Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం
- ధనార్జనే ధ్యేయంగా అక్రమ మార్గంలో సర్జరీలు
- లింగనిర్ధారణ.. భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వైనం
- వరుస ఘటనలతో ఆలస్యంగా మేల్కొన్న వైద్యాధికారులు
- నానీ ఆస్పత్రి సీజ్, వినాయక హాస్పిటల్ గుర్తింపు రద్దు
- మాక్స్ దవాఖానకు నోటీసులు
- ఒత్తిళ్లతో విచారణ ముందుకు సాగేనా..?
జిల్లా కేంద్రంలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అనర్హులతో సర్జరీలు చేయించి రోగులను పొట్టనబెట్టుకుంటున్నారు. యథేచ్ఛగా లింగనిర్ధారణ, భ్రూణ హత్యలు చేస్తున్నారు. ఆలస్యంగా ఉన్నతాధికారులు మేల్కొని సదరు దవాఖానలపై చర్యలు తీసుకుంటున్నారు. వినాయక ఆస్పత్రి గుర్తింపు రద్దు చేశారు. భ్రూణ హత్యలకు పాల్పడిన నానీ పిల్లల దవాఖానను సీజ్ చేశారు. నెహ్రూపార్క్ సమీపంలోని మాక్స్ ఆసుపత్రిలో డీఎంహెచ్ఓ తనిఖీ చేసి నోటీసులు జారీ చేశారు. అలాగే ఇటీవల ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వరుస మరణాలు సంభవించిన ఘటనలు జనగామ జిల్లా ప్రజలను కలవర పరుస్తున్నాయి. ఈక్రమంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి.
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లా కేంద్రంలో ప్రయివేట్ ఆస్పత్రుల్లో అసాధారణ మరణాలు, భ్రూణహత్యల పరంపర కొనసాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా నిర్వహకులు వ్యవహరిస్తున్నారు. అనర్హులతో ఏకంగా సర్జరీలు చేయిస్తూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. రోగులకు ప్రథమచికిత్స, ట్రీట్మెంట్ చేసి పంపించాల్సిన ఆస్పత్రుల్లో పెద్దాపరేషన్లు నిర్వహిస్తున్నారు. భ్రూణ హత్య పట్టణంలో కలకలం రేగడంతో ప్రయివేట్ దవాఖానల లొసుగులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.
పట్టణంలోని వినాయక ఆస్పత్రిలో మహిళకు అబార్షన్ చేసి గుట్టు చప్పుడు కాకుండా సమీపంలోని నానీ పిల్లల ఆస్పత్రి స్టోర్రూంలో ఉంచారు. అజ్ఞాత వ్యక్తి సమాచారంతో స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి తనిఖీ నిర్వహించారు. నాని ఆస్పత్రిని సీజ్ చేసి, వినాయక ఆస్పత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేశారు. ఓ ప్రయివేట్ దవాఖాలో రెండు నెలల్లో నలుగురు మరణించారు. ఈ ఘటనలను కప్పిపుచ్చుకునేందుకు చేయని ప్రయత్నమూ లేదు. డబ్బులతో విషయాన్ని బయటికి రాకుండా చూశారు.
కాసుల కోసం కక్కుర్తి
కాసుల కోసం ప్రయివేట్ ఆస్పత్రుల నిర్వహకులు చేయకూడని పనినీ చేస్తున్నారు. అనుభవం లేని అనర్హులతో శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. జ్వరం వచ్చినా, కడపునొప్పి, తలనొప్పి అయినా అవసరానికి మించి పరీక్షలు చేస్తూ రోగిని పిప్పి పీల్చుతున్నారు. ఆపరేషన్లకు అనుమతి లేని ఆస్పత్రుల్లో పెద్దాపరేషన్లు చేస్తున్నారని స్వయంగా డీఎంహెచ్ఓ ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది. ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చే అనుమతి ఉన్న పట్టణంలోని మాక్స్ ఆస్పత్రిలో గత సోమవారం నలుగురు మహిళలకు సర్జరీలు చేశారు. విషయం తెలుసుకున్న ప్రసన్నకుమారి తనిఖీ చేసి నోటీసులు జారీ చేశారు.
వినాయక ఆసుపత్రిలో సదరు డాక్టర్ లేకపోతే ఎలాంటి అర్హత లేని రామనాథంతో ఆసుపత్రి నిర్వాహకులు సర్జరీ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా వచ్చిరాని వైద్యంతో రోగుల జీవితాలతో ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆడుకుంటున్నాయి.
మూత పడనున్న స్కానింగ్ సెంటర్
ఆడా, మగ అని నిర్ధారణ చేస్తూ భ్రూణ హత్యలకు కారణమవుతున్న స్కానింగ్ సెంటర్ త్వరలో మూతపడనుంది. వినాయక ఆస్పత్రిలో జరిగిన ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.
చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం : డీఎంహెచ్వో అన్నప్రసన్న కుమారి
నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేటు ఆస్పత్రుల యజమానులు వ్యవహరిస్తున్నాయి. సదరు దవాఖానలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. భ్రూణహత్యల విషయంలో కేసులు నమోదుచేశాం. వినాయక ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేశాం. నానీ ఆస్పత్రిని సీజ్ చేశాం. నిబంధనల ప్రకారం నిర్వహణలేని మ్యాక్స్ హాస్పిటల్కు నోటీసులు జారీచేశాం.
బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు : రవీందర్, ఎస్సై
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలపై చర్యలు తప్పవు. విచారణ తుదిదశకు చేరింది. త్వరలో బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ముందుకు సాగుతున్నాం.