప్రయివేటు పాఠశాలల్లో అటకెక్కింది. బట్టి చదువుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర విద్యాశాఖ 2012-13 విద్యా సంవత్సరంలో పీసీఈ విధానాన్ని ప్రవేశపెట్టి 2014-15 విద్యా సంవత్సరం నుంచి పీసీఈ విధానానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థిలో స్వీయ రచనా శక్తి, సృజనాత్మకత, పరిశోధన, పరిశీలన శక్తి, గణిత సమస్యల సాధన నైపుణ్యాలను వెలికి తీసి వారి వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేయాలనే ఉన్నత లక్ష్యంతో రూపొందించిన పీసీఈ విధానాన్ని జిల్లాలో ప్రయివేటు పాఠశాలలేవీ అమలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతర సమగ్ర మూల్యాంకనం (పీసీఈ) విధానం వల్ల
ప్రయివేట్ పాఠశాలల్లో బట్టి చదువులు
విద్యార్థుల్లో పరిశీలన, సంగ్రహణ శక్తిని మెరుగుపర్చుతుండడంతో ఒకటో తరగతి నుంచి అమలు చేస్తున్నారు. కానీ ప్రయివేటు పాఠశాలలు మాత్రం విద్యాశాఖ మార్గదర్శకాలను ఏమాత్రం పట్టించుకున్నట్టు కనబడడం లేదు. వరంగల్ రూరల్ జిల్లాలో 498 ప్రాథమిక పాఠశాలలు, 143 ప్రాథమికోన్నత పాఠశాలలు, 279 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 47వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రయివేటు పాఠశాలల విషయానికొస్తే 60 ఉన్నత పాఠశాలలు, 50 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా 50వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.
విద్యార్థి కేంద్రీకృత బోధనే లక్ష్యం
విద్యార్థి కేంద్రీకృతంగా బోధన జరగాలన్న లక్ష్యంతో విద్యాశాఖ పీసీఈ విధానాన్ని రూపొందించింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా పీసీఈ విధానంలో పరీక్షలను నిర్వహించేలా ప్రశ్నావళిని రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఇంతటి ఉన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టిన పీసీఈ విధానం ప్రభుత్వ పాఠశాలల్లో ఆచరణలో కొనసాగుతున్నప్పటికీ ప్రయివేటు పాఠశాలల్లో మాత్రం ఇప్పటికీ బట్టి చదువులే సాగుతున్నాయి. ఈ పీసీఈ విధానం అమలు తీరును తెలుసుకునేందుకు గతేడాది ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో అధికారుల బృందం పరిశీలన చేపట్టింది. ప్రత్యేక నివేదికలను తయారు చేసింది. సీనియర్ ప్రధానోపాధ్యాయులు, భాషాపండితులు, శాస్త్ర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పరిశీలన చేసి పంపిన నివేదికల్లో ప్రయివేటు పాఠశాలల్లో బట్టి విధానంతో చదువులు సాగుతున్నాయని తెలిపింది.
పాఠాలు నేర్వని విద్యాశాఖ
పీసీఈ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతరంగా ప్రయివేటు పాఠశాలల్లో అమలు చేయడంలో జిల్లా విద్యాశాఖ ఘోరంగా వైఫల్యం చెందినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీసీఈ అమలు తీరుపై గతేడాది తనిఖీ బృందాల నివేదికలను అనుసరించి ప్రయివేటు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యావాలంటీర్లకు శిక్షణా తరగతులను నిర్వహించాల్సి ఉండగా అమలుకు నోచుకోలేదు. విద్యార్థుల విద్యాప్రగతిని కేవలం పరీక్షల ద్వారానే అంచనా వేయడం శాస్త్రీయ విధానం కాదని, ప్రత్యామ్నాయ విధానం ద్వారా మూల్యాంకనం చేయవచ్చని పీసీఈ విధానం చెబుతుండగా, ప్రయివేటు పాఠశాలల్లో ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలువుతున్నా ప్రయివేటు పాఠశాలల్లో పాత విధానంలోనే బోధన కొనసాగుతోంది. చాలా ప్రయివేటు పాఠశాలల్లో మొదటి నిర్మాణాత్మక మూల్యాంకనం పరీక్షలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసే విధానంలో ప్రశ్నపత్రాలను రూపొందించాల్సిన ఉపాధ్యాయులు తమ అవగాహన లేమితో పాతపద్ధతిలోనే ప్రశ్నపత్రాలను రూపొందించి బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు తాము అభ్యసించే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా బాలసాహిత్యం, ఇతర పుస్తకాలు చదివి వాటిపై సమీక్ష, నివేదికలు రాయాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ అమలు కావడంలేదు.
బట్టి చదువులకే ప్రాధాన్యం
విద్యార్థి తన భావవ్యక్తీకరణకు ఉపయోగించే సాధనల్లో వాక్ రూపం మొదటిదైతే లిఖిత రూపం రెండోది. లిఖిత రూపంలో భావవ్యక్తీకరణ చేయడానికి ఉపయోగపడేది రాత పని. విద్యార్థి తన భావాలను కొంత మాటల్లో సృజనాత్మకంగా, భాషాంశాలకు సంబంధించిన అంశాలు రాయగలిగినప్పుడే తనలోని మేధస్సు బయటకు వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులే నోట్స్ ఇస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పేరిట ప్రయివేటు ముద్రణ సంస్థలు రూపొందించిన క్వశ్చన్ బ్యాంకు పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నారు. వాటిని అనుసరించడంతో విద్యార్థులు బట్టి చదువులకు అలవాటు పడుతున్నారు.
ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన లేమి
పీసీఈ బోధన పద్ధతులపై ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన లేదని తెలుస్తోంది. విద్యార్థుల సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల మెప్పు పొందేందుకు ఎక్కువ మార్కులు వేస్తున్న సందర్భాలు ఉన్నాయి.