Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
కాంగ్రెస్ పార్టీతోనే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంపీపీ జక్కా అశోక్ అన్నారు. మండలంలోని కోనాపురం గ్రామంలో సుమారు 30 మంది యువకులు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో శనివారం చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. వందలాది మంది యువకుల ప్రాణత్యాగాల ఫలితంగానే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ యువతను విస్మరించి దుర్మార్గపు పాలన సాగిస్తోందని విమర్శించారు. యువత ప్రాణత్యాగాలకు ఒడిగడుతుండగా చలించిన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయించగా కేసీఆర్ మోసపూరితంగా వ్యవహరించి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారాన్ని చేజిక్కించుకున్న దుష్టపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గతంలో యువతకు తగిన ప్రాతినిధ్యం లభించిందని చెప్పారు. భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తదనంతరం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నోటిఫికేషన్లు జారీ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చొరవ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు. నాలుగేండ్లపాటు నియోజకవర్గాన్ని విస్మరించి ఎన్నికల సందర్భంగా సుదర్శన్రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ మోసపూరిత హామీలు గుప్పిస్తూ ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ రాంరెడ్డి, ఎంపీటీసీ రాములు, నాయకులు లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.